ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేర దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ‘నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తాం’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అది చేయకపోగా, కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నది.
2016 నవంబర్ 8 అర్ధరాత్రి పెద్దనోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం యావత్ దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు లైన్లలో నిలబడి ఎంతోమంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొత్త చట్టాలు, సంస్కరణలు తెస్తే ప్రజలకు అనుకూలంగా ఉండాలే కానీ, వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ రాజకీయ అవకాశం కోసం తప్ప ప్రజల బతుకుల్లో మార్పును తీసుకువచ్చే నిర్ణయం ఒక్కటీ లేదు. ప్రస్తుతం రూ.2 వేల నోటును రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం కూడా అటువంటిదే.
కేంద్రంలోని బీజేపీ పాలనను దేశ ప్రజలు ఈసడించుకుంటే, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే మాడల్ అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే కేసీఆర్ ప్రభుత్వం అనేక సంస్కరణలతో గుణాత్మకమైన పాలనకు కృషిచేస్తున్నది. రైతులకు పెద్దపీట వేసేందుకు బృహత్తరమైన ‘రైతుబంధు, రైతుబీమా’ వంటి అనేక పథకాలను తీసుకువచ్చింది. రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వానికి, దేశంలోని ఇతర రాష్ర్టాలకూ ఆదర్శమైంది. రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దళితుల్లో ఆర్థికపరమైన స్వేచ్ఛ వచ్చినప్పుడే వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్న అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తికి అద్దంపట్టేలా ఎటువంటి షరతులు లేకుండా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తున్నది. తద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు ప్రజ్వరిల్లుతున్నాయి. దళితుల జీవితాల్లో గొప్ప పురోగతికి ఈ పథకం పునాది కానున్నది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా తీసుకువచ్చిన సంస్కరణలన్నీ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఎల్ఐసీ, తదితర ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం ఈ కోవకు చెందినవే.
మొన్నటికి మొన్న ‘అగ్నిపథ్’ అంటూ భారత సైన్యంలో కొత్త సంస్కరణను తీసుకువచ్చింది. అగ్నిపథ్ పేర కాంట్రాక్టు పద్ధతిన యువతీయువకులు భారత సైన్యంలో నాలుగున్నరేండ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ‘అగ్నిపథ్’ అభ్యర్థులను అవమానించేలా మాట్లాడారు. అగ్నిపథ్లో చేరిన యువకులకు బట్టలుతకడం, కటింగ్ చేయడంలో నైపుణ్యం వస్తుందన్నారు. అలాగే మరో మంత్రి ‘అగ్నిపథ్’ కాంట్రాక్టు పద్ధతి ముగిసిన తర్వాత యువకులను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని యువతలో ఆత్మైస్థెర్యం సన్నగిల్లేలా మాట్లాడటం సిగ్గుచేటు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న బలవంతపు సంస్కరణలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ స్వార్థపూరిత సంస్కరణలను ప్రజలు తిప్పికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
సంపత్ గడ్డం: 78933 03516
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు, కామారెడ్డి)