ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఉపన్యాసాలతో కూడిన ‘Great speeches of world’
అనే ఒక పుస్తకం ఉన్నది. ఉపన్యాసాన్ని ఎంత ఎఫెక్టివ్గా, సందర్భానుసారంగా చెప్పవచ్చనేది ఇటీవల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసెంబ్లీలో చేసిన ప్రసంగం విన్న తర్వాత నాకు ఆ పుస్తకం గుర్తుకువచ్చింది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది, మరోవైపు సరిహద్దు దాటగానే పక్క రాష్ర్టాల నుంచి మొదలుకొని యావత్ దేశం సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చెప్పుకొంటూనే, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సమన్వయంతో సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం. ఒక్క నిమిషం తెలంగాణ ప్రజల గురుంచి చెప్పారు, ఇంకో నిమిషం దేశంలో ఉన్న సంకట పరిస్థితిని ఎత్తిచూపారు. రెండిటి మధ్యన ఎలాంటి తత్తరపాటు లేదు, అస్పష్టత లేనే లేదు. పదాల కోసం తడుముకోవడం లేదు. ఎంతో స్పష్టత, అవగాహనతో కేటీఆర్ ప్రతీ విషయాన్ని పూసగుచ్చినట్లు ప్రజలకు చెప్పారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై, దేశ భవిషత్తుపై, దేశ వర్తమానం మీద ఉన్న అవగాహనతోనే అయన అంత గట్టిగ, స్పష్టంగా చెప్పగలిగారు. తెలంగాణ పట్ల ప్రేమ ఎందుకు కనిపించిందంటే ఒక యువకుడిగా, ఒక ఉద్యమకారుడిగా అయన చూసినటువంటి తెలంగాణలో, చదివినటువంటి తెలంగాణలో, అర్థం చేసుకున్నటువంటి తెలంగాణలో ఆయన స్వీయానుభవాలను తనకు గుర్తున్నటువంటి మంచి విషయాలను, కొటేషన్లను, తన జీవితంలో జరిగినటువంటి సంభాషణలను చెప్పడం గొప్ప విషయం.
ముచ్చట చెప్పడమే కాదు, తనకు నిజ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలను.. ముఖ్యంగా ‘మిషన్ భగీరథ’ దగ్గర ‘అంశాల స్వామి’ని, ‘సాగునీటి’ దగ్గర ‘కృష్ణారెడ్డి’ని, ‘దళితబంధు’ దగ్గర ‘దేవయ్య’ను ఇట్లా నలుగురైదుగురు వ్యక్తుల పేర్లు చెప్పడమనేది తెలంగాణ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితుల పట్ల, భవిష్యత్తు పట్ల ఉన్న స్పష్టతకు నిదర్శనం. ఒకప్పుడు దేశ మాజీ ప్రధాని వాజపేయి పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని విన్నాం. ఒక ప్రసంగంతో చాలామందికి ఏమవుతుందనుకునే వాళ్లకు గుర్తుచేయాలనుకుంటున్న. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన అనేక సందర్బల్లోనూ ఒక ప్రసంగంమే ప్రధాన కారణమైంది. ఈ మధ్యకాలంలో నా మదిలో ఉన్నటువంటి గొప్ప ప్రసంగం ఏమంటే ఒక యువకునిగా, దేశం పట్ల కొంత ఆర్తి కలిగిన సందర్భంలో, అప్పటి కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించే ఒక వ్యక్తిగా స్టేటస్ కో నుంచి దేశం ఉజ్వలంగా ఎదగాలన్న తాపత్రాయం ఉన్న యువకుడిగా ఉన్నప్పుడు వాజపేయి ప్రభుత్వాన్ని కూలదోసే సమయంలో తాను రాజకీయాల కోసం ఇచ్చిన ఒక ప్రసంగంతో దేశ ప్రజలు వాజపేయి వైపు నిలబడ్డారు.
ఈ రోజు కూడా అదే పరిస్థితి దేశంలో ఉన్నది. ముఖ్యంగా దేశం కోసం ఎజెండాను ఎత్తుకొని ముందుకు పోదామనుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఒకవేళ జరుగుతున్నా తనకేం లబ్ధి చేకూరింది? మనం దీన్నిదాటి ముందుకుపోవాలా లేదా? అనేటువంటి సంశయాన్ని కేటీఆర్ ప్రసంగం ఛేదించింది. ఒక పార్టీ కార్యకర్తగా, నాయకునిగా ఇది మాకు కరదీపిక అయింది. ఎందుకు కరదీపిక అంటున్నానంటే మా విధి విధానాలు మాకు తెలుసు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం అర్థమైంది. ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగాం అనే సోయి మాకున్నది. ఒక నడుస్తున్న చరిత్రను కేటీఆర్ రెండు గంటల్ల, ఏకబిగిన ఉపన్యాసంలో, ఆటంకం లేకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా అద్భుతంగా చెప్పగలిగారు.
రాజకీయాల్లో అనేకమంది నాయకులను చూశాం. మాట్లాడే సందర్భంలో ప్రతిపక్షాలపై మాట్లాడితే వినేవాళ్లకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ కేటీఆర్ మట్లాడినప్పుడు చాలా సున్నితంగా, బలంగా ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ఒకేసారి సమాంతరంగా చెప్పారు. అది కేటీఆర్లో ఉన్నటువంటి పరిణతిని తెలియజేసింది. రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన ప్రసంగం అద్భుతం. ఈ ప్రసంగం ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోతుందనేది చెప్పి ముగించాలనుకుంటున్న. ఇది ముమ్మాటికీ చరిత్రాత్మకమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు, ప్రగతి ప్రస్థానం ముమ్మాటికీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదే . ఈ చరిత్రను అద్భుతంగా వివరించారు కేటీఆర్. ఆయన ప్రసంగం శాసనసభ రికార్డుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేటీఆర్ ప్రసంగం తెలంగాణ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. మేమంతా కేసీఆర్ ప్రసంగాలు విని ఉద్యమంలో ముందడుగు వేశాం. రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నాం. కేసీఆర్కు ఉన్న గొప్ప గుణం ఏమంటే ఎన్ని గంటలు మాట్లాడిన మళ్లీ మళ్లీ వినాలనేటువంటి ఆత్రుత, ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పటికీ చెదరదు.
ఈ మాటనడం భావ్యమో కాదో తెలియదు. కానీ, కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడి, ఆయన ప్రసంగం ముగిశాక టైం చూస్తే తెలిసింది రెండు గంటలు దాటిందనే విషయం. అర్థవంతంగా, మనషులను ఆలోచింపజేసేలా గొప్ప అనుభవం, పరిణతి, స్పష్టత అన్నిటికంటే ముఖ్యంగా భావవ్యక్తీకరణ కేటీఆర్ ప్రసంగంలో కనిపించింది. కాబట్టి ఒకటి బలంగా నమ్మదలచుకున్న. తెలంగాణ భవిషత్తుకు వాక్పటిమ ఉన్న నాయకుడు దొరకాడని, భవిషత్తుకు భరోసా దొరికిందని భావిస్తున్నాను. ఇలాంటి ప్రసంగాలు యువతరం వినాల్సిన అవసరం ఉన్నది. తద్వారా యువతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలంగాణ ప్రగతిని విశ్వవ్యాప్తం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి: 95530 86666
(వ్యాసకర్త: రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్)