తిరునగరి రామాంజనేయులు ‘వెట్టిచాకిరి’, ‘వీరకుంకుమ’ నాటికలు; ‘తెలంగాణ వీర తెలంగాణ’ నాటకాలు రచించాడు. స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కాబట్టి నాటి ఉద్యమ ఇతివృత్తాలను తీసుకొని నాటకంగా రచించాడు. నాటి ఉద్యమ ‘సంఘం’లోని నాయకులే తలా ఒక పాత్రను తీసుకొని నటించి ప్రజల్లో చైతన్యాన్ని తేవటానికి నాటకాన్ని ప్రదర్శించేవారు.
తెలంగాణలో ప్రస్తుతం కొన్ని నాటక సంఘాలు ఏర్పడి నాటక రచనలు, ప్రదర్శనలు చేస్తున్నాయి. నాటక రచనలు, ప్రదర్శనలు పుంజుకొంటున్నాయి. దెంచనాల శ్రీనివాస్ జానపద నాటకరంగ వికాసానికి కృషిచేస్తున్నాడు. కె.వి.రమణాచార్యులు నాటక ప్రదర్శనల పోటీలను నిర్వహిస్తూ నాటక ప్రదర్శనలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలంగాణలో నాటక ప్రదర్శనలు జరుగుతూ ప్రేక్షకులను ఆకర్షించి అలరిస్తున్నాయి.
***
తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కవులు కొంతమంది అభ్యుదయవాదం చేత నిరాశ చెందారు. పోరాటాన్ని తాత్సారం చేయటం పట్ల నిరాశ, నిరసన భావంతో ఉన్నారు. అభ్యుదయవాదం అనుకున్న స్థాయిలో ప్రజాక్షేత్రంలో పనిచేయటం లేదనీ, ప్రజల్లో చైతన్యం తీసుకురాలేకపోతున్నదని భావించి మరో మార్గాన్వేషణలో ఉన్నారు. అదే సమయంలో 1967లో పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి గ్రామంలో రైతులు సాయుధులై భూస్వాముల భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు సాయుధ దళాలుగా సంఘటితమై.. వారి అప్పులను రద్దుచేయాలని పోరాడారు. ఈ పోరాటానికి నక్సల్బరి గ్రామం పేరుతో ‘నక్సల్బరి ఉద్యమం’ లేదా ‘నక్సలైట్ ఉద్యమం’ అని పేరు వచ్చింది. దానికి మేధావివర్గం, విద్యార్థుల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది.
నక్సల్బరి రైతుల పోరాటాన్ని సమర్థిస్తూ అనేక మంది ముందుకు కదిలారు. ఈ నక్సల్బరి ఉద్యమమే తదనంతర కాలంలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. తెలంగాణలో 1952లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని ఆపేసి ఎన్నికల్లో పాల్గొన్నది. పోరాటాన్ని పక్కనపెట్టడం పట్ల నిరాశ చెంది దాన్ని సమర్థించని వారు కొందరు మౌనంగా ఉండిపోయారు.
1970వ దశకంలో దేశంలో పారిశ్రామికరంగంలో స్తబ్ధత ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. పెట్టుబడిదారీ దేశాలు అప్పుల రూపంలో మన దేశంలో ప్రవేశించాయి. ప్రత్యక్ష వలస సామ్రాజ్యవాదం స్థానంలో కొత్త తరహా సామ్రాజ్యవాదం ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకు అప్పుల్లో దేశం కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో, యువకుల్లో ఆందోళన పెరిగింది. వారు నక్సల్బరి సాయుధ పోరాటం చేత ఆకర్షింపబడినారు. నక్సల్బరి పోరాటం ఉత్తరాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు విస్తరించింది. తెలంగాణ విమోచనోద్యమకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంతో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రభావితం కాలేదు. కానీ నక్సల్బరి ఉద్యమ ప్రభావం చేత ఈ జిల్లాల్లో రైతాంగ ఉద్యమం ఊపందుకున్నది. పోరాటాలతో భూస్వాముల పెత్తందారీతనం తగ్గింది. ఎంతోమంది యువతీ యువకులు చదువులను వదిలిపెట్టి పోరాటంలో చేరారు.
