సంగారెడ్డి, జూన్ 2 (నమసే తెలంగాణ): సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు తెలుస్తున్నది. ముంపు భూముల ఆక్రమణ వ్యవహారం బయటకు పొక్కినప్పటికీ అందోల్ నియోజకవర్గంలోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సింగూరును మింగుతున్న భూమ్మర్ది’ శీర్షికన నమస్తే తెలంగాణ మెయిన్ పేజీలో మంగళవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. రాజకీయ వర్గాలతోపాటు అధికార వర్గాల్లోనూ ఈ ‘భూమ్మర్ది’ కథనం హాట్ టాపిక్గా మారింది.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ మంత్రి బామ్మర్ది మంగళవారం సింగూరు ముంపుభూముల్లో యథావిధిగా పనులు కొనసాగించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మట్టి కుప్పలు పోయడం, చదును చేయడం, బండరాళ్లను తొలగించడం వంటి పనులు చేపట్టారు. మంత్రి బామ్మర్ది రెండు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులతో రహస్యంగా సమావేశమై ముంపుభూముల వ్యవహారంపై చర్చించినట్టు తెలుసున్నది.
నమస్తే తెలంగాణలో వచ్చిన భూమ్మర్ది కథనంతో అధికార వర్గాల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ ప్రతీక్జైన్.. వట్పల్లి మండలం ఖాదిరాబాద్ పరిధిలో సింగూరు ముంపుభూముల ఆక్రమణలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేశారు. సింగూరు ముంపు భూముల్లో సర్వే నిర్వహించి ఆక్రమణలపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అందోల్ ఆర్డీవోకు ఆదేశాలు జారీచేసినట్టు కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ముంపు భూములు ఆక్రమణకు గురైనట్టు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఈ మేరకు ఖాదిరాబాద్, సాయిపేట, మంతూరు గ్రామాల పరిధిలోని సింగూరు ముంపుభూముల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నమస్తే తెలంగాణ భూమ్మర్ది కథనంపై అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకుల్లో కూడా జోరుగా చర్చ సాగుతున్నది. మంత్రి బామ్మర్ది ఆక్రమణలకు సిద్ధం కావడంపై కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. ఈ కథనాన్ని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అటు సీఎం రేవంత్రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
మంత్రి బామ్మర్ది అక్రమ నిర్మాణాలతో సమీపంలో ఉన్న తమ గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉన్నదని సాయిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అయినా కాపాడే వ్యవహారం తమది కాదని, కాపాడాల్సిన అవసరమూ తమకు లేదని చెప్తున్నారని సాయిపేట గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ముంపు భూముల్లో పనులు జరిగే సమయంలో స్థానికులు కొందరు అక్కడికి చేరుకోగానే పనులు ఆపేసినట్టు వారు తెలిపారు. ఆ పనులు జరుగుతుండగా తీసిన వీడియోలను స్థానికులు మీడియాకు అందజేశారు.