న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రస్తుతానికి సోమ, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా కేసుల విచారణలు నిర్వహించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ సోమవారం తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమ, శుక్రవారాల్లో కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారించాలని నిర్ణయించింది.
అలాగే ఇంధనాన్ని పొదుపుగా వినియోగించేందుకు న్యాయమూర్తులు కార్పూలింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఒక కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.ఆన్లైన్ ద్వారా విచారణలు చేపట్టినందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోని అన్ని హైకోర్టులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని తాను కోరుతున్నానన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘నా మిత్రుడు రోహత్గీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’ అని అన్నారు.