అభివృద్ధి, వికాసాల్లో రంగం ఏదైతేనేమి అన్నింటా అగ్రగామిగా తెలంగాణ దూసుకుపోతున్నది. దీనికి ‘రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్టు’ సాక్ష్యంగా నిలుస్తున్నది. తాజా నివేదిక ప్రకారం.. వృద్ధిరేటు, తలసరి ఆదాయం, ఆరోగ్యరంగంలోనూ జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందున్నది. వృద్ధిరేటులోగానీ, సగటు ఆదాయంలోగానీ దేశంలోని పెద్ద రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచింది. గత ఐదేండ్ల కాలంలో దేశ తలసరి ఆదాయం రూ.1,26,829 ఉంటే, మన రాష్ట్ర సగటు ఆదాయం రూ.2,37,63లుగా ఉన్నది. ఇది దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు. ఈ కాలంలోనే జాతీయ సగటు ఆదాయం క్రమంగా అధోముఖంగా దిగజారటం గమనార్హం.
ఆదాయం, ఆరోగ్యంలోనూ ఒక ప్రాంతం ఉన్నతస్థితికి చేరుకోవటం సాధారణ విషయం కాదు. ప్రజల నిర్దిష్ట సామాజిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో అభివృద్ధి వికాసాలకు మార్గాలు వేయా ల్సి ఉంటుంది. సహజ వనరులైన నదీనదాలు, ఖనిజ సంపదను జాతిజనుల ప్రయోజనాల కోసం వినియోగించుకొనే నేర్పు ఉండాలి. భవిష్యత్ దర్శనంతో, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగాలి. దానికి అసాధారణ కృషి, పట్టుదల, సామాజిక దృక్పథం అవసరం. సువిశాల భారతంలో జీవనదులెన్ని ఉన్నా, విస్తారమైన ఖనిజ సంపద ఉన్నా వాటిని ప్రజోపయోగంలోకి తీసుకువస్తేనే అభివృద్ధి సాధ్యం. ఈ విషయంలో కేంద్రంలోని గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. ఇక్కడే తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలబడింది. వనరుల సద్వినియోగంలో, పటిష్ఠమైన ప్రణాళికలు, అమలు కార్యాచరణలో మిగతా రాష్ర్టాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నది.
ఏ విషయం తీసుకున్నా తెలంగాణ ఇవ్వాళ దేశంలో ఎందుకు ముందున్నది? దీనివెనుక ఉన్న రాజకీయ, తాత్విక భూమిక ఏమిటి? ఇదేదో అనుకుంటేనో, అంగలారిస్తేనో వచ్చేది, సాధించేది కాదు. దీనికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం కావాలి. నేడు తెలంగాణను ప్రగతిపథాన నడిపిస్తున్నది అలాంటి నాయకత్వమే. రాష్ట్ర అవతరణ తర్వాత స్వీయపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతక్రమంలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించారు. ఈ ప్రాంత మౌలిక అవసరాలైన తాగు, సాగునీరు అవసరాలను తీర్చటానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చేపట్టారు. రైతుకు అన్నివిధాలుగా అండగా నిలిచి వ్యవసాయరంగాన్ని లాభాల పంటగా మార్చారు. దీనికితోడు గ్రామీణవృత్తుల వికాసం కోసం ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి పూర్వవైభవం తెచ్చారు. ఈ విధమైన చర్యలతోనే మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఫలితంగా ఆదాయం పెరగటంతోపాటు, ఆరోగ్యస్థితి కూడా మెరుగుపడింది. మాతా శిశు మరణాలు తగ్గటం, ఆయుష్షు పెరగటం లాంటివి తెలంగాణ మానవాభివృద్ధికి, వికాసానికి మచ్చు తునకలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేడు దేశానికే అనుసరణీయంగా, ఆదర్శంగా నిలిచింది.