పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని గత ప్రభుత్వ హయాంలోనే రూ.10 లక్షల వరకు ఉండేది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల్లో భాగంగా పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పిన విషయం విదితమే. కానీ, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ రోగులకు మందులు కరువయ్యాయి.
Aarogyasri | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో ఉన్న ఆరోగ్యశ్రీ రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకునే రోగులకు సమయానికి కావాల్సిన మందులు అందని పరిస్థితి నెలకొన్నది. ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదనేది స్పష్టమవుతున్నది. సంబంధిత వైద్యారోగ్య శాఖ ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. పేద ప్రజలకు అందాల్సిన మెరుగైన వైద్యంలో నిర్లక్ష్యానికి కారణాలను సమీక్షించి సరిదిద్దాలి. నిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకంలో కీమోథెరపీ చేయించుకునే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేవు. వారం రోజులు వేచిచూసినా మందులు రాని పరిస్థితి ఏర్పడింది. అవసరమైన మందులను బయట నుంచి తెచ్చుకోవాలని వైద్యులు తేల్చి చెప్తున్నారు. అవసరమైన మందులు పంపించాలని ఉన్నతాధికారులకు నివేదించామని, సమయానికి ప్రభుత్వం అందించకపోతే తామేం చేయాలని వైద్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
రేడియేషన్ మిషన్ అయితే రెండు మూడు రోజులకు ఒకసారి రిపేర్కి వస్తది. కొత్త మిషన్ ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. క్యాన్సర్ బాధితుల పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైన ఔషధాలను వెంటనే అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నది. అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది రోగులకు ఇవ్వడం లేదా అనేది వైద్యాధికారులు తేల్చాలి.
ఏ కార్పొరేట్ దవాఖానలో ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందో ప్రజలకు స్పష్టత ఉండటం లేదు. ఈ అంశంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. ఉదాహరణకు యశోద, అపోలో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం చేస్తారా? లేదా? ఒకవేళ ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఎటువంటి రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తారనే విషయాలను తెలియపరచాలి. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఔషధాలను అందుబాటులో ఉంచాలి. లేదంటే డబ్బులు పెట్టి బయటి మందులు కొనలేని పేదల ప్రాణాలు పోయినట్టే. గతనెల రోజులుగా వింటున్న పదం ప్రజా పాలన. పాలకులం కాదు సేవకులం అని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు సామాన్యుల సమస్యలను పరిష్కరిస్తారా? లేదా అనేది చూడాలి మరి.
– గుండమల్ల సతీష్ కుమార్ 94931 55522