Telangana Martyrs memorial | హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’ భావితరాలకు చరిత్ర చెప్పేందుకు సిద్ధమైంది. ఎందరో త్యాగధనుల ఆకాంక్షను తెలిపేందుకు.. త్యాగమూర్తుల బలిదానాలను వివరిస్తూ నిత్యం ప్రజ్వలించనున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అమరవీరుల స్మృతివనం ప్రారంభమైంది.
అరవై ఏండ్ల కల. ఎన్నో బలిదానాలు.. ఆత్మహత్యలు..విద్యార్థులనిరసనలు అట్టుడికిన విశ్వవిద్యాలయాలు.. అణచివేసిన యుద్ధంలో గళమెత్తిన గొంతులు.. గర్జించే విద్యార్థులతో.. 4 కోట్ల జన సమూహమై వినిపించిన నినాదమే ‘జై తెలంగాణ’.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన తొలి ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలర్పించారు. తెలంగాణ ఉద్యమానికి నిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతి చిహ్నా న్ని ప్రభుత్వం నిర్మించింది.
హైదరాబాద్లో ఒక పెద్ద దీపంలా.. తళతళా మెరిసే అద్దంలా.. రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన దశాబ్దాల పోరాటాల సారాంశానికి ప్రతీకగా సిద్ధమైంది. రాబోయే రోజుల్లో పర్యాటక ఆకర్షణగా నిలువనున్నది తెలంగాణ అమరుల స్మారక చిహ్నం.. రూ.179 కోట్లతో నిర్మించిన ఈ కట్టడం జూన్ 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిం ది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అమరుల స్మారకా ర్థం హైదరాబాద్లో ఒక కట్టడం నిర్మించాలని భావించారు. జలదృశ్యంలోని సుమారు మూ డున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందు కు పూనుకున్నారు. అమరుల త్యాగాలు భావితరాలకు గుర్తుండేలా.. వారికి నివాళిగా అమరుల భవనం ఏర్పాటుచేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించింది. మూడున్నరేండ్ల కిందట హుస్సేన్సాగర్ ఒడ్డున జలవిహార్కు సమీపంలో తెలంగాణ అమరుల స్మారక చిహ్నం నిర్మాణానికి పునాది పడింది. నిర్మాణ పనుల బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అప్పగించారు. మొదటినుంచి ఆయన పనుల పురోగతిని పరిశీలిస్తూ, అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు సