‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథంలో వాయువేగంతో దూసుకుపోవడం ఆశ్చర్యకరమే. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది. కేసీఆర్ మనసు ఎప్పుడూ రైతన్నలపై ఉంటుందనేది బడ్జెట్ను చూసిన వెంటనే అవగతమవుతుంది. రూ.26,831 కోట్లు వ్యవసాయ-అనుబంధ రంగాలకు, మరో రూ.26,885 కోట్లు నీటిపారుదలకు కేటాయించారు. అతి ఘనంగా రూ.31,426 కోట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఇవ్వడమూ ప్రశంసనీయమే. దళితబంధుతో సహా ఏ రంగాన్నీ విస్మరించలేదు. మౌలిక వసతులతోపాటు సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ సమతుల బడ్జెట్ను రూపొందించడం అభినందనీయం.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యమకాలం నుంచే తెలంగాణ పట్ల స్పష్టమైన విజన్ ఉన్నది. ఆ విజన్ ప్రకారమే తెలంగాణ పురోగమిస్తున్నదనేది తాజా బడ్జెట్ ద్వారా వెల్లడైంది. ఈ విజన్ కారణంగానే ఇవాళ తెలంగాణను దేశానికి రోల్మాడల్గా చూపించగలుగుతు న్నాం. పొరుగు రాష్ట్రంలో బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జనం హాజరయ్యారంటే తెలంగాణ నమూనాకు దేశవ్యాప్తంగా లభించిన ప్రాచుర్యమే కారణం. ఆరోగ్య సేవల రంగంలో దేశంలోనే మూడవ ర్యాంక్కు చేరుకున్నాం. మాతాశిశు మరణాలు, ప్రసవ శస్త్ర చికిత్సలను తగ్గించడం, వైద్య సిబ్బంది నియామకం వంటి ఏ కొలమానం ప్రకారం చూసినా తెలంగాణ పనితీరు ప్రశంసనీయంగా ఉన్నది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించినట్టు- రాష్ట్రం అవతరించిన నాటి నుంచి ఐటీ ఎగుమతులు 220 శాతం పెరిగి రూ.1,83,569 కోట్లకు చేరుకున్నాయి. రాష్ట్రంలోకి రూ.3,31,000 కోట్ల మేర పెట్టుబడులు చేరడమే కాదు, 22 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి.
కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి అండగా నిలబడవలసిన కేంద్రం వివక్ష చూపుతూ మన పురోభివృద్ధికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నది. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఏపీ పునర్విభజన చట్టంలో హామీలనే అమలు చేయడం లేదు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలను పురికొల్పుతున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని బాగుపరిచినట్టే దేశాన్ని చక్కదిద్దడానికి బీఆర్ఎస్ వేదికగా ముందుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పోకడలను అర్థం చేసుకొని, ముఖ్యమంత్రి ప్రయత్నాలకు అండగా నిలువాలి.