రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావంటే.. సత్యహరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తానందట! అచ్చం అట్లాగే వ్యవహరిస్తున్నది ‘అధికారం’! నన్ను అందుకోండంటూ ఒకపక్క బీజేపీ జాతీయ అగ్రనేతలను ఆరాటపెడుతూనే, మరోపక్క కాంగ్రెస్ అగ్రనేతలను ఆటపట్టిస్తున్నది. ఇరుపార్టీల నాయకులను తెలంగాణ వైపు ఉసిగొల్పుతున్నది. అందుకేనేమో నీళ్లు నములుతూ నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీపడి మరీ ఢిల్లీ నుంచి పరిగెత్తుకు వస్తున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు. తెలంగాణకు తీర్థయాత్రలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పెద్ద నేతలు మాట్లాడుతున్న మాటలు, ఆడుతున్న అబద్ధాలు నరం లేని నాలుక ఎటైనా తిరగగలదని నిరూపిస్తున్నాయి. ‘కాదేది కవితకు అనర్హం’ అనే మాటపై మట్టికప్పుతూ ‘కాదేదీ అబద్ధానికి అనర్హం’ అనే మాటకు తెరదీస్తున్నారీ నాయకులు. ఈ జాతీయ నేతల చేష్టలు చూస్తే ఆ గురివింద గింజ కూడా పగలబడి నవ్వుతుందేమో!
శనివారం చేవెళ్లలో ప్రజాగర్జన బహిరంగ సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకమాడితే.. ఆదివారం ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ పేరుతో బీజేపీ కర్షకులపై కర్కశంగా వ్యవహరించి, కసి తీర్చుకున్న తీరును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు గడప దాటవనే సామెత బీజేపీ అగ్ర నేతల్లో ఒకరైన అమిత్ షాను చూస్తే వెంటనే గుర్తుకువస్తుంది. తెలంగాణలో అవినీతి, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఆయన, ఆరని మణిపూర్ మంటలను మరిచిపోవడం, ఆ ప్రస్తావనే తీసుకురాకపోవటం బాధాకరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను ఎన్నో అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్ కొత్తగా ఆ మహనీయుడి పేరును రానున్న ఎన్నికల్లో ముడిసరుకుగా వాడుకోజూడటం సిగ్గుచేటు. 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్కు ప్రజల మద్దతు కోరిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఏకంగా ‘అంబేద్కర్ అభయహస్తం’ ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామంటూ ప్రజల చెవుల్లో పెద్ద పువ్వు పెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరం. ఇది దళితబంధుకు పక్కా కాపీ.
నిన్నటిదాకా మోదీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టగా, ఇప్పుడు కాంగ్రెస్ దళితబంధును నకల్ కొట్టింది. కనీసం పథకాలనైనా సృజనాత్మకంగా రచించలేని దౌర్భాగ్యస్థితి ఆ పార్టీలది! దూపయినప్పుడే బావి తవ్వుకుందామన్నట్టుగా వ్యవహరించే ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా గిట్టదు. రాష్ట్ర అభివృద్ధి అంటే అంతకన్నా పట్టదు. కానీ, తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని తెలిస్తే మాత్రం లగెత్తుకు వచ్చి అధికారం కోసం అవాకులు చెవాకులు పేలుతాయి. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరనేది అక్షర సత్యం. గంగా జమునా తెహజీబ్కు ప్రతీక అయిన తెలంగాణలో మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుంటే, అధికారం కోసం తహతహలాడుతూ రాష్ర్టాన్ని కుంభకోణాల మయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నది. అభివృద్ధికి, అబద్ధానికి జరుగుతున్న పోరులో గెలుపు అభివృద్ధిదే. మరో మూడు నెలల్లో ఇదే తేలనున్నది!