ఆచూకీ లేకుండా పోయినవారైనా, తప్పిపోయిన పశువులు, పెంపుడు జంతువులు కానీ, సొమ్ములు, నగదు, వస్తువుల చోరీ జరిగినా అవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఏ మంత్రగాడినో, బాబానో ఆశ్రయిస్తుంటారు. సదరు మాయగాళ్లు అంజనం వేసి ఫలానా దిక్కున ఉన్నాయనో, పలానా ముఖ కవళికలున్న వాడు దొంగిలించాడనో క్షణాల మీద తేల్చేస్తారు.
తెలంగాణలో ఇప్పుడా అంజనం వేసే పనిని కాంగ్రెస్, బీజేపీల అధ్యక్షులు నెత్తికి ఎత్తుకున్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ కొశ్చన్ పేపర్లు లీక్ విషయం ఇలా బయటపడిందో లేదో… అదంతా తమకు ముందే తెలుసన్నంత ఈజీగా ఏ పేపర్ ఎప్పుడు? ఎక్కడ లీకయింది, ఆ తర్వాత అవీ ఎక్కడినుంచి ఎక్కడికి పోయింది, అంతా తమ కనుసన్నలలోనే జరిగినట్టు పూసగుచ్చినట్టు మీడియాకు వివరించారు. వీరిలో ఒక నాయకుడైతే నిజామాబాద్ జిల్లా జగిత్యాలలో పేపర్ లీకయిందని ఆరోపించారు. జగిత్యాల ఏ జిల్లానో తెలియని సదరు నేతల ఆరోపణలలో ఎంతమేరకు వాస్తవం ఉన్నదో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే కాబోలు.. సిట్ అధికారులు అడిగిన ఆధారాలకు డొంక తిరుగుడు సమాధానాలు.