ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టి ఇక గ్రామాల వైపు మళ్ల వలసిన అవసరం కనిపిస్తున్నది. పార్టీకి ప్రజాదరణ నగరాలలో తక్కువ కాగా గ్రామాల్లో ఎక్కువన్నది మొదటినుంచి ఉండిన అంచనా. ఫలితాలు కూడా అట్లానే ఉండేవి. కానీ, ఆ పరిస్థితి ఈసారి తిరగబడటమన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న స్థితి. ఈ అనూహ్య పరిణామానికి కారణాలను అన్వేషించి దిద్దుబాటు చర్యలు తీసుకోవటం పార్టీ భవిష్యత్తుకు అతి కీలకమైన విషయం.
బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంలో ఈసారి అన్ని స్థానాలను గెలుచుకున్నది. లోగడ కూడా అధిక స్థానాలు లభించినప్పటికీ మొత్తం అన్నీ కాదు. మరొకవైపు గ్రామ సీమలతో కూడిన జిల్లాలలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడాలు లేకుండా అంతటా దెబ్బతిన్నది. ఒక్క ఖమ్మం జిల్లాను అక్కడి ప్రత్యేక పరిస్థితుల వల్ల మినహాయిస్తే లోగడ మరెక్కడా సమస్యలుండేవి కావు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్కు కంచుకోట అనే పేరుండేది. అటువంటిది ఈసారి జరిగిందేమిటో కనిపిస్తున్నదే.
అధికార పక్షాలకు సాధారణంగా పట్టణ ప్రాంతాలలో తక్కువ ఆదరణ, గ్రామాలలో ఎక్కువ ఉండటం మనకు తెలుసు. అది ఎందువల్ల? పట్టణాల ప్రజలు గ్రామీణుల కన్న ఆర్థికంగా స్థితిమంతులు. ఎక్కువ చదివినవారు. ఆలోచించేవారు. కడుపు నిండి భద్రంగా జీవించేవారు గనుక ప్రభుత్వాలపై వారికి అసంతృప్తి ఎక్కువ. అందుకు తోడు నగరాలకు పౌర సౌకర్యాల అవసరాలు గ్రామాల కన్న చాలా ఎక్కువ గనుక, కరెంటు, రోడ్లు, ఇళ్లు, రవాణా సదుపాయాలు, పారిశుధ్యం, శాంతిభద్రతలు, విద్యావైద్యాలు మొదలైన వాటిలో దేనికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఈ వైఖరి వల్ల పట్టణవాసులకు చపలచిత్తులనే (ఫికిల్ మైండెడ్) పేరున్నది. వారిని ఏ ప్రభుత్వమూ పూర్తిగా సంతృప్తి పరచజాలదు. గ్రామీణుల ఓట్లు చాలా వరకు స్థిరంగా ఉండగా వీరి ఓట్లు తరచూ ఆ పార్టీకి, ఈ పార్టీకి మారుతుంటాయి.
