తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ… ‘తెలంగాణ సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి’ అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు.
నీళ్లు, నిధులు, నియామకాలు.. నినాదంతో ఆత్మగౌరవమే ఆలంబనగా సాధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాలనా సంస్కరణకు మొదటి మెట్టు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. 1,503 కొత్త మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణతో పాటు ప్రజలకు పాలన మరింత చేరువైంది. అంతేకాదు, అధికారులు, ప్రజాప్రతినిధులలో జవాబుదారీతనం పెరిగింది. పాలన పారదర్శకంగా ఉండటానికి, ప్రజలకు సుపరిపాలన అందించడానికి దోహదపడ్డాయి.
ఉమ్మడి ఏపీలో ఉన్న జోనల్ విధానంలోని అస్తవ్యస్తతను తొలగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల తెలంగాణేతరులు మన రాష్ట్రంలోని ఉద్యోగాల్లో చేరకుండా నిలువరించినట్టయింది. జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగాల్లో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ఈ నూతన జోనల్ విధానం రూపొందించింది. అంతేకాకుండా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ వంటి రాష్ట్రస్థాయి పోస్టులను మల్టీజోన్ విధానంలోకి తీసుకురావడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, దూరదృష్టికి నిదర్శనం. మరోవైపు నూతన జోనల్ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం/ సమానావకాశాలు చేకూర్చడం సాధ్యమవుతుంది. నూతన జోనల్ విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్లలో సైతం ఎలాంటి గందరగోళానికి తావులేకుండా జీవో-317 ద్వారా దాదాపు 38 వేల మంది ఉద్యోగులను కేటాయించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పోస్టులను సృష్టించింది. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పకడ్బందీ అమలుకు, స్థానిక సంస్థల పటిష్ఠతకు అదనపు కలెక్టర్ వ్యవస్థ దోహదపడుతుంది. దీంతో స్థానిక సంస్థల పనితీరు మెరుగుపడటంతో పాటు ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ విజయవంతంగా కొనసాగుతాయి. ఈ విధానం వల్ల సుపరిపాలన ప్రజలకు మరింత చేరువవుతున్నది. అయితే ఈ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా స్థానిక సంస్థలైన పంచాయతీరాజ్శాఖ, మున్సిపల్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు స్థానిక సంస్థల్లో అనుభవం గల గ్రూప్-1 అధికారులను నియమించాల్సిన అవసరం ఉన్నది.
ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయాన్ని నూతనంగా నిర్మించడమే కాకుండా, ఈ భవనానికి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా నామకరణం చేసింది. ఈ సమీకృత సచివాలయంలో గతంలో లేనివిధంగా ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాలు, సిబ్బంది కార్యాలయాలతో పాటు ఆయా శాఖల మంత్రుల కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేసింది. దీంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, శాఖల కార్యదర్శుల, మంత్రుల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. తద్వారా సత్వర నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ప్రజలకు మరింత త్వరగా పరిపాలన అందజేయడానికి దోహదపడుతుంది. రాష్ట్ర రాజధానిలో పలుచోట్ల విస్తరించి ఉన్న శాఖాధిపతుల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడమే కాకుండా, నూతన సచివాలయానికి దగ్గరలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం హర్షించదగినది. దీనివల్ల ఆయా శాఖాధిపతులకు సచివాలయంలో ముఖ్యమైన సమావేశాలకు హాజరుకావడానికి దూరాభారం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు సైతం సుపరిపాలన మరింత చేరువవుతుంది.
పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను, అంటే.. నూతన జిల్లా కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అన్ని శాఖలకు చెందిన కార్యాలయాలు ఒకేచోట కలెక్టరేట్లో ఉండటం వల్ల ప్రజలకు పాలన మరింత దగ్గరవుతున్నది.
ఎన్నో ఏండ్లుగా 40 శాఖల్లో పనిచేస్తున్న 5,600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్వోల సర్వీస్ క్రమబద్ధీకరణ కొనసాగుతున్నది. అంతేకాకుండా 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం టీఎస్-బీపాస్ విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. ఈ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులకు 21 రోజుల్లో సింగిల్ విండో అనుమతి అందజేయబడుతుంది. దీనిద్వారా ప్రజలు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అనుమతులు సాధించుకోవచ్చు. సుపరిపాలనలో ఇదొక గొప్ప సంస్కరణ.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అగ్రగామిగా ఉండటమే కాకుండా, తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందజేయడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదినుంచి స్నేహశీలతను కనబరుస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగులకు వేతనాలు పెంచింది. అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకూ వేతనాలను పెంచడం ముదావహం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ పునర్విభజనలో భాగంగా చాలా శాఖల్లోని పోస్టులు ఏపీకి వెళ్లిపోయాయి. అంతేకాకుండా, కొన్ని శాఖల్లో సరైన సిబ్బంది ఉన్నప్పటికీ, కొన్ని శాఖలలో సిబ్బంది కొరత ఉండేది. అందుకే ఆయా శాఖలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యంగా ఇరిగేషన్, రహదారులు భవనాలు, ఎక్సైజ్ వాణిజ్యపనుల శాఖల్లో పోస్టుల భర్తీ, శాఖలను కూడా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతతో కూడిన నిర్ణయాలు, ప్రజల భాగస్వామ్యం, ప్రజల అవసరాలకు సత్వర స్పందనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నది. రాష్ట్ర ప్రగతికి ఈ పాలనా సంస్కరణలు చోదకశక్తిగా పనిచేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్: 96964 96666
(వ్యాసకర్త: గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షులు)