పారిశ్రామిక, వ్యవసాయ, సేవారంగాన్నే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానవ జీవన ప్రవాహాన్ని కూడా కరెంటు ప్రభావితం చేస్తున్నది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశంగా ఉన్న విద్యుత్తు దేశ ప్రజల ప్రగతిని నిర్దేశిస్తున్నదనడంలో సందేహం లేదు. ఎక్కడాలేని విధంగా ప్రస్తుతం దేశం మొత్తమ్మీద అన్నివర్గాల విద్యుత్తు వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2030-31 సంవత్సరానికి దక్షిణ భారతదేశంలోనే అత్యధిక విద్యుత్తు వినియోగం గావించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించనున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవల పేర్కొనడం అభినందనీయం.
ఈ ప్రస్థానం ఆషామాషీగా జరగడం లేదు. దీనివెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తురంగంలో పనిచేస్తున్న వేలాది ఇంజినీర్ల, కార్మికుల కృషి ఉన్నది. తెలంగాణకు పూర్వం కరెంటు పరిస్థితి ఎట్లుండె, ప్రస్తుతం ఎట్లున్నది, ఎలా సాధ్యపడిందన్న విషయాలను చర్చించుకుందాం. విజయాల సమీక్ష పునరావృతమైనప్పటికీ 2014కు ముందు ఎట్లుండె? విద్యుత్తు వినియోగదారులను గృహ, వాణిజ్య పారిశ్రామిక, వ్యవసాయ ప్రజావసరాల వర్గాలుగా విభజించుకుంటాం.
గృహం: గ్రామాలకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 గంటలు కోతలు.. వేసవికాలం రాత్రిపూట కోతలు అదనం.. మండల కేంద్రాలు 8-12 గంటలు.. జిల్లా కేంద్రాలు 4 నుంచి 8 గంటలు.. విశ్వనగరం హైదరాబాద్కు 4 గంటల కోతలు. కరెంటు ఇచ్చే విషయంలో కూడా అమానవీయ విభజన. మనసు ఎంత గుంజినా వేసవి సెలవుల్లో పిల్లాపాపలతో స్వగ్రామాలకు వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు.
వాణిజ్యం: ఏ నగరంలో చూసినా వాణిజ్య సముదాయాల ముందు జనరేటర్ల రణగొణధ్వని… బజార్లో వెళ్తుంటే డీజిల్ వాసన ముక్కుల్లోకి పోకుండా ముక్కుకు ‘దస్తీ’ అడ్డం పెట్టుకునేవారు. అపార్ట్మెంట్లకు జనరేటర్ బ్యాకప్ ఉందా లేదా చూసుకునేవారు. జిరాక్స్, ఫొటోగ్రఫీ, ఐస్క్రీం, జ్యూస్ సెంటర్లు, హోటళ్లకు విద్యుత్తు కోతలతో అపారనష్టం సంభవించేది. క్రికెట్ మ్యాచ్ల వంటివి ఉంటే ఇన్వర్టర్లు ఉన్న ఇండ్లు వెతుక్కునేవాళ్లం.
పారిశ్రామికం: రాష్ట్రంలోని పరిశ్రమలకు, ఐటీ హబ్లకు వారానికి రెండురోజులు పవర్ హాలీడే. నెలకు 10-12 రోజులు పారిశ్రామిక వాడల్లో చిమ్మచీకట్లు. దీనికి అదనంగా ప్రతీ రోజు సాయంత్రం పీక్ అవర్స్ అంటే 6-10 గంటల వరకు మూడు ఫేజులు కరెంటు వాడరాదు. లైటింగ్ మాత్రమే వాడుకోవాలనే నిబంధన. దీన్ని అతిక్రమించినవారికి భారీ పెనాల్టీలు. విద్యుత్తు సిబ్బంది అనధికారికంగా ఏమైనా పరిశ్రమలకు కరెంటు ఇస్తున్నారా? అని తనిఖీలు చేయడానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్వాళ్లు తిరిగేవారు.
వ్యవసాయరంగం: కరెంటు విషయంలో అత్యంత ఉపేక్షకు, నిరాదరణకు గురైన రంగం. రైతులను వినియోగదారులుగా చూసేవారు కాదు. ఎక్కడచూసినా వంగిన స్తంభాలు వేలాడుతున్న తీగలు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు వెరసి ఎండిన పంటలు పవర్ హాలీడేల లాగ ‘క్రాప్ హాలిడే’ ప్రకటించిన దుర్దినాలు. వ్యవసాయ సీజన్కు ముందు వ్యవసాయ శాఖ, కరెంటు డిపార్టుమెంట్ వాళ్లు ఊరూరు తిరిగి వరి పంటలు వేయకూడదని ఆరుతడి పంటలు వేసుకోవాలని నీటి పారుదలకు సరిపోను కరెంటును సరఫరా చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విన్నపాలు బెదిరింపులు. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటల కరెంటుతో తరచుగా మోటర్లు కాలిపోవడం లేకుంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, కాలిన ట్రాన్స్ఫార్మర్ను మార్చేసరికి పానిపట్టు యుద్ధం గెలిచినంత ఆనందం.
