రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీజేపీ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా మారి, ప్రతిపక్ష నాయకులపై కిరికిరి దాడులు చేస్తున్నాయి. ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి కేంద్రంలో గద్దె నెక్కిన బీజేపీ తన అధికారాన్ని పదిలపరుచుకోవటం కోసం ఈ సంస్థలను పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప్రతీకార దాడులను జరుపుతూ గడిచిన తొమ్మిదేండ్లుగా బీజేపీ నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నది. ఇప్పటి వరకూ ఈడీ మొత్తం 121 కేసులు నమోదు చేయగా, వాటిలో 115 అంటే 95 శాతం విపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. అలాగే, సీబీఐ గత తొమ్మిదేండ్లలో నమోదు చేసిన కేసులు 124 కాగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపై నమోదు చేసినవే 118 ఉన్నాయి. నేరారోపణలు రుజువైంది మాత్రం 0.5 శాతం కంటే తక్కువ కేసుల్లోనే. అంటే కేవలం విపక్ష నేతల వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి, వారిని వేధించటానికి మాత్రమే ఈ కేసులను బీజేపీ ఉపయోగించుకుంటున్నది. ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా.. ఒకప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరున్న ఈడీ, సీబీఐ సంస్థలు ప్రజల్లో పలుచనవుతున్నాయి. పీఎంఎల్ఏ (మనీ ల్యాండరింగ్) తదితర సెక్షన్ల కింద తొమ్మిదేండ్లలో పెట్టిన కేసులు 5,422 కాగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపై నమోదైనవి 5,150 ఉన్నాయంటే బీజేపీ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పదేండ్ల యూపీఏ హయాంతో పోలిస్తే, 9 ఏండ్ల బీజేపీ హయాంలో విపక్షాలపై నమోదైన కేసులు 27 రెట్లు ఎక్కువ.
అప్పటి వరకు కేసులు, దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు.. బీజేపీలో చేరగానే సచ్ఛీలురుగా మారుతున్నారు. అప్పటిదాకా దూకుడుగా వ్యవహరించిన ఈడీ, సీబీఐలు హఠాత్తుగా వారిని వదిలేసి కనిపించకుండా పోతున్నాయి. నారాయణ్ రాణె, సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ, ముకుల్ రాయ్ తదితరుల ఉదంతాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, శివసేన నేత భావన గవ్లీ, యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్ నాయక్లతోపాటు, ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితరులంతా బీజేపీకి దగ్గరవగానే వారిపై పెట్టిన ఈడీ కేసులన్నీ మరుగునపడ్డాయి. ఇప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ఎదుర్కొంటున్న ప్రముఖ విపక్ష నేతల్లో కాంగ్రెస్కు చెందిన కార్తీ చిదంబరం, డీకే శివకుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నేత మాయావతి, సమాజ్వాదీ నాయకుడు ఆజంఖాన్, ఎన్సీపీ నుంచి అనిల్ దేశ్ముఖ్, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ, పార్థచటర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీశ్ సిసోడియా, తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత తదితరులున్నారు.
ఇక ఇప్పుడు కవితపై వస్తున్న ఆరోపణలను పరిశీలిద్దాం.. ఢిల్లీలోని ఆప్ పభుత్వం 2021-22లో రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కార్యనిర్వాహక చర్య. దానివల్ల ఆర్థిక లాభనష్టాలు, పర్యవసానాలు ఏవైనా ఉంటే వాటిని చూసుకోవాల్సింది, పరిశీలించాల్సింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అంటే కాగ్.