ఈ విధమైన నేపథ్యంలో బీఆర్ఎస్ హైదరాబాద్ ప్రజలను గణనీయమైన రీతిలో సంతృప్తిపరిచి, 2014, 2018లోనూ లేనివిధంగా ఈ సారి మొత్తం అన్ని సీట్లనూ సాధించటం, అది కూడా మంచి మెజారిటీలతో కావటం, అసాధారణమైన విషయం. ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి, పైన చెప్పుకొన్నట్టు నగర ప్రజలకు ఉండే సర్వసాధారణ సినికల్ స్వభావానికి భిన్నంగా జరగటం. రెండు, బీఆర్ఎస్ తన గత రికార్డును ఈసారి అధిగమించటం. ఈ రెండింటిని గ్రామాల్లో జరిగినదానితో పోల్చి చూసినప్పుడు, బీఆర్ఎస్ పరిపాలనా ప్రభావం హైదరాబాద్లో ఎంత సానుకూలంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 2018-23 మధ్య ఎంతెంత చేసిందో అందరూ చెప్తున్నదే గనుక, ఇక్కడ మళ్లీ ఏకరువు పెట్టనక్కరలేదు. ఇందులోనే మరొక విశేషమేమంటే, కేవలం ఇటువంటి అభివృద్ధి కారణాల వల్లనే సీమాంధ్రుల ఓట్లు, మైనారిటీల ఓట్లు కొందరు జోస్యం చెప్పినట్లు కాంగ్రెస్ వైపు మళ్లలేదు. ఇటువంటి సంతృప్తికరమైన సర్టిఫికెట్ తనకు నగరవాసుల నుంచి లభించిన దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ తన ఇంతకాలపు కృషిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే సరిపోవచ్చు. ఆ పార్టీకి దీనికిదే ఒక గొప్ప ఘనత. నగరవాసుల సంప్రదాయిక సినిసిజంపై ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే అరుదుగా తప్ప సాధించలేని విజయమిది. జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యాన్ని పరిగణించినప్పుడు ఇప్పుడీ విజయం మరింత ఘనంగా కనిపిస్తుంది.
ఇదే విషయాన్ని మరొక కోణంలో చూసినట్టయితే, నగరవాసుల స్థితిగతులు, ఆలోచనలను, క్యాపిటలిస్టు ప్రజాస్వామ్యమని, గ్రామీణుల స్థితిగతులు, ఆలోచనలను ఫ్యూడల్ ప్రజాస్వామ్యమని చెప్పవచ్చు. నగరవాసుల మనుగడకు సంబంధించి రోజువారీ సమస్యలు ఉండవు. పౌర సదుపాయాల కల్పన, భవిష్యత్తుకు సంబంధించి మెరుగైన కెరీర్, వినోద విహారాలు తప్ప సాధారణ అర్థంలో బతుకుదెరువు, సంక్షేమం వారి దృష్టిలోకి రావు. (దిగువ మధ్య తరగతి, మురికివాడల వాసులు మాత్రం ఇందుకు మినహాయింపు) కనుక వారికి ప్రాతిపదిక అయ్యేది క్యాపిటలిస్టు ప్రజాస్వామ్యం. పైన పేర్కొన్న తరహాలో తమ అవసరాలు తీరేట్లు ఒక ప్రభుత్వం పాలించగలిగితే అది వారిని సంతృప్తి పరచగలిగే ప్రజాస్వామిక పాలనవుతుంది. గ్రామ జనాభా తగ్గి పట్టణీకరణ పెరుగుతూ పట్టణాలూ, నగరాలు పెరిగి అభివృద్ధి చెందే పారిశ్రామిక దేశాల్లోని ప్రజల్లో కనిపించే ఆలోచనలు ఇవి. వాటి వెంట ఉండే పౌర సమస్యలు, ఫిర్యాదులూ, వాటిని పరిష్కరించి సంతృప్తి పరచటాలు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవటం వల్లనే దీన్ని క్యాపిటలిస్టు ప్రజాస్వామిక స్థితి అంటున్నాం. యథాతథంగా హైదరాబాద్ నగరం, దాని పరిసరాలు ఒక క్యాపిటలిస్టు వ్యవస్థలో లేకపోవచ్చు. కానీ, అది తప్పకుండా ఒక ఫ్యూడల్ సముద్రం మధ్య, క్యాపిటలిస్టు సమాజం తరహా స్వభావం గల ఒక దీవి వంటిది కనుక, తక్కిన తెలంగాణకు భిన్నమైన అభివృద్ధి, సంక్షేమ అవసరాలు అక్కడి వారికి ఉంటాయి. ఆలోచనా ధోరణులు కూడా అందుకు అనుగుణంగా ఉంటాయి.
