ఖమ్మం సభ ప్రధాన లక్ష్యం బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో గుర్తింపును సాధించటం. సభ ఆద్యంతం జరిగిన తీరునూ, అందుకు ఇతర పార్టీలు, వివిధ రాష్ర్టాల ప్రజలు, మీడియా నుంచి వచ్చిన స్పందనలనూ గమనించినప్పుడు, ఆ లక్ష్యసాధన దిగ్విజయంగా నెరవేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయపార్టీగా మారదలచినపుడు ఆ గుర్తింపు ఎన్నికల సంఘం నుంచి రావటం కేవలం సాంకేతిక అంశం. కాని పైన చెప్పిన తరహా స్పందనలు దేశవ్యాప్తంగా కన్పించటం ఆ పార్టీ క్షేత్రస్థాయిలో నిలదొక్కుకునేందుకు కావలసిన రాజకీయ విషయం.
బీఆర్ఎస్కు ఆ విధమైన స్పందనలు రావటానికి కీలకం ఏమిటన్నది రహస్యం కాదు. ఇక్కడ ఇంతకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ఇక బీఆర్ఎస్ రూపంలో దేశం కోసం ఏమి చేయగలదన్న ఆశాభావాలే అందుకు కారణం. టీఆర్ఎస్ పార్టీ తన పేరును బీఆర్ఎస్గా మార్చుకోవటం, ఆ విధంగా పేరు మార్పును ఎన్నికల సంఘం ఆమోదించటం, బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటుకావటం ఇప్పటికే జరిగిపోయాయి.
ఇదంతా జరుగుతుండిన కొద్దినెలల కాలంలో తగినన్ని సానుకూల స్పందనలు కన్పించాయి. ఆ విధమైన స్పందన స్థాయి గణనీయంగా పెరిగి ఒక స్పష్టమైన, బలమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమాల గుర్తింపుగా మారటం ఈ నెల 18వ తేదీ నాటి ఖమ్మం సభతో సిద్ధించింది. ఈ మాటపై సందేహాలున్నవారు, అది అతిశయోక్తిగా తోచేవారు ఎవరైనా ఉంటే ఆ సభ తీరును, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులూ వివిధ పార్టీల నాయకుల ప్రసంగాలను, వారి పర్యటన సందర్భంగా ఇతరత్రా చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించినట్లయితే విషయం అర్థమవుతుంది. ఇదిగాక, సభకు ముందూ తర్వాతా ఇతర రాష్ర్టాల ప్రజల స్పందనలు, మీడియా వార్తలు, వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి.
వీటన్నింటిని మూడు విధాలుగా వర్గీకరించి చూడవలసి ఉంటుంది. ఒకటి, ‘గుజరాత్ నమూనా’ అంటూ ప్రచారం జరుగుతున్న దానికి భిన్నంగా కాని, లేదా యధాతథంగా ‘తెలంగాణ నమూనా’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న అభివృద్ధి-సంక్షేమ నమూనా గురించి ఖమ్మం సభ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలు ఏమిటన్నది మొదటిది. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలో, ఆయనకు చెందిన బీజేపీ వ్యవహరణలో దేశానికి జరుగుతున్న వివిధ నష్టాల దృష్ట్యా ప్రత్యామ్నాయం అవసరమైనందున, అందులో బీఆర్ఎస్ పాత్ర గురించి ఏమన్నారన్నది రెండవది. ఒకవైపు ‘తెలంగాణ నమూనా’ అభివృద్ధి-సంక్షేమ పాలనలో, మరొకవైపు మోదీ-బీజేపీ వల్ల దేశానికి కలుగుతున్న నష్టాలను రాజకీయంగా ఢీకొనటంలో ఒక నాయకునిగా కేసీఆర్ గురించి ఏమంటున్నారన్నది మూడవది. నిర్దిష్టంగా ఖమ్మం సభతో నిమిత్తం లేకుండా కూడా బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా దేశంలోని వివిధ పార్టీల వారి నుంచి, ఇతర రాష్ర్టాల ప్రజల నుంచి, బయటి మీడియా నుంచి, ఇంకా మేధావి వర్గాల నుంచి ఈ మూడు అంశాలకు సంబంధించి వినవస్తున్న అభిప్రాయాలు ఏమిటన్నది సైతం ఖమ్మం సభ సందర్భంతో కలిపి సమగ్ర దృష్టితో చూడటం సరైనదవుతుంది.