సరిగ్గా ఈ నేపథ్యంలోంచే.. తెలంగాణలో సమూహంగా ఏర్పడిన ‘తిరుగబడు కవులు’ 1969 నాటికి విప్లవ సాహిత్యానికి పునాది వేశారు. సమాజాన్ని మార్చడానికి సాయుధ పోరాటమే మార్గమని వారు విశ్వసించారు. విప్లవ సాహిత్యోద్యమానికి నాంది పలికింది తిరుగబడు కవులేనని చెప్పొచ్చు. వారిలో ఒకడైన లోచన్ రచయిత సాయుధం కావాలని 1967లోనే ఇలా పిలుపునిచ్చాడు. ‘ ఈసారి నీ సమాధానం/అరిగిన మాటల్లోకాదు, విరిగిన వెకిలి నవ్వులో కాదు/ ట్రిగ్గర్ మీద పరిగెత్తే వేళ్లలోంచి, మండే కనుల్లోంచి/ తుఫానుల శ్వాసల్లోంచి.. బుల్లెట్ శబ్దంలోంచి రావాలి..’ అని పిలుపునిచ్చాడు. ఇది తిరుగబడు కవుల మార్గం అయ్యింది.
‘నిన్న విడిచిన పోరాటం నేడు అందుకొనక తప్పద’ని’ శ్రీశ్రీ చెప్పినట్లు.. తెలంగాణలో తిరుగబడు కవులు ‘విరసం’ ఏర్పడక ముందు నుంచే పోరాటోన్ముఖులైనారు. విద్యార్థులు, యువకుల ప్రభంజనంతో వేడి వాతావరణంలో శ్రీశ్రీని ప్రజాకవిగా నిలబెట్టి విప్లవ రచయితలసంఘం (విరసం) 1970 జూలై 4న ఏర్పడింది.
నక్సల్బరి పోరాటం కొనసాగింపుగా తెలుగు నేలలో జరిగిన శ్రీకాకుళ పోరాటం, ఆ పోరాటంపై ప్రభుత్వ దమనకాండ, వెంపటాపు సత్యం, పంచాది కృష్ణమూర్తి, నిర్మల, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ చినబాబు లాంటి పోరాటయోధులు ఎదురుకాల్పుల పేరిట హత్యకావింపబడటంతో పోరాటం వెనకపట్టు పట్టినా దాని ప్రభావం తెలుగు సమాజాన్ని అతలాకుతలం చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా ‘రచయితలారా మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు రచయితలు, కవులను నిలదీశారు. పోరాడుతున్న ప్రజల వైపా, రాజ్యం వైపా అని ప్రశ్నించారు. ఈ విశాఖ విద్యార్థుల పిలుపు రచయితల్లో పెద్ద సంచలనం రేపింది. ఈ సామాజిక సందర్భంలోంచే విరసం ఆవిర్భావించింది. ఆనాడు ఉత్తరాంధ్ర కవులు, రచయితలు విరసం ఏర్పాటులో భాగస్వాములుగా ఉండటమేగాక తెలంగాణ నుంచి కూడా అనేక మంది కవులు, రచయితలు పాల్గొన్నారు. విరసం ఏర్పాటులో దిగంబర కవులు, తిరుగబడు కవుల పాత్ర ప్రధానమైనది. చెరబండరాజు, వరవరరావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ ముందుండి ‘విరసం’ను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన చలసాని ప్రసాద్, కె.వి. రమణారెడ్డి కూడా విరసం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. విరసం ఏర్పాటు కన్నా ముందు నుంచే సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ రివిజనిజాన్ని విమర్శిస్తూ కవులు, రచయితలు కలాలెత్తారు. తెలంగాణ కవులు సాయుధపోరాట మార్గాన్ని సమర్థిస్తూ తమ కలాలతో కవాతు చేశారు. విప్లవ బాటను సమర్థిస్తూ, విరసం సిద్ధాంత పునాదులపై కవిత్వం రాశారు. మార్క్సిజం లెనినిజమే కాకుండా మావోయిజాన్ని ప్రతిబింబిస్తూ రచించే సాహిత్యం విప్లవ సాహిత్యంగా ముందుకు వచ్చింది.
సాహిత్య, సాంస్కృతిక, కళా రంగా ల్లో విరసం చేసిన పోరాటం అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా సాహిత్యంలో ఒక యుగాన్నే సృష్టించింది. సాహిత్యం, రాజకీయాలు వేరు వేరు కాదని విరసం అంటుంది. సాహితీవేత్తలు అంతఃపురాల్లో కాకుండా ఆచరణలో ఉండాలని, ప్రజల వైపు నిలువాలని విరసం పిలుపునిచ్చింది. అభ్యుదయ వాదుల వలెనే విరసం వారు కూడా శ్రీశ్రీని తమ యుగకర్తగా ప్రకటించారు.