3 హెచ్పీ మంజూరు ఉంది, 5 హెచ్పీ మోటర్ వాడుకుంటున్నందుకు డెవలప్మెంట్ చార్జీలు కట్టమని వేధింపులు, కరెంటు కత్తిరింపులు బిల్లులు కట్టడం లేదని స్టార్టర్లు, సర్వీసు వైర్లు పీక్కపోవడం. లేకుంటే ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు బందు పెట్టడం. అన్నం పెట్టే రైతన్నకు అవమానాలు, అవహేళనలు. ఇతర రంగాల విషయానికి వస్తే గ్రామాల్లో నీటి సరఫరా, బోరు మోటర్లు కాలిపోవడం.. కరెంటు సరిపోక నీటికి కటకట. తరచుగా మోటర్లు కాలిపోయి సర్పంచులు అప్పుచేసి మరీ మోటర్లు రీవైండింగ్ చేయించడం… మోటర్ టెస్టింగ్ చేయడానికి పది నిమిషాల మూడు ఫేజులు కరెంటు ఇవ్వడానికి కూడా భయపడిపోయే అధికారులు. పైనుంచి వేధింపుల స్థాయి అలాంటిది మరి.
నేటి పరిస్థితులు అందరూ అనుభవిస్తున్నారు. భారతదేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంతటి మంచి కరెంటు. కోతలు లేవు. ఓల్టేజీ సమస్య అసలుకే లేదు. ప్రమాదాలు లేవు. ప్రజలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులు ఇలా సమస్త ప్రజానీకం కరెంటు సమస్య నుంచి శాశ్వతంగా బయటకు వచ్చింది. మన రాష్ట్రంలోనే ఎందుకు సాధ్యపడింది. వేరే రాష్ర్టాలు ఎందుకు విఫలమవుతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమాది ఏ రాష్ట్రంలో చూసినా కరెంటు కష్టాలు ఎందుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలాంటి కాస్మోపాలిటన్ నగరాలు కూడా కరెంటు కోతలతో తల్లడిల్లిపోతున్నాయెందుకు?
2014 జూన్ 2న రాష్ట్రం బాగుపడాలంటే విద్యుత్తురంగాన్ని గాడినపెట్టాలని కేసీఆర్ తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు. అన్నిరంగాల వారికి 24 గంటల కరెంటును అందించడంతో పాటు వ్యవసాయరంగానికి 9 గంటల పగటిపూట కరెంటునివ్వాలనుకున్న కేసీఆర్ అనూహ్యంగా 24 గంటల సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయరంగానికి 24 గంటల కరెంటునిస్తే అధికారపక్షంలో చేరిపోతానని ప్రతిపక్ష నాయకులు అనేంత అనితర సాధ్యమైన నిర్ణయమది. 2018, జనవరి 1 నుంచి యావత్తు దేశం ఆశ్చర్యపడేలా రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందించడం ప్రారంభమైంది.
ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికే కాకుండా మిగతా ప్రజానీకానికి కూడా సబ్సిడీలు ఇవ్వరాదనే ఉద్దేశంతో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడిదారులకు చోటు కల్పించి ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యపరచడానికి విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రైతుసంఘాలు, విద్యుత్తు సంస్థల ఉద్యోగులు, తెలంగాణ పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, తదితర రాష్ర్టాల ముఖ్యమంత్రుల అభ్యంతరాలు, పార్లమెంటు సభ్యుల ఒత్తిడి మేరుకు బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించారు. బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.
ప్రజా వ్యతిరేకత దృష్ట్యా బిల్లు పెండింగులో ఉన్నప్పటికీ మార్గదర్శకాలు, సర్క్యులర్ల రూపంలో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ వ్యవసాయరంగానికి కూడా మీటర్లు పెట్టమని నిర్దేశిస్తున్నది. ఆదేశాలు పాటించని రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆ రకంగా తెలంగాణ సుమారు రూ.25 వేల కోట్ల నిధులు కోల్పోయింది.
తెలంగాణ రాష్ట్రం జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలకు వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి – స్వయం సమృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా నేడది 19,464 మెగావాట్లకు చేరుకున్నది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4 వేల మెగావాట్లు, ఎన్టీపీసీ రామగుండంలో 1600 మెగావాట్లు, తొందర్లో అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే 27,949 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. విద్యుత్తు రంగం బలోపేతానికే కాకుండా ప్రతీ సంవత్సరం గృహ, వ్యవసాయ, కులవృత్తులు పౌల్ట్రీ తదితర రంగాలకు కేటాయిస్తున్న సబ్సిడీలు, రాయితీలు సుమారు 98 వేల కోట్ల రూపాయలకు పైమాటే. నిరంతరం విద్యుత్తురంగం రాబోయే డిమాండ్ను అంచనాలు వేసుకుంటూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్ను, సబ్ స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను జోడించుకుంటూ వెళ్లడమే కాకుండా కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు లేకపోయినా, కారణాలేమైనా కలిగిస్తున్న అవాంతరాలను దాటుకొని దృఢంగా నిలబడి తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలు తీర్చడం కేవలం కేసీఆర్కే సాధ్యం.
– శశికళ ఠాకూర్