Indian Railways | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైల్వేశాఖలో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. ముఖ్యంగా బొగ్గుతో నడిచే ఇంజిన్ల స్థానంలో డీజిల్ ఇంజిన్లు, ఆ తర్వాత ప్రస్తుతం చాలా రైళ్లు విద్యుత్తో నడుస్తూ దూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరవేస్తున్నాయి. ముఖ్యంగా మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్గా మారింది. సింగిల్ లైన్ వ్యవస్థ స్థానంలో డబుల్ లైన్ ఏర్పాటైంది. రైళ్ల వేగం పెంచేందుకు కొన్ని రైళ్లను పొడిగించారు. ఇక వస్తు రవాణా చేసే గూడ్స్ రైళ్ల ద్వారా పలు ప్రాంతాలకు వివిధ వస్తువులను ఎగుమతి దిగుమతి చేస్తుండటంతో అధిక ఆదాయం సమకూరుతున్నది.
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారి ఇండియన్ రైల్వేస్ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న రూట్లో కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నది. దీనివల్ల రైల్వే అస్తిత్వానికే ప్రమాదం ఉందని దేశ ప్రజలు గ్రహించాలి. ఇప్పటికే అనేక విభాగాల్లో క్యాటరింగ్, టికెట్స్, మెయింటనెన్స్, కోచ్ తయారీ, లైన్లు, వర్క్షాప్ వంటివి ప్రైవేటీకరణ చేసింది. భవిష్యత్తులో మరిన్ని విభాగాలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేయడం పెను విషాదం.
ఎంతో ప్రెస్టీజియస్గా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ప్రవేశపెట్టిన, తరచూ మన ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తున్న ‘వందే భారత్’ రైళ్లు సామాన్య ప్రజలకే కాదు, మధ్యతరగతి ప్రజలకూ భారమైందన్న మాట వాస్తవం. ఎక్కువ ధరలతో ‘వందే భారత్’ రైళ్లు ప్రయాణికుల నడ్డివిరుస్తున్నవి. ధనికులకు మాత్రమే ఈ ప్రయాణాలు అనుకూలం. కరోనా పుణ్యమాని ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లు రద్దుచేసి, పేదలకు చౌక ప్రయాణం దూరం చేశారు. వృద్ధులకు, ఇతర మినహాయింపునిచ్చే వారికి ఇచ్చే సౌకర్యాలు, రాయితీలు రద్దుచేశారు. ఇదేనా నేటి పాలకులు, ప్రభుత్వాలు సామాన్య, వృద్ధులకు ఇచ్చే బహుమతి? ప్రజలు విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షిస్తుంటే, వాటినే ఖరీదైన వాటిగా అందుబాటులో లేకుండా చేయడమే నేటి కేంద్ర పాలకుల విధానంగా మారింది. ప్రతిదీ ప్రైవేటీకరణ చేయడానికేనా ఈ ప్రభుత్వానికి ప్రజలు అధికారం కట్టబెట్టింది?
ఓ పక్క దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి. కానీ, మన దేశంలో నేటికీ మూడు పూటలా తిండి దొరకనివారు 22 కోట్ల మంది ఉన్నారనే విషయాన్ని కేంద్రంలోని పాలకులు మరిచిపోకూడదు. అభివృద్ధి అంటూ జాతీయ రహదారులు, విమానాశ్రయాల వంటివి ప్రజలకు చూపెడుతూ పేదరికాన్ని దాచిపెట్టడం సమంజసమేనా? ప్రపంచ సూచికల్లో అనేక రంగాల్లో మనం వెనుకబడి ఉన్నామనే సంగతి గుర్తుంచుకోవాలి.
ఇటీవల రూ.2.40 లక్షల కోట్లు అంటే 25 శాతం పైబడి రైల్వేశాఖకు లాభాలు వస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. పేద ప్రజల నడ్డివిరిచి సంపాదించే ఈ లాభాలు ఎవరి కోసమనేది ప్రజలు ప్రశ్నించాలి. ఒక పక్క బుల్లెట్ ట్రెయిన్ అని, మరో పక్క ‘వందే భారత్’ వంటివి ఈ ఆధునిక కాలంలో అవసరమే. కానీ అదే సమయంలో పేద, సామాన్య ప్రజలకు రైల్వే ప్రయాణం భారం చేయడం సమంజసమేనా?
ఓ పక్క దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి. కానీ, మన దేశంలో నేటికీ మూడు పూటలా తిండి దొరకనివారు 22 కోట్ల మంది ఉన్నారనే విషయాన్ని కేంద్రంలోని పాలకులు మరిచిపోకూడదు. అభివృద్ధి అంటూ జాతీయ రహదారులు, విమానాశ్రయాల వంటివి ప్రజలకు చూపెడుతూ పేదరికాన్ని దాచిపెట్టడం సమంజసమేనా? ప్రపంచ సూచికల్లో అనేక రంగాల్లో మనం వెనుకబడి ఉన్నామనే సంగతి గుర్తుంచుకోవాలి.
ప్రజలపై అదనపు భారాన్ని మోపకుండా లాభాలు సంపాదించవచ్చనే విషయాన్ని ఇకనైనా తెలుసుకోవాలి. ఉదాహరణకు మెట్రోరైల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం అసాధ్యం. దేశంలోని రైల్వే వ్యవస్థ దశలవారీగా ఈ విధానాన్ని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్కరూ టికెట్ కొని ప్రయాణం చేస్తారు. సరుకు రవాణాపై అవకాశం మేరకు చార్జీలు పెంచాలి. ధనికులు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను తగ్గించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగించే రీతిలో రైల్వేవ్యవస్థలో మార్పులు జరుగుతాయని, మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే రంగం ప్రజలకు మేలుచేసే విధంగా ఉండాలని ఆశిద్దాం.
– ఐ ప్రసాదరావు 63056 82733