‘ప్రజా ఉద్యమాల్లో సాహిత్యం ఒక ఆయుధ విశేషం, సమగ్రమైన మానవ స్వాతంత్య్రం వైపు విప్లవ సాహిత్యం మహాప్రస్థానం జరుపుతుంది..’ అని ప్రథమ మహాసభల్లో విరసం తన మార్గాన్ని చాటింది. సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ విరసంకు 1970లో శ్రీశ్రీ అధ్యక్షుడైనాడు. ‘ఝంఝ’ అనే కవితా సంకలనంలో ‘సాయుధ విప్లవ భీభత్సుని సారథివై భారత కురుక్షేత్రంగా నవయుగ భగవద్గీతం ఝంఝని ప్రసరిస్తాను..’ అని శ్రీశ్రీ ప్రకటించాడు. విరసం కవులకు రచయితలకు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం ఒక ఆదర్శమే కాదు, మార్గదర్శకంగా నిలచింది.
దీర్ఘకాలికమైన సాయుధ పోరాటం వల్ల సమ సమాజం సిద్ధిస్తుందని విరసం విశ్వాసం. ఎన్నికలు, సంస్కరణల వల్ల నూతన సమాజం నిర్మాణం కాదనీ, దోపిడీ నుంచి విముక్తిని కల్గించేది సాయుధ పోరాట మార్గమేనని వీరు ప్రకటించారు.
విప్లవ కవుల మొదటి కవితా సంకలనం ‘ఝంఝ’. ఆ తర్వాత ‘మార్చ్’, ‘లే’, అనే కవితా సంపుటాలు వచ్చాయి. వాటిని ప్రభుత్వం నిషేధించింది. దాంతో యువకులు ఇంకా ఆవేశంతో కవిత్వం రాశారు. శ్రీశ్రీ- ‘జట్కావాలా’, ‘భూమ్యాకాశాలు’, ‘తుదిపయనం’, ‘తొలివిజయం’ మొదలైన విప్లవ గీతాలు రచించాడు. చెరబండరాజు- ‘దిక్సూచి’, ‘ముట్టడి’, ‘గమ్యం’, ‘పల్లవి’, ‘ఊరు మేలుకుంది’, ‘గౌరమ్మ కలలు’, ‘శాంతియుద్ధం’ మొదలైన కవితా సంపుటాలు ప్రచురించాడు. నగ్నముని- ‘తూర్పుగాలి’, ‘కొయ్యగుర్రం’ కావ్యాలను రచించాడు. ప్రభుత్వ వ్యవస్థ ‘కొయ్యగుర్రం’ వంటిదని చెప్తూ నగ్నముని ప్రతీకాత్మకంగా ‘కొయ్యగుర్రం’ కావ్యాన్ని రచించాడు.
విరసం ఏర్పడిన తొలినాళ్లలోనే దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) ప్రకటించిన భారత ప్రభుత్వం విరసం కవులందరినీ అరెస్టు చేసి జైలు పాలు చేసింది. అలా జైలు జీవితం అనుభవించిన విరసం కవి కేవీఆర్ జైలులో ఉన్నప్పుడు రాసిన కవితలను ‘జైలు కోకిల’గా ప్రచురించాడు. వంగపండు ప్రసాదరావు విశాఖపట్టణం, శ్రీకాకుళం మాండలికంలో విప్లవగీతాలు రచించాడు. గద్దర్ భుజంపై గొంగడి, కాళ్లకు గజ్జెలతో ఆడి పాడే పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి.
నరసింహారావు 1948 పోలీసు చర్య తర్వాత తలెత్తిన పరిణామాలను చిత్రిస్తూ ‘గెలుపు నీదే’, ‘ఆదర్శ లోకాలు’ అనే నాటకాలను రచించి ప్రదర్శించాడు. ఏ.ఆర్.కృష్ణ రంగస్థల అభివృద్ధిని కాంక్షిస్తూ.. అనేక ప్రయోగాత్మక నాటక ప్రదర్శనలు చేశాడు. ఆధునిక కాలంలో సి.నారాయణరెడ్డి ‘నవ్వని పువ్వు’, ‘అజంతా సుందరి’, ‘రామప్ప’ వంటి నాటకాలు రచించి ప్రదర్శించారు. వడ్డేపల్లి కృష్ణ, వల్లభాపురం జనార్ధన్ ‘గేయ రూపకాలు’ రచించారు. విప్లవ రచయితలసంఘం (విరసం) రచయితలు అల్లం రాజయ్య ‘నాగేటి చాళ్లలో’, తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘బొగ్గుపొరల్లో’ నాటకాలను రచించారు. ప్రసిద్ధ విరసం కవి చెరబండరాజు ప్రజల్లో పోరాటస్ఫూర్తిని నింపుతూ అనేక నాటికలు రచించాడు.
సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో విరసం చేసిన పోరాటం అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా సాహిత్యంలో ఒక యుగాన్నే సృష్టించింది. సాహిత్యం, రాజకీయాలు వేరు వేరు కాదని విరసం అంటుంది.
– ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606