ఇప్పుడు గ్రామాల పరిస్థితిని చూద్దాం. ఇది నగర ప్రాంతాల కన్న ఎక్కువ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన పరిస్థితి. నగరాల కన్న ఎక్కువ సంక్లిష్టమైనది. నగరవాసుల అవసరాలను తీర్చి వారి మెప్పును సంపాదించటం నిజానికి తేలికైన పని. అందుకు కావలసింది తగిన నిధులు, తగిన కార్య ప్రణాళిక, తగిన యంత్రాంగం, తగిన అమలు. ఇదంతా ఒక సరళరేఖ ప్రయాణం వంటిది. ప్రత్యేకంగా చిక్కుముడులంటూ ఉండవు. కానీ, గ్రామాలు అట్లా కాదు. మన సమాజంలో ఒకవైపు ఆర్థిక వెనుకబాటుతనం, కులాలు-ఉపకులాలతో కూడిన సమాజం, సామాజిక అంతరాలు, అభివృద్ధి చెందని గ్రామాలు, ఉపాధి అవకాశాల కొరతలు, మౌలిక సదుపాయాల కొరతలు, విద్యావైద్యాల లోపాలు, రకరకాల వివక్షలు, స్థానికంగా ఉండే బలమైన వర్గాల అణచివేతలూ ఆధిపత్యాలు, నిశ్శబ్ద నిరసనలు, ఎంతో కొంత చైతన్యం గలవారి ధిక్కార ధోరణులు కనిపిస్తాయి. ఇవన్నీ నగర ప్రాంతాలలో ఉండనివి. ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు అడుగడుగునా సంక్లిష్టమైనవే. అందుకు తగినట్టే అక్కడి ప్రజలు, ప్రజా సమూహాల ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. ముఖ్యంగా గుర్తించవలసిందేమంటే ఆయా ప్రజలు, ప్రజా సమూహాల అవసరాలు కూడా ఆ ప్రకారమే ఉంటాయి.
ఒక వైపున ఇది ఉండగా, మరొకవైపున ప్రభుత్వం, స్థానిక ఆధిపత్య శక్తులు ఉంటాయి. పైన చెప్పుకున్న వివిధ పరిస్థితులు, స్థానిక ఆధిపత్య శక్తులు కలిసి అక్కడి ప్రజాస్వామ్యాన్ని ఫ్యూడల్ ప్రజాస్వామ్యంగా మార్చుతాయి. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులతో ఎట్లా వ్యవహరించటమన్నదే ఒక ప్రభుత్వం ఎదుట ఉండే తీవ్రమైన సవాలు.
ఒక ప్రభుత్వపు ఆలోచనలు, విధానాలు ఎంత మంచివైనా కావచ్చు గాక. కానీ, ఇటువంటి సంక్లిష్ట గ్రామీణ పరిస్థితులతో అవసరమైన రీతిలో వ్యవహరించగలిగితేనే ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇది కేవలం సంప్రదాయిక దృష్టి ప్రకారం చేసే సంక్షేమం, అభివృద్ధి ప్రశ్న కాదు. అంతకు చాలా చాలా మించినది.
మన వర్ధమాన దేశంలో, సమాజంలో అభివృద్ధి, సంక్షేమం అనే ఆలోచనలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. మొట్టమొదట జాతీయస్థాయిలో ఏర్పడి నెహ్రూ ప్రభుత్వం వీటి అమలును ఆరంభించింది. అదే ప్రకారం వివిధ రాష్ర్టాలలో ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా. కానీ, ఉద్దేశాలు ఏవైనప్పటికీ అవేవీ కూడా పైన ప్రస్తావించిన గ్రామీణ సంక్లిష్టతలతో సరిగా వ్యవహరించలేకపోయాయి. మరొకవిధంగా చెప్పాలంటే వాటిని పరిష్కరించలేకపోయాయి. అక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమ సమస్యలు గాని, వారికి స్థానిక ఆధిపత్య శక్తులతో ఉండే సమస్యలు గాని పరిష్కారం కాలేదు. అందువల్ల తలెత్తిన అశాంతి మధ్యనుంచి కులాలు, వృత్తులు, ప్రాంతీయతల ప్రాతిపదికల కొత్త పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వివిధ ఫ్రంట్లు ముందుకు వచ్చాయి. కానీ అవేవీ కూడా ఒక మేరకు మెరుగుదలను చూపించవచ్చు గాని పరిష్కారాలు మాత్రం చూపలేకపోయాయి. అందువల్ల గ్రామీణ అసంతృప్తులు, అశాంతులు కొనసాగాయి. ప్రజల సమస్యలు, అవసరాలు ఎంత, ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి-సంక్షేమాలు ఎంత అనే అనుపాతంలో ఆయా రాష్ర్టాల అశాంతులు కనిపించాయి.
