మన గ్రామీణ జనాభా 60 శాతం. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు గ్రామాల్లో అనేక సమస్యలుండేవి. నీళ్లు, నిధులు లేక ఎన్నో అవస్థలు పడ్డాయి. ఇక పారిశుధ్యం అనేది ఓ కలలా ఉండేది. ఈ నేపథ్యంలోంచే.. కేసీఆర్ ‘పల్లెప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ వంటి కార్యక్రమాలకు సీఎం రూపకల్పన చేశారు. ఏటా గ్రామీణాభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మొత్తం రూ.25 వేల 098 కోట్ల 45 లక్షల 55 వేల భారీ మొత్తాన్ని కేటాయించింది. ఇందులో పంచాయతీరాజ్ శాఖకు 12 వేల 811 కోట్ల 92 లక్షల 11 వేలు; గ్రామీణాభివృద్ధి శాఖకు 12 వేల 286 కోట్ల 63 లక్షల 44 వేల రూపాయలను శాసనసభ ఆమోదం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రతిపాదించారు. అంతకు తగ్గనివిధంగా బడ్జెట్ను ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు.
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చింది. రాష్ట్రంలో ఇదివరకు 8,690 గ్రామ పంచాయతీలుండేవి. అవి ఇప్పుడు 12,769కు పెరిగాయి. 3,146 తండాలు, ఆదివాసి గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చా రు. ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఉం డేవిధంగా 9,355 మందిని కొత్తగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నూతన గ్రామ పంచాయతీ చట్టంలో సర్పంచ్లు, కార్యదర్శులకు అధికారాలతో పాటు బాధ్యతలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది.
గతంలో 9 మంది మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓలు) ఉంటే, ఆ సంఖ్య 32కి పెరిగింది. డీఎల్పీవోల సంఖ్య కూడా 28 నుంచి 68కి పెరిగింది. మండల పంచాయతీ అధికారుల సంఖ్యను 438 నుంచి 539కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లెలు, పట్టణాల ప్రగతిని పర్యవేక్షించేందుకు ఒక ఐఏఎస్ అధికారిని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీకి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పీఆర్సీ ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు రూ.7,500ల నుంచి లక్షకు పెంచింది. అలాగే.. జెడ్పీటీసీలకు రూ.2,250ల నుంచి రూ.10 వేలు, 13 వేలుగా; ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.10 వేలు, 13 వేలుగా; ఎంపీటీసీలకు రూ.750 నుంచి 5 వేలు, 6,500 లకు; సర్పంచులకు వెయ్యి నుంచి రూ.5 వేలు, 6,500లు ఉండేలా గౌరవ వేతనాలు పెంచింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధి కోసం ట్రాక్టర్లు, ట్రాలీలు, నీటి ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో అన్ని పంచాయతీలలో 87 ట్రాక్టర్లు ఉంటే, ఇప్పుడు 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చింది. గతంలో ట్రాక్టర్లను కిరాయికి తెచ్చేవారు. ఉపాధి హామీ నిధుల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసేందుకు రూ.180 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. ఇప్పుడు ఈ నిధులన్నీ గ్రామ పంచాయతీలకు ఆదాయంగా మారాయి.
వైకుంఠ ధామాలు: గతంలో పేద ప్రజలు మరణిస్తే అంత్యక్రియలు చేయటానికి చోటులేని దుస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రతి గ్రామానికి శ్మశానవాటిక ఏర్పడింది. ఇప్పటి వరకు 12,729 వైకుంఠ ధామాలు పూర్తయ్యాయి. ఒక్కో స్మశానవాటిక అంచనా విలువ రూ.12 లక్షల 50 వేలు. ఇప్పటివరకు మొత్తం రూ.1,327 కోట్లు ఖర్చు చేశాం.
నర్సరీలు-హరితహారం: ఉమ్మడి రాష్ట్రంలో నర్సరీలు జిల్లాకు ఒకటో, రెండో.. అవి కూడా ఫారెస్టు డిపార్టుమెంట్ పరిధిలో ఉండేవి. మొక్కల కోసం పక్క రాష్ర్టాలపై ఆధారపడే దుస్థితి ఉండేది. తెలంగాణ వచ్చాక చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం తెచ్చారు. పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి గ్రామం, ఆవాసాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా, 12,759 గ్రామాల్లో విలేజ్ నర్సరీలున్నాయి. ఈ ఏడాది ఈ నర్సరీల ద్వారా 18 కోట్ల 48 లక్షల మొక్కలను ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9 కోట్ల 91 లక్షల మొక్కలను నాటి, 96 శాతం మొక్కలను సంరక్షించుకున్నాం.
పల్లె ప్రకృతి వనాలు: గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు నడకస్థలం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎకరానికి తగ్గకుండా అంతకుమించి స్థలాల్లో పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నాం. దీని కోసం రూ.6 లక్షలు ఖర్చుచేస్తున్నం. పల్లె ప్రకృతి వనాల్లో ఓపెన్ జిమ్ములు, వాకింగ్ ట్రాకులు, పిల్లల కోసం ఆటస్థలాలు, పెద్దలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.67 కోట్ల 45 లక్షల ఖర్చుతో 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలను చేపట్టాం.
గ్రీన్ బడ్జెట్: గ్రామ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్ (10 శాతం) నిధులు పచ్చదనానికి వినియోగించాలనే నిబంధన పెట్టాం. ఇవ్వాళ కూడా సమావేశం పెట్టి సమీక్ష చేశాం. దీంతో 2020-21లో రూ.369 కోట్ల గ్రీన్ బడ్జెట్ ఏర్పడింది. తెలంగాణలో 7 శాతం ‘గ్రీన్ కవరేజ్’ పెరిగిందనీ కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ ప్రకటించడం ఈ పథక విజయానికి నిదర్శనం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నంగా మన ‘హరితహారం’ గుర్తింపు పొందింది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా 230 కోట్ల మొక్కలు నాటినం.