కేసీఆర్ను దెబ్బతీయడానికి బీజేపీ ముందున్న ఒకే ఒక దారి.. ఆయనపై అబద్ధాలు ప్రచారం చేసి అపఖ్యాతి పాలు చేసి, మానసికంగా కుంగదీయటం, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం. కానీ, ఇవేవీ జరిగే పనులు కావని గుర్తెరగాలి.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విధానంలో లొసుగులు, అక్రమాలు ఏవైనా కనిపిస్తే, వాటిని కాగ్ ఎలాగూ ఎత్తి చూపుతుంది. అది దాని బాధ్యత. కానీ ఇప్పుడేం జరుగుతున్నది? ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ఫిర్యాదు ఇచ్చారనే కారణంతోనే చర్యలు ప్రారంభించడం, వేధింపులకు దిగటం ఎంత వరకు సరైనది? ఈ కేసులో ఇప్పటి వరకూ వినిపిస్తున్నవి ఆరోపణలు మాత్రమే. ఇవి న్యాయపరంగా నిలిచేవి కావు. ఈ కేసు ముగింపునకూ రాదు. ఎందుకంటే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను విభాగం (ఐటీ) కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలకలు గా మారిపోయాయి. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు అధికారంలో ఉన్న వారికి ఏజెంట్లుగా మారుతుంటే, అవి నమోదు చేసిన కేసులు కూడా ఏనాటికీ తెగవని స్పష్టంగా చెప్పవచ్చు.
సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఉద్యమ నేతనే నేడు పాలకుడయ్యాడు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజా బలం లేదు. కాంగ్రెస్ కూడా బలహీనంగా ఉంది. కాబట్టి, బీఆర్ఎస్ను ఓడించటం సాధ్యం కాని పని. కేసీఆర్ను దెబ్బతీయడానికి బీజేపీ ముందున్న ఒకే ఒక దారి.. ఆయనపై అబద్ధాలు ప్రచారం చేసి అపఖ్యాతి పాలు చేసి, మానసికంగా కుంగదీయటం, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం. కానీ, ఇవేవీ జరిగే పనులు కావని గుర్తెరగాలి. ఎవరైనా సరే బీజేపీలో చేరితే పవిత్రులు- బీజేపీని ఎదిరిస్తే నేరస్థులు అవుతారా? అవినీతిపరులు అంటూ బీజేపీ ప్రచారం చేసిన వాళ్లు సైతం.. బీజేపీలో చేరగానే కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు కావటం దేనికి సంకేతం? అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు ఇదే కుతంత్రం, ఇదే కుత్సితం, ఇదే నాటకం, ఇదే బూటకం, ఇదే దాడి. ఇదెక్కడి రాజనీతి?
మీరు భయపెడితే భయపడటానికి, మేం తప్పు చేసిన వాళ్లం కాదు. ఎదిరించి పోరాడిన వాళ్లం, పోరాడి తెలంగాణ సాధించిన వాళ్లం. కుట్ర రాజకీయం మీకు వెన్నతో పెట్టిన విద్య కావచ్చు, కానీ, పోరాటం మాకు ఉగ్గు పాలతో అబ్బిన విద్య. కేంద్రంలోని పెద్దలు దీనిని గుర్తుంచుకోవాలి.
మీరు భయపెడితే భయపడటానికి, మేం తప్పు చేసిన వాళ్లం కాదు. ఎదిరించి పోరాడిన వాళ్లం, పోరాడి తెలంగాణ సాధించిన వాళ్లం. కుట్ర రాజకీయం మీకు వెన్నతో పెట్టిన విద్య కావచ్చు, కానీ, పోరాటం మాకు ఉగ్గు పాలతో అబ్బిన విద్య. కేంద్రంలోని పెద్దలు దీనిని గుర్తుంచుకోవాలి. దేశంలో మత విద్వేష పిచ్చికుక్కల్ని వేటాడే క్రమంలో ఆ కుక్కల కాట్లు మ న చేతిపై పడతాయి. తప్పదు. అంతమాత్రాన మనం ఆ పిచ్చికుక్కల్ని వేటాడటం ఆపుతామా?.. ‘ఇవన్నీ తప్పుడు కేసులు.. కవితమ్మా మీరు ధైర్యంగా ఉండండి’ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పినట్లుగా.. కేసీఆర్ కుటుంబ సభ్యులమైన తెలంగాణ ప్రజలందరం, ఈ ధర్మపోరాటంలో మీ వెంటే ఉంటాం.. ధర్మం కూడా మన వైపే ఉంది. అంతిమ విజయం మనదే.
పీ.ఎల్. శ్రీనివాస్
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)