పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో. ఇక్కడి పాలకులతో, ప్రజలతో ఆయన అనుబంధం నిరంతరం కొనసాగింది. అంబేద్కర్ హైదరాబాద్కు ఏడెనిమిదిసార్లు వచ్చినట్టు చెబుతారు. కానీ కొన్ని ప్రధాన ఘట్టాలు చెదిరిపోకుండా నిలిచిపోయాయి.
విదేశాలలో చదువుకొని వచ్చి దళితుల పురోభివృద్ధికి పాటుపడుతున్న అంబేద్కర్ అంటే నిజాంకు అభిమానం. ఆయనను హైదరాబాద్ రాజ్య ప్రధాన న్యాయమూర్తిగా ఉండమని కోరారట. కానీ ఆయన లక్ష్యాలు వేరు. అంబేద్కర్ భావజాలం దళితుల పట్ల నిజాం విధానాలను ప్రభావితం చేసింది.
1932లోనే నిజాం ప్రభుత్వం అంబేద్కర్ కు స్కాలర్షిప్ మంజూరు చేసింది. పదిహేను వేల రూపాయల ఏకమొత్తంతో పాటు మూడేండ్ల పాటు నెలకు 500 రూపాయలు మంజూరు అయ్యాయి. 1932లో లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అణగారిన వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ వెళ్ళడానికి నిజాం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. ఈ నిధుల నుంచే అంబేద్కర్ ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కున్నారు. 1944లో హైదరాబాద్ షెడ్యూల్డు కాస్ట్స్ ఫెడరేషన్ సభలకు అంబేడ్కర్ హాజరయ్యారు. ఈ సభల నిర్వహణకు నిజాం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. దళితుల విద్య, అభివృద్ధి కోసం నిజాం ప్రభుత్వం కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ ఔరంగాబాద్లో కాలేజీ స్థాపించుకోవడానికి ఈ నిధి నుంచే 12 లక్షల రూపాయలను షెడ్యూల్డ్ కాస్ట్స్ ట్రస్ట్ అందించింది. 1953లో ఉస్మానియా విశ్వవిద్యాలయమే తొలిసారిగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓయూలోని గెస్ట్హౌజ్లో బస చేసిన అంబేద్కర్ ఇక్కడి పచ్చదనానికి ముగ్ధుడయ్యారట.
అంబేద్కర్ వచ్చినప్పుడు సికింద్రాబాద్లోని ఉద్యమకారుల ఇళ్ళలోనే బస చేసేవారు. ఇక్కడి బిర్యానీ, పాయా, కిచిడీ అంటే ఇష్టపడేవారట. అంబేద్కర్ ఉద్యమ ప్రభావం హైదరాబాద్ రాజ్యంపై కూడా ఉన్నది. ఇక్కడి ఉద్యమకారులు అంబేద్కర్ నిర్వహించే సభలకు వెళ్ళి ప్రసంగించేవారు. దళితులు హిందుమతాన్ని వీడాలని ఆయన పిలుపు ఇచ్చినప్పుడు హైదరాబాద్లో సంచలనం చెలరేగింది. దళిత ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్పందించారు. జాతీయ స్థాయిలో అంబేద్కర్ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పుడు, ఆయనకు మద్దతుగా ఇక్కడి ఉద్యమ నాయకుడు ఒకరు ఆంగ్ల పత్రికలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన వాదనలను ప్రచారం చేయడానికి ఒక సంస్థ అవసరమని భావించి ఇక్కడి ఉద్యమకారులు ‘యూత్ లీగ్ ఆఫ్ అంబేద్కరైట్స్’ను ఏర్పాటు చేశారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అంబేద్కర్ నియమితులైనప్పుడు ఇక్కడి ఉద్యమకారులు సమావేశమై అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. అయితే దళితుల మతమార్పిడులనూ వారు వ్యతిరేకించారు.
నిజాం రాజ్యంలో ఉన్నవారు జాతీయ స్థాయి సంస్థలలో సభ్యులుగా ఉండి కార్యకలాపాలు, ఉద్యమాలు నడపడం అభ్యంతరకరంగా ఉండేది. అందువల్ల ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్లో చేరడం ఇబ్బందికరంగా ఉండేది. అందువల్ల విడిగా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ను ఏర్పాటు చేసుకొమ్మని అంబేద్కర్ ఇక్కడి ఉద్యమకారులకు సూచించారు. 1943లో ఈ సంస్థ నాయకులు ఢిల్లీ వెళ్ళి అంబేద్కర్ను కలిసినప్పుడు వీరి కార్యకలాపాల గురించి తెలుసుకొని ఆయన ఎంతో సంతోషపడ్డారు.
1944లో జరిగిన హైదరాబాద్ స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ సమావేశంలో అంబేద్కర్
ఈ సంస్థను దళితుల ప్రాతినిధ్య సంస్థగా గుర్తించాలంటూ నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు ఛటారీకి ఆయన లేఖ రాసిచ్చారు. దీనివల్ల నిజాం ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సంస్థను సంప్రదించడానికి ఆస్కారం ఏర్పడింది. 1944 సెప్టెంబర్లో అంబేద్కర్ హైదరాబాద్కు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.
దళితులకు కాంగ్రెసే ప్రాతినిధ్యం వహిస్తున్నదనీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ బాంబే, సెంట్రల్ ప్రావిన్సెస్లోనే ఉన్నదని స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ (క్రిప్స్ మిషన్ సభ్యులు) కామన్స్ సభలో పేర్కొన్నప్పుడు హైదరాబాద్లోని దళిత ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. అంబేద్కరే తమ నాయకుడని స్పష్టం చేశారు.
స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండటాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారు. 1950 మే నెలలో అంబేద్కర్ హైదరాబాద్ సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగానే ఔరంగాబాద్లో అంబేద్కర్ సిద్ధార్థ కాలేజీ స్థాపించుకోవడానికి 12 లక్షల రూపాయల రుణ సహాయం అందచేశారు. 1950 డిసెంబర్ చివరి వారంలో అంబేద్కర్ మరొకమారు హైదరాబాద్ నగరానికి వచ్చారు. ప్రభుత్వ అతిథిగా వచ్చిన ఆయన లేక్వ్యూ గెస్ట్హౌజ్లో బస చేశారు. 1951 జనవరి ఒకటవ తేదీన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లోడిని కలుసుకున్నారు. ఈ విధంగా ఉద్యమకాలమంతా హైదరాబాద్ ప్రభుత్వంతో, ఉద్యమకారులతో అంబేద్కర్ అనుబంధం పెనవేసుకుపోయింది.