ఆ విధంగా చూసినపుడు, నిరుడు అక్టోబర్ మొదటివారంలో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీకి, ఒక కొత్త జాతీయపార్టీగా అప్పటినుంచే నెమ్మదిగా లభించటం మొదలైన రాజకీయ- సామాజిక గుర్తింపు, సరిగా 14 వారాలు గడిచేసరికి ఖమ్మం సభతో పరిపూర్ణ స్థాయికి చేరింది. ఈ రోజున అందరి దృష్టిలో కేసీఆర్ కేవలం పట్టువదలని మహోద్యమం ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించిన నాయకుడు మాత్రమే కాదు. తెలంగాణ అభివృద్ధి-సంక్షేమాల కోసం తమదైన నమూనాను రచించి, అమలుపరుస్తూ, ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే జాతీయస్థాయిలో అనేక రికార్డులను నెలకొల్పి ప్రశంసలు అందుకుంటున్నవాడు.
హానికరమైన పరిపాలనతో, విచ్ఛిన్నకర రాజకీయాలతో దేశానికి, భారతీయ సమాజానికి తీవ్రమైన నష్టాలు కలిగిస్తున్న మోదీ-బీజేపీ ద్వయాన్ని నిర్భయంగా ఢీకొంటున్న ధీశాలి. మరొక స్థాయిలో, దేశ వర్తమాన-భవిష్యత్తుల కోసం, సమాజ శాంతి సుస్థిరతల కోసం, సమగ్రమైన సమ్మిళిత అభివృద్ధి కోసం తగిన దార్శనికత కలవాడు. ఈ విధమైన గుర్తింపులన్నీ ఇతర పార్టీలలో, బయటి ప్రజల్లో, మీడియాలో, మేధావి వర్గాలలో ఇపుడిపుడే వ్యాపిస్తున్నాయి. అందుకు, ఖమ్మం సభ ఎంత భారీగా విజయవంతమైందో అంతే భారీగా దోహదం చేస్తున్నది. నిష్పాక్షిక దృష్టిగలవారు, సినిసిజం లేనివారు ఎవరైనా అంగీకరించవలసిన విషయమిది.
బీఆర్ఎస్కు ఖమ్మంలో లభించిన జాతీయస్థాయి రాజకీయ గుర్తింపు నుంచి, జాతీయస్థాయి ప్రజామోదం కోసం తదుపరి దశ పార్టీ మేనిఫెస్టో ప్రకటనతో ఆరంభమవుతుందన్నది కీలక విషయం. ఆ పత్రాన్ని వందమందికిపైగా మేధావులు సిద్ధం చేస్తున్నారని, అది త్వరలోనే వెల్లడవుతుందని కేసీఆర్ ఖమ్మం సభలో ప్రకటించారు. అందులోని కొద్దిపాటి ముఖ్యాంశాలను ఆయన ఇప్పటికే ఖమ్మం సభకు ముందు, ఆ సభలో కూడా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతోపాటు సూచించటం తెలిసిందే. రైతుబంధు, ఉచిత విద్యుత్తు, దళితబంధు, ఇంటింటికి మంచినీరు, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణ పట్ల వ్యతిరేకత మొదలైన అంశాలకు గణనీయమైన స్పందనలు ప్రజల నుంచి దేశమంతటా ఇప్పటికే వస్తున్నాయి. పూర్తి మేనిఫెస్టో ప్రకటన అనంతరం బీఆర్ఎస్ ప్రభావం గుర్తింపు, ఆమోదం వేగాన్ని అందుకుంటాయి. ఆ విధంగా చూసినపుడు, ఖమ్మం మహాసభ దేశ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగులుతుంది. ఈ మాట ఆ సభలో పాల్గొన్న ఇతరపార్టీల నాయకులు సైతం అన్నదే.
బీఆర్ఎస్కు ఖమ్మంలో లభించిన జాతీయస్థాయి రాజకీయ గుర్తింపు నుంచి, జాతీయస్థాయి ప్రజామోదం కోసం తదుపరి దశ పార్టీ మేనిఫెస్టో ప్రకటనతో ఆరంభమవుతుందన్నది కీలక విషయం. ఆ పత్రాన్ని వందమందికిపైగా మేధావులు సిద్ధం చేస్తున్నారని, అది త్వరలోనే వెల్లడవుతుందని
కేసీఆర్ ఖమ్మం సభలో ప్రకటించారు.
టంకశాల అశోక్