రాజకీయాల్లో నిన్నటి మాట రేపుండదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఏ కలలుగన్నారో ఆ కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రచురించిన ‘కోటి రతనాల వీణకు ప్రగతి రాగాలు’ పుస్తకాన్ని ఇటీవల మరొక్కసారి చదివాను. తెలంగాణ అవతరణ తర్వాత 2014లో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రజల ఆశలు, ఆశయాలు, చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమం గురించి కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. నాడు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట నేడు నిజం అవుతున్నది.
త్యేక రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ సమాజానికి గొప్ప విజ యం. ఇక్కడివారికి వందశాతం ఉద్యోగాలు దక్కుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల్లో 95 శాతం తెలంగాణ వారికే దక్కిన మాట నిజం. తెలంగాణకు లభించాల్సిన నీటి వాటాను, ప్రాజెక్టుల నిర్మాణంతో గరిష్ఠంగా ఉపయోగించుకుంటున్నది. ఒకప్పుడు బీడు పడిన నేలలు నేడు పచ్చదనంతో అలరారుతున్నాయి. నాడు తెలంగాణలో అన్ని చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టుల నీళ్లతో కలిపి 15 లక్షల ఎకరాలకు నీళ్లందితే గొప్ప. నేడు కోటి పైచిలుకు ఎకరాలకు సాగునీరందుతున్నది.
విద్యుచ్ఛక్తి విషయంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో కరెంటు ఎప్పుడుంటదో తెలియని స్థితి. విద్యుత్ కష్టాలే తెలంగాణ రైతాంగం ప్రాణాలు తీసిన దుస్థితి. రాష్ట్ర అవతరణ తర్వాత రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించటం విప్లవాత్మకం. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం నాటి పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేయడం అభినందనీయం. కొత్త జిల్లాలు నూతన కలెక్టరేట్ భవనాలతో అలరారుతున్నాయి. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 125 గజాల స్థలంలో రెండు పడక గదుల ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. వితంతువులు, అనాథలకు ఇస్తున్న పింఛన్లను పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు పేదలకు ఆసరాగా నిలిచేవే. నల్గొండ జిల్లాకు శాపంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం, రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య తీర్చటం కోసం 2016లో మిషన్ భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నది. దీంతో తరతరాల నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య కనుమరుగైపోయింది.
దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు గ్రాంటుగా అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలను సగౌరవంగా ఆదరించి ఆదుకోవటం ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించింది. నాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని అనారోగ్యానికి గురైనవారికి దవాఖాన ఖర్చులు భరించి నెలవారీగా పింఛన్ మంజూరు చేసింది. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఉద్యోగాలిచ్చి గౌరవించింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సంస్కారవంతమైన మానవీయ సమాజం. తరతరాల ఘనమైన సంస్కృతితో ఈ రాష్ర్టాన్ని మరింత మానవీయ సమాజంగా తీర్చిదిద్దటం కోసం కళా సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. సీమాంధ్ర వలస పాలనలో వివక్షకూ, అవహేళనకు గురైన బతుకమ్మ, బోనాల పండుగలను ఘనంగా నిర్వహించటం రాష్ట్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతగా స్వీకరించడమే ఇందుకు ఉదాహరణ.
కేవలం ఎనిమిదేండ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేండ్లకే 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బతీయటానికి మహా కూటమి పేరుతో ప్రయత్నాలు జరిగాయి. కానీ, వారి పప్పులు ఉడకలేదు. నేడు మరోసారి అలాంటి కుట్రలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ‘తెలంగాణ ప్రజల స్వీయపాలన’ను అంతం చేయటానికి కుయుక్తులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని విద్వేష రాజకీయ శక్తులు తెర మీదకు వచ్చాయి. శాంతికి, సహజీవనానికి మారుపేరైన తెలంగాణలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మన రాష్ట్రం కాదు.. మన యాస, భాష కూడా తెలువనివారు ఢిల్లీ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యి ‘ప్రజా ప్రస్థానయాత్ర’ల పేరుతో రాష్ట్రంలో కలియ తిరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీరి లక్ష్యం కేసీఆర్ అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలనను తెలంగాణకు దూరం చేయాలనేదే. ప్రజలు అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓటు వేసే రోజులివి. ప్రస్తుతం ఉన్న పథకాలకు, మరిన్ని ఎక్కువ ఇస్తామని చెప్పడం కాకుండా, ఉద్వేగాలను రెచ్చగొట్టే పనులను కొన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి.
60 ఏండ్ల పాటు కుంగి కునారిల్లిన తెలంగాణ ఇప్పుడిపుడే కోలుకుంటున్నది. అనేక పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సామజిక న్యాయం అందుతున్నది. ఈ దశలో ప్రజలు నాటి తెలంగాణను నేటి తెలంగాణ ను పరిశీలించాలి. తమకు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే పార్టీకే పట్టం గట్టాలి. ప్రజ ల మధ్య చిచ్చు రేపే పార్టీలకు స్థానం లేదని చాటిచెప్పాలి.
శాంతికి, సహజీవనానికి మారు పేరైన తెలంగాణలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మన రాష్ట్రం కాదు.. మన యాస, భాష కూడా తెలువనివారు ఢిల్లీ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యి ‘ప్రజా ప్రస్థానయాత్ర’ల పేరుతో రాష్ట్రంలో కలియ తిరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు.
కన్నోజు మనోహరాచారి:79950 89083