రాష్ట్రంలో 59,325 మంది చేనేత, దాని అనుబంధ కార్మికులున్నారు. 41,556 మంది పవర్ లూములపై, సుమారు 10 వేల పైచిలుకు మంది నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 95 శాతం మంది పద్మశాలీలే ఉండటం గమనార్హం. రాష్ట్ర చేనేత, వస్త్ర శాఖ ఆధ్వర్యంలో 334 చేనేత సహకార సంఘాలు ‘టెస్కో’ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. 4వ అఖిల భారత చేనేత లెక్కల ప్రకారం కేవలం 25,930 మంది చేనేత కార్మికులు, 21,922 మంది దాని అనుబంధ కార్మికులున్నారు. ఈ చేనేత కార్మికులు స్వతంత్ర నేత కార్మికులు, కో-ఆపరేటివ్ సొసైటీ కింద పనిచేసే నేత కార్మికులు, మాస్టర్ వీవర్స్ అని మూడు రకాలు.
స్వతంత్ర నేత కార్మికులు సొంతంగా నూలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి, ఇంటి దగ్గర మగ్గంపై వస్ర్తాలు నేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటారు. సహకార సంఘాల నుంచి నూలు, ఇతర సామగ్రి తీసుకొని, ఇంటివద్ద సొంత మగ్గంపై గానీ, సొసైటీలో ఉన్న మగ్గంపై గానీ వస్ర్తాలను నేసి వాటిని సొసైటీకే అప్పగిస్తారు. వీటి మార్కెటింగ్ అంతా ప్రభుత్వ నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. దీనిలో ప్రభు త్వం ఖరారు చేసిన రేటు ప్రకారం కూలీ చెల్లిస్తారు. లాభ-నష్టాలను సొసైటీ లేదా ప్రభుత్వం చూసుకుంటుంది. ‘మాస్టర్ వీవర్స్’ అంటే కొన్ని మగ్గాలున్న ప్రైవేట్ యజమానులు. వారు కొంతమంది నేత కార్మికులను ఒప్పంద పద్ధతిలో తీసుకొని, వారి చేత వస్ర్తాలను నేయిస్తారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎక్కువగా సొసైటీ కింద పని చేస్తుండగా, పవర్లూమ్ కార్మికులు ఎక్కువగా మాస్టర్ వీవర్ల కింద పనిచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత చేనేత రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అందుకే 1998లో గుండ్ల పోచంపల్లి వద్ద అపరెల్ పార్క్, 2002లో సిరిసిల్ల, పాశ మైలారం ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్క్, 2003లో మల్కాపూర్ వద్ద టెక్స్ టైల్ పార్క్, 2006లో గద్వాల దగ్గరలో హ్యాండ్లూమ్ పార్కులకు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకొని చేనేత రంగానికి ఊపిరులూదాలని దృఢ నిశ్చయానికి వచ్చింది. ఇందులో భాగంగా నేత కార్మికులకు పనికల్పించే ఉద్దేశంతో ‘బతుకమ్మ చీరలు’ నేయించి, వాటిని 18 ఏండ్లు నిండిన ఆడ పడచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఉచితంగా అందిస్తున్నది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.100 కోట్లు ఖర్చుచేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2017లో వరంగల్ జిల్లా సంగెం వద్ద 1300 ఎకరాల విస్తీర్ణంలో 20 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ. 3 వేల కోట్లు వెచ్చించింది. దానికోసం 14 కంపెనీలతో ఒప్పందం చేసుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, సిరిసిల్ల వద్ద అప్పారెల్ పార్కు, 2018లో గద్వాల వద్ద హ్యాండ్లూమ్ పార్కులకు శంకుస్థాపన చేసింది. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 2 వేల మగ్గాల సామర్థ్యంతో స్థాపించింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణకు రూ.15 కోట్లు కేటాయించింది.
ఇంకా ‘వర్కర్ టు ఓనర్’ స్కీమ్ కింద 4,416 పవర్ లూమ్లను నెలకొల్పి, 1,104 మంది నేత కార్మికులను యజమానులను చేసింది. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉన్న 108 యూనిట్ల పవర్లూమ్ యజమానులకు 50 శాతం పవర్ టారిఫ్ ప్రకటించింది. ‘పావలా వడ్డీ’ రుణాలు తీసుకునే నేతన్నలకు నూలు కొనుగోలుకు, మార్కెటింగ్ అవసరాలకు 20 శాతం రాయితీ ఇస్తున్నది. నేతన్నకు ‘చేయూత’ పథకం కింద నేత కార్మికుల ఖాతాల్లో ‘త్రిఫ్ట్ ఫండ్’ జమ చేస్తున్నది. ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా నేత కార్మికులకు పెట్టుబడి రాయితీతో ముడిపడిన కూలీని చెల్లిస్తున్నది. ఏటా చేనేత రంగంలో ప్రతిభ కనబర్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ అవార్డ్ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి నేత కార్మికుల కోసం ‘నేతన్నకు బీమా’ అనే కొత్త పథకాన్ని అమలుచేస్తున్నది. దీనికోసం ప్రభుత్వమే ఎల్ఐసీకి రూ.50 కోట్లను ప్రీమియం కింద చెల్లిస్తున్నది. దీనిద్వారా రాష్ట్రంలో 18-59 ఏండ్ల వయసున్న సుమారు 80 వేల నేత కార్మికులకు ఈ బీమా వర్తిస్తుంది. వీరిలో ఎక్కువ మంది చేనేత కార్మికులు కాగా, మిగిలిన వారు పవర్లూమ్ కార్మికులు. ఏ కారణం చేతనైనా నేత కార్మికులు చనిపోతే రూ. 5 లక్షల బీమా సొమ్ము వారి కుటుంబసభ్యులకు 10 రోజుల్లో అందిస్తున్నది. మునుముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే సంక్షేమ కార్యక్రమాలతో చేనేత రంగం మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది.
డాక్టర్ జి.శ్రీరాములు :92484 24384