తెలంగాణ విషయానికి వస్తే, మనది వందల ఏండ్లుగా ఫ్యూడల్ సమాజం. పైన చెప్పుకొన్న గ్రామీణ స్థితిగతులు అదే ప్రకారం ఉంటూ వచ్చాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించి, ఫ్యూడల్ వ్యవస్థ చట్టబద్ధంగా రద్దయి, నెహ్రూ చొరవతో అభివృద్ధి, సంక్షేమ అజెండాలు గ్రామీణ ప్రాంతాలలో ఆరంభమంటూ అయినా, ఆ తర్వాత 35 ఏండ్లకు ఎన్టీఆర్ నాయకత్వాన ఏర్పడిన ఒక ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చేవరకు గ్రామీణ పేదలకు ఆకలి అనే ఒక కనీస అవసరం తీరలేదంటే, ప్రభుత్వాలు గ్రామీణ అభివృద్ధి-సంక్షేమాలను ఏ విధంగా అమలుపరిచాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, సరిగ్గా ఈ వైఫల్యం వల్లనే రామారావు కన్న 15 ఏండ్ల ముందే నక్సలైట్ ఉద్యమం గ్రామీణ అశాంతి నుంచి ఆవిర్భవించింది. అందుకు తెలంగాణ ఒక ముఖ్య కేంద్రమైంది.
ఇటువంటి సుదీర్ఘ నేపథ్యాల మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత, స్వాతంత్య్రం వచ్చి 67 ఏండ్లు, ఎన్టీఆర్ పాలించి సుమారు 20 ఏండ్లు గడిచిన వెనుక, ఇక్కడ ఒక కొత్త అభివృద్ధి-సంక్షేమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి-సంక్షేమాలను మునుపెన్నడూ లేని స్థాయికి తీసుకుపోయింది. అందువల్లనే తనకు అనుకూలమైన ఎన్నికల ఫలితాలు 2014 కన్న 2018లో గణనీయంగా మించిపోయాయి.
కానీ, ఇప్పుడు మరొక ఐదేండ్లు గడిచినాక 2023లో వెలువడిన ఫలితాలు అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. అందుకు సమాధానాలను వెతికేముందు ఒక ప్రశ్న స్పష్టం కావలసి ఉన్నది. ఈ స్థితికి కారణం గ్రామీణాభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత తొమ్మిదేండ్లుగా గల కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, చిత్తశుద్ధిలో ఏవైనా లోపాలు కొత్తగా వచ్చి చేరాయా? లేక అమలులో లోపాలున్నాయా? అన్నది మొదటిది. విధానాలు, చిత్తశుద్ధిలోనే లోపాలు వచ్చి చేరితే అది వేరు. ఇక చేయగలిగిందేమీ లేదు. అట్లా గాక అమలులో లోపాలు అయితే అవి ఆచరణలో ఎట్లా ప్రతిఫలిస్తున్నాయి? అందువల్ల ప్రజల జీవితాలపై ప్రభావం ఏమిటి? వారి ఆలోచనలపై ప్రభావం ఏమిటి? ఆ ప్రభావాలు వారి మాటలలో, వ్యవహరణలో ఎట్లా వ్యక్తీకరణ అవుతున్నాయి? ఈ సమస్యలను, ఆచరణ లోపాలను పరిష్కరించటం ఏ విధంగా అన్నది మరొక ప్రశ్న.
