రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి కోసం పడుతున్న పోటీ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? దీన్నెలా చూడాలి? కేవలం ఓట్లు, సీట్ల కోసం విద్యార్థులను రెచ్చగొట్టాలా, వారి జీవితాలను బలిపెట్టాలా? ఎక్కడైనా తప్పు జరిగితే దానికి శిక్ష ఉంటుంది, ప్రత్యామ్నాయాలూ ఉంటాయి. కానీ అవేవీ లేకుండా నానా యాగి చేసి కృత్రిమ అల్లర్లకు ఆజ్యం పోస్తున్న కుహనా రాజకీయశక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోతే మొదటికే మోసం వస్తుందనడంలో సందేహం అక్కరలేదు.
నీళ్లు, నిధులు. నియామకాల ఉద్యమ పునాదులపై పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్న వేళ లీకేజీ కుట్రలు వెలుగు చూడటం బాధాకరం. ఈ నేపథ్యంలో వరుస నోటిఫికేషన్లు ఇస్తూ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. సర్కారు సంకల్పాన్ని సమీక్షిస్తూనే లోపం ఎక్కడుందనే దానిపై దృష్టి సారించాలి. కుట్రలు ఎవరియైనా ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ భరోసా ఇవ్వాల్సిన సమయమిది.
టీఎస్పీఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తిగల రాజ్యంగ సంస్ఖ. అందులో ప్రభుత్వ జోక్యం కానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉండదు. పోలీస్, సింగరేణి, రవాణా సంస్థ ఇతరత్రా స్వతంత్ర కార్పొరేషన్లు కాకుండా ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తొలి చైర్మన్గా వ్యవహరించిన ఘంటా చక్రపాణి సారథ్యంలో 100 నోటిఫికేషన్లలో 500కు పైగా ప్రశ్నా పత్రాల్లో 75 వేలకు పైగా ప్రశ్నల్లో ఏ ఒక్క ఆరోపణ లేదు. అనంతరం జనార్ధన్రెడ్డికి పూర్తి బాధ్యతలిచ్చి జాబ్ కాలెండర్ను ప్రకటించిన సర్కారు చిత్తశుద్ధిని ప్రశంసించాలి. నిండు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాల కల్పనకు పచ్చజెండా ఊపారు. అనంతరం ఆర్థికశాఖ ఇప్పటికే 70 వేల ఉద్యోగాలకు అనుమతులిచ్చింది. 18 వేల ఖాళీలను పోలీసుశాఖ భర్తీ చేస్తుండగా 26 నోటిఫికేషన్లిచ్చి 23 వేల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్టడీ, కోచింగ్ సెంటర్లు పెట్టి ఉద్యోగార్థుల మన్ననలు పొందుతున్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ఉద్యోగార్థుల మనసు గెలుచుకున్న టీఎస్పీఎస్సీ పనితీరును యూపీఎస్సీ కూడా కొనియాడింది. ఇక్కడి పరీక్షల విధానాన్ని 13 రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారు. మారిషస్లోనూ మన పరీక్షా విధానాన్ని అమలు చేస్తున్నది.
ఉద్యోగాలు భర్తీచేయడం అంటే టీఎస్పీఎస్సీకి కత్తిమీద సామే. అతంత మాత్రంగా ఉన్న సాంకేతికత వ్యవస్థకు తోడు రక్షణ, పర్యవేక్షణ ఆ సంస్థను నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. రెవెన్యూ, ఇతరత్రా ఉద్యోగులను పర్యవేక్షణలో భాగస్వామ్యులను చేయాలంటే పెద్ద సమస్య. అంతెందుకు గ్రూప్ -4 వంటి పరీక్షకు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరైతే పది వేల మంది ఇన్విజిలేటర్లే ఉంటారు. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా, పత్రాలు తారుమారు చేసినా పరీక్షే రద్దవుతుంది.
ఇప్పటివరకు ప్రశ్నాపత్రాలు, ప్రశ్నల రూపకల్పనలో ఎక్కడా తేడా రాలేదు. ఓ ఇద్దరు వ్యక్తుల కారణంగా నేడు టీఎస్పీఎస్సీ వ్యవస్థకు మకిలి అంటుకుంటున్న ది. ఎంత బలమైన వ్యవస్థ ఉన్నా.. పరీక్షల నిర్వహణ, నిఘా అంతా మానవ ప్రమేయమే. ఆ నమ్మకమైన చోటే మానవ తప్పిదం జరగడం విచారకరం.
గత వారం రోజులుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై ఉద్యోగార్థుల ఆవేదనలో అర్థం ఉన్నది. వారి బాధ వాస్తవమే అయినా రాజకీయపార్టీలు అస లు నిజాలు గాలికివదిలేసి ఎన్నికల ఏడాది కాబట్టి తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. పోటీ పరీక్షలకు సన్నదమవుతున్నవారిని రాజకీయ రచ్చకు లాగడం కోసం పోటీ పడుతున్నాయి. సమస్య మూలాలను గుర్తించకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఎండగట్టాలి. ఉద్యోగార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతుంటే, ప్రిపరేషన్స్ పక్కన పెట్టండని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తనతో కలిసిరావాలని పిలిపునిచ్చిన రాష్ట్ర బీజేపి చీఫ్ సంజయ్ వ్యాఖ్యలు ఉద్యోగార్థులు, వారి తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఓ పక్క సిట్ విచారణ జరుగుతుంటే ఇంకో పక్క పీసీసీ చీఫ్ రేవంత్ ఏకంగా కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలే లక్ష్యంగా మాట్లాడుతుండటం రాజకీయ వెకిలితనానికి అద్దం పడుతున్నది.
తెలంగాణలో జరిగిన చిన్న ఉదంతానికే బీజేపీ, కాంగ్రెస్ ఇంత రచ్చ చేస్తున్న సమయంలో ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లీకేజీ ఉదంతాలపై ఇవాళ చర్చ జరుగుతున్నది. బీజేపీ గొప్పగా చెప్పుకొనే యూపీలోని యోగీ సర్కారులో పేపర్ లీకుల ఘటనలు తర చూ జరుగుతూనే ఉన్నాయి. బీఈడీ ప్రవేశ పరీక్ష , ప్రిలిమినరీ ఎలిజిబులిటీ టెస్ట్, యూపీ టెట్, యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరీక్ష, పోలీస్ ఇన్స్పెక్టర్ల నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు ముందే లీకయ్యాయి. అలా గే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో గత తొమ్మిదేండ్లలో 13 సార్లు పరీక్షా పేపర్లు లీకయ్యాయి.
హర్యానా బీజేపీ హయాంలో మొత్తం 28 పేపర్ లీక్ సంఘటనలు జరిగాయని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకయింది. ఈ పేపర్ లీక్ ఘటన తమ ప్రభుత్వ వైఫల్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నా రు. ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వాలేవైనా సరే ప్రశ్నపత్రాల లీకుల పర్వం కొనసాగుతూనే ఉన్నది.
అయితే తప్పిదాలు సహజం. కానీ అవి ఏ స్థాయిలో జరిగాయన్న కోణంలో చూడాలే తప్పా, గుడ్డు మీద ఈకలు పీకి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా డటం సరికాదు. మరోసారి తప్పిదం జరగకుండా అత్యాధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ఆన్లైన్ పరీక్షల విధానాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నది. పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా నోటిఫికేషన్ల జారీ నుంచి ఫలితాల వరకూ ప్రతీది కంప్యూటరీకరణ చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.