రైతు వేదికలు: రైతులు ఏ సీజన్లో, ఏయే భూముల్లో ఏ పంటలు వేయాలి? విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ చర్యలు ఏమిటి? రైతులు పండించిన పంటలకు డిమాండ్ ఎక్కడ? ఎలా ఉంది? వంటి విషయాలను రైతులే ఒకచోట కూర్చుని చర్చించుకునేలా రూ.22 లక్షల అంచనా వ్యయంతో రైతు వేదికలు నిర్మించాం. ఇప్పుడు అవి రైతుల శిక్షణా కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటివరకు 2,598 రైతు వేదికలను పూర్తిచేశాం. 526 కోట్ల 92 లక్షలు ఖర్చుచేశాం.
మిషన్ భగీరథకు నిధులు: 25 ఏండ్ల కిందట సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన ఇంటింటికి నళ్లాల ద్వారా మంచినీటి తరహాలో ఒక కొత్త అద్భుత, ఆదర్శవంతమైన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. రూ.36 వేల కోట్లతో పూర్తిచేసిన ‘మిషన్ భగీరథ’ ద్వారా రాష్ట్రంలో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పోయింది. పైగా అప్పట్లో నీటి అవసరాల కోసం వినియోగించిన నిధులన్నీ ఆదా అవడమే కాకుండా, ఇప్పుడు ఆ నిధులు అవే గ్రామపంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.
డంపింగ్ యార్డులు: గతంలో గ్రామాలు చెత్తచెత్తగా, వానలు పడితే బురదమయంగా ఉండేవి. గ్రామంలో చెత్తను తొలగించడమే కాదు, ఎక్కడ వేయాలనేది కూడా ఓ పెద్ద సమస్య. చెత్తను తొలగించడానికి, విసర్జించడానికి ఓ పద్ధతి అంటూ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, శాస్త్రీయంగా చెత్తను వేరుచేసే షెడ్లు ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు 12,753 డంపింగ్ యార్డులు పూర్తయ్యాయి. ఈ చెత్తతో 12,705 డంపింగ్ యార్డుల్లో కంపోస్టు ఎరువు తయారుచేస్తున్నాం. ఉదాహరణకు: ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామంలో తడి చెత్త ద్వారా రూ.3 లక్షలు, పొడి చెత్త ద్వారా రూ.50 వేల రూపాయల ఆదాయం వస్తున్నది.
అలాగే గ్రామీణాభివృద్ధిలో ఉపాధిహామీ పనులు చేపట్టి, నిధులు వినియోగించుకోవడంలోనూ దేశంలో మనమే నెంబర్ వన్. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామీణాభివృద్ధికి కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్రం నిధులు ఇస్తున్నది. పనుల నిర్ణయం, నిధుల వ్యయంలో గ్రామ పంచాయతీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం తెలంగాణ. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను 10 వేల కోట్లు ఇచ్చాం. అభయహస్తం పథకం కింద కాంట్రిబ్యూషన్ పింఛన్ కింద పొదుపు చేసుకున్న 545 కోట్లను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పింఛన్ల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.11,700 కోట్లు బడ్జెట్లో కేటాయించింది ప్రభుత్వం. 38 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ చేసిన కృషికి గాను తెలంగాణ జాతీయస్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకుంది.
1.గందగీ ముక్త్ భారత్-2020: తెలంగాణ రాష్ట్రం 1వ స్థానం (స్టేట్ క్యాటగిరీ), కరీంనగర్ జిల్లా 3వ స్థానం (జిల్లా క్యాటగిరీ). సిద్దిపేట జిల్లా ఉత్తమ ప్రదర్శన. 2. స్వచ్ఛ సుందర్ సౌచాలయ్-2019: తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం (స్టేట్). పెద్దపల్లి జిల్లా మొదటి స్థానం (జిల్లా). 3.స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2018: తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం (స్టేట్). 4.స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2019: తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం (స్టేట్). 5.శ్యామప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్భన్ మిషన్-2018: తెలంగాణ రాష్ట్రం 3వ స్థానం (స్టేట్). 6.శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్భన్ మిషన్-2019: తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానం (స్టేట్). 7.ఇ-పురస్కార్ అవార్డు-2021: తెలంగాణ రాష్ట్రం 1వ స్థానం (క్యాటగిరీ-2). 8.దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ అవార్డు-2021: ఉత్తమ జిల్లా పరిషత్గా మెదక్ (సంగారెడ్డి). 9.నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్-2021: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల. 10.బాల-స్నేహపూర్వక గ్రామ పంచాయితీ అవార్డు-2021: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. 11.గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అవార్డు-2021: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల. 12. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్భన్ మిషన్ -జాతీయ ర్యాంకు-2022: తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం (స్టేట్). 13.సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన-జాతీయ ర్యాంకు-2022: సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అమలులో 2022 ఫిబ్రవరి 24 నాటికి దేశంలోని 324 SAGY గ్రామాల్లో, మొదటి, 2వ స్థానాలను రాష్ట్రంలోని వెన్నంపల్లి (కరీంనగర్) కౌలాస్ (కామారెడ్డి జిల్లా) కైవసం చేసుకోవడం గర్వకారణము. అలాగే జాతీయస్థాయిలో 7 తెలంగాణ గ్రామాలు టాప్ 10లో, 12 తెలంగాణ గ్రామాలు టాప్ 20 స్థానాలలోపు నిలిచాయి. ఇవేకాకుండా ఇంకా ఎన్నో అవార్డులను జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకున్నది.
(2022-23 ఆర్థిక సంవత్సరపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రసంగం సంక్షిప్తంగా..)