ఈ పరిస్థితులు, సమస్యలు, గ్రామీణుల ఆలోచనలు, వారు కోరుకునే పరిష్కారాల గురించి బీఆర్ఎస్ నాయకత్వం అవగాహన చేసుకోవలసింది ఇంకా ఉన్నదని మాత్రం ఈ 2023 ఫలితాలు చెప్తున్నాయి. వీటిపై నాయకత్వం 2014 నుంచి ఈ పదేండ్లలో వ్యవహరించిన తీరు, అంతిమ సారాంశంలో ఇతర సంక్షేమ ప్రభుత్వాల నమూనాలోనే ఉన్నది. కాకపోతే, వాటన్నింటికన్న చిత్తశుద్ధితో, అంతకన్న అనేక రెట్లుగా. అయినప్పటికీ అది సరిపోదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇందులో కొన్ని సమస్యలు చాలినన్ని ఆర్థిక వనరులకు సంబంధించినవి కావచ్చు. మరికొన్ని ఆ పరిమిత వనరుల నిర్వహణ ఏ విధంగా జరుగుతున్నదనేది కావచ్చు. మరికొన్ని ఆయా పరిస్థితులను, పరిమితులను ప్రజలకు పారదర్శకంగా వివరించటానికి సంబంధించి కావచ్చు. ఇటువంటి వాటికి ఉదాహరణలు చూడాలంటే దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి పథకాలకు గల వనరుల సమస్య, అవి దశలవారీగా తప్పక అమలు కాగలవన్న వివరణ విషయం కావచ్చు. అంతే ముఖ్యంగా అటువంటి పథకాల అమలులో పారదర్శకత లేకపోవటం, స్థానిక బీఆర్ఎస్ నాయకుల పట్ల అసంతృప్తి కావచ్చు. రైతుబంధు పథకం పెద్ద రైతులకు కూడా పోవటం వంటివి కావచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ పరిస్థితులు గాని, వాటిపై ప్రజల నిరసనలు గాని ఫ్యూడల్ ప్రజాస్వామ్య స్థితికి సంబంధించినవి.
ఇటువంటి సూచనలు కొంతకాలం నుంచే కనిపిస్తున్నాయని తెలిసిందే. ఇందుకు పరిష్కారాన్ని కనుగొని అమలు చేయనందువల్లనే ఈసారి గ్రామీణ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పార్టీ గ్రామాలకు తరలివెళ్లి ఈ పరిస్థితులను ప్రజల నుంచి ప్రత్యక్షంగా, కూలంకషంగా తెలుసుకోవటమే కాదు. లోపాలను సరిదిద్దుకోవటంతో పాటు ముఖ్యమైన మరొక పనిచేయాలి. ఇటువంటి లోపాలు మున్ముందు జరిగేందుకే వీలుకాని రీతిలో వ్యవస్థాపరమైన నిర్మాణాలు, అమలుపరమైన ఏర్పాట్లు ఏమి చేయవచ్చునో కనుగొనాలి. నిజానికి వీటిని శోధించే క్రమంలో ఇటువంటి పరిష్కార సూచనలు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలనుంచే వస్తాయి. ఇంతవరకు సాగించిన గ్రామీణ అభివృద్ధి సంక్షేమాలు గతకాలపు నమూనాలోనే ఉన్నాయని, కాకపోతే కొన్ని రెట్లు ఎక్కువ స్థాయిలోనని పైన అనుకున్నాము. కానీ ఈ విధంగా వ్యవస్థాపర నిర్మాణాలు, అమలు ఏర్పాట్లు చేయగలిగితే అది మొత్తం దేశానికే సరికొత్తదైన, అత్యంత వాంఛనీయమైన నమూనా కాగలదు.
-టంకశాల అశోక్