ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు శాంతిభద్రల నిర్వహణ పేరిట జైళ్లను నిర్మిస్తే, సీఎం కేసీఆర్ పాలనలో జైళ్లు మాయమై అత్యాధునిక దవాఖానలు వెలుస్తున్నాయి. వరంగల్లో గతంలో సెంట్రల్ జైలు ఉన్న ప్రదేశంలో.. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం అవుతుండటం దీనికి ఉదాహరణ.
ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాయి సేవలను కొత్త దవాఖానలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 2021 జూన్ 21న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 57 ఎకరాల విశాలమైన స్థలంలో రూ.1,116 కోట్ల వ్యయంతో 24 అంతస్తులలో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్)ను వినియోగించేలా హాస్పిటల్ భవనంపై హెలిపాడ్ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి కూడా రోగులు వరంగల్కు వచ్చి వైద్యం చేయించుకునే స్థాయిలో ఈ దవాఖానను తీర్చిదిద్దుతున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందేలా కొత్త హాస్పిటల్లో వసతులు కల్పిస్తున్నారు. ఈ అత్యాధునిక దవాఖాన భవనాన్ని పూర్తి పర్యావరణ హితంగా నిర్మిస్తున్నారు. ఒక దవాఖాన, అదీ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులు ఇంత వేగంగా జరిగిన ఉదాహరణ మరెక్కడా లేదు.
వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంట్లో భాగంగానే పలు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వరంగల్లో ప్రత్యేకంగా వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీకి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.25 కోట్లతో ఐదు అంతస్తులలో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయంగా దీనికి పేరు పెట్టారు. కాళోజీ యూనివర్సిటీ కొత్త భవనాన్ని సీఎం కేసీఆర్ 2021 జూన్ 21న ప్రారంభించారు. అదే రోజు వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. శరవేగంగా దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. ఈ హాస్పిటల్లో వైద్యసేవలకు సంబంధించిన 35 విభాగాలు, వీటిలో 77 యూనిట్లు ఉంటాయి. గుండె, కాలేయం మార్పిడి ఆపరేషన్లు, క్యాన్సర్కు అత్యాధునిక చికిత్సలతోసహా దాదాపు అన్ని వైద్యసేవలు దవాఖానలో అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న విశాలమైన భవనంలో 2,458 బెడ్స్ ఏర్పాటు చేస్తారు. 500 మంది డాక్టర్లు, వెయ్యి మంది నర్సులు, పారామెడికల్తోపాటు ఇతర సిబ్బంది మరో వెయ్యి మంది పని చేయనున్నారు. అన్ని బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉంటుంది. మొత్తం పది రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసేలా భవన నిర్మాణం కొనసాగుతున్నది. ఐదు అంతస్తులలో ఆపరేషన్ థియేటర్లను నెలకొల్పుతారు. డయాగ్నస్టిక్స్, సర్జికల్, మెడికల్, ఐసీయూ విభాగాలు ప్రత్యేకంగా ఉంటాయి. శస్త్ర చికిత్సలు, అత్యవసర సేవల కోసం సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తారు. రోగులకు, వైద్యులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు వీలుగా సెంట్రల్ మెకానికల్ లాండ్రీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సెంట్రల్ కిచెన్ ఉంటుంది.
వైద్య ప్రక్రియలో ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండనున్నాయి. భవనం మొత్తాన్ని పర్యావరణ హితంగా నిర్మిస్తున్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించనున్నారు. దవాఖాన ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పూల మొక్కలను, పచ్చికను ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నారు.
సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ సెంట్రల్ జైలుకు వచ్చి, ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ అతి పెద్ద దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. జూన్ 1న ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలై జూన్ 11తో పూర్తయ్యింది. సెంట్రల్ జైలు కూల్చివేత ప్రక్రియ ముగిసింది. హోంశాఖ ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించింది. ఐదు ఎకరాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కోసం కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించారు. మిగిలిన స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం నిర్మాణ పనులు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి.
వరంగల్ నగరాన్ని సమగ్ర ఆరోగ్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. దీంట్లో భాగంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఆనుకుని ఉన్న 200 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంప్లెక్సును రూపొందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు డెంటల్ కాలేజీని, వెటర్నరీ కాలేజీని గత జూన్లో మంజూరు చేశారు. ప్రస్తుత ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ(ఎంసీహెచ్) కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు, ఒకేసారి 1500 మంది మహిళలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ కొత్త భవనం నిర్మించేలా ప్రణాళికలు ఉన్నాయి. దీంట్లో భాగంగానే వరంగల్ జిల్లాకు కొత్తగా మరో మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ నగరంలోనే ఉన్నా, సాంకేతికంగా హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. వరంగల్ జిల్లా కోటాలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఈ విధంగా అన్ని రకాల వైద్య సేవలు, వైద్య విద్యాసంస్థలతో వరంగల్ అతి త్వరలోనే హెల్త్సిటీగా మారనుంది.
సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ సెంట్రల్ జైలుకు వచ్చి, ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ అతి పెద్ద దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందే సీఎం ఆదేశాల మేరకు వరంగల్ సెంట్రల్ జైలులోని ఖైదీలను తరలించేందుకు 2021 మే 31న హోంశాఖ ఉన్నతాధికారులు కార్యచరణ రూపొందించారు. జూన్ 1న ఖైదీల తరలింపు ప్రక్రి య మొదలై జూన్ 11తో పూర్తయ్యింది. హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా సెంట్రల్ జైలు కూల్చివేత ప్రక్రి య ముగిసింది. హోంశాఖ ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించింది. ఐదు ఎకరాలను కాళోజీ ఆరో గ్య విశ్వవిద్యాలయం కోసం కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించారు. మిగిలిన స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం నిర్మాణ పనులు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన సీఎం కేసీఆర్.. ప్రజావైద్య రంగంలో శాశ్వత వసతుల కల్పన దిశగా బృహత్తర కార్యాచరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇటీవల 170 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణకు ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదు. వైద్యసేవల పరంగా కేంద్రం మొండిచేయి చూపుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అహరహం శ్రమిస్తున్నది.
కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న స్ఫూర్తితో, దీర్ఘకాలికంగా వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలే ఉండేవి. కానీ, తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయినాక ప్రతి జిల్లాకొక మెడికల్ కాలేజీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణగా కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
తక్కళ్లపల్లి రవీందర్రావు
(వ్యాసకర్త: శాసన మండలి సభ్యుడు)