Operation lotus | కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్పంగా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి. బీజేపీ సిట్టింగ్లు కొందరికి టికెట్ నిరాకరించడంతో వారు కోపంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఒకవేళ వారు గెలిచే పక్షంలో బీజేపీలోకి తిరిగి లాగి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఆపరేషన్ కమలం ప్లాన్ ‘ఏ’గా ప్రచారం జరిగింది.
దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయి రాత్రికి రాత్రి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తమకున్న సమాచారం ప్రకారం ఆపరేషన్ కమలం ప్లాన్ ‘ఏ’ కంటే ముందు ప్లాన్ ‘బి’ మొదలుపెట్టిందని వారు వాపోయారు. అందులో భాగంగా మోదీ ప్రతినిధులు సింగపూర్ వెళ్లి కుమారస్వామితో అక్కడే మంతనాలు జరిపినట్టు తమకు సమాచారం ఉన్నదని చెప్పడంతో ఆపరేషన్ కమలా? కమాలా? అని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయినట్టు కన్నడ పత్రికలు బయటపెట్టాయి.
మునుగోడు ఎన్నికల్లో అధికార పార్టీ కోట్లు కుమ్మరించి గెలిచిందని ఆరోపించే బీజేపీ నాయకులు… ఒక్కసారి ‘పెద్దలు’ జానారెడ్డి సమక్షంలో జరిగిన పంచాయితీలో బయటపడిన దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. నల్లగొండలో నిరుద్యోగ ధర్నాకు జనాన్ని సమీకరించి సక్సెస్ చేసిన తమ పేర్లను పీసీసీ అధినేత రేవంత్రెడ్డి తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని ‘పెద్దలు’ జానారెడ్డిని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, స్థానిక జడ్పీటీసీ, పీసీసీ జనరల్ సెక్రటరీలు మూకుమ్మడిగా నిలదీశారు.
మునుగోడు ఎన్నికల సమయంలో తనవెంట వస్తే మూడు కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చినా పార్టీ మారలేదని పీసీసీ జనరల్ సెక్రటరీ ఒకరు వాపోయారు. ఆయన మూడు కోట్లు ఇస్తానని ఆఫర్ ఇస్తానని చెప్పింది వాస్తవమని మైసమ్మ గుడిలో ప్రమాణం చేయడానికైనా సిద్ధమని సదరు నేత బాహాటంగా సవాల్ విసిరారు. ఒక పార్టీ నాయకుడికే మూడు కోట్లు ఆఫర్ చేసిన రాజగోపాల్రెడ్డి మునుగోడులో డబ్బు ప్రభావంతో తను గెలువలేకపోయినట్టు సుద్దపూసలా మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయింది.
కర్ణాటక ఫలితాలు అక్కడ పాలక, ప్రతిపక్షాల భవిష్యత్ ఒక్కటే తేల్చడం లేదు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు కూడా వీటిని ప్రీ ఫైనల్గా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాము కాంగ్రెస్, బీజేపీ ఏ కండువా కప్పుకోవాలనేది కర్ణాటక ఫలితాలను బట్టే ఖరారవుతుందని తెలంగాణలో కొందరు నాయకులు ప్రకటించారు. పొరుగున ఆంధ్రప్రదేశ్లో దారితెన్నులేని జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజకీయ భవితవ్యానికి కూడా కర్ణాటక ఫలితాలు మార్గదర్శకం కానున్నాయని అంటున్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో జేడీఎస్ కింగ్ మేకర్గా మారి కుమారస్వామి సీఎం అయితే, అదే ఫార్ములాను పవన్కల్యాణ్ ఫాలో కావాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం.
ఆంధ్రలోనూ వైసీపీ, టీడీపీ ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు చేరుకునేంతటి సీట్లు గెలుచుకోకుండా హంగ్ ఏర్పడే పక్షంలో పదో, పాతికో సీట్లు గెలుచుకున్నా కింగ్ మేకర్గా మారి అప్పుడు ఏకంగా సీఎం సీటే అడగవచ్చని పవన్కల్యాణ్ తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. కనీసం ఎంఐఎంలా ఏడు సీట్లయినా గెలుచుకోకుండా సీఎం సీటు అడగాలంటే మొహమాటం అడ్డువస్తుందని కూడా పవన్ తన అంతరంగాన్ని బయటపెట్టారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయించుకునే పవన్కల్యాణ్ ఏంది? మరి చీప్గా ఏడు సీట్లు అయినా గెలిపించమని ప్రజలను బతిమాలడటం ఏమిటని వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. ఎవరికీ మెజారిటీ రాకపోతే… టైర్ పంచర్ అయితే స్టెప్నీతో జర్నీ చేసినట్టు పవన్కల్యాణ్ కూడా స్ట్రెయిట్ పాలిటిక్స్ వదిలేసి స్టెప్నీ పాలిటిక్స్ గురించి ఆలోచించడం ఏమిటని జనసేనలో ఆశలు సన్నగిల్లుతున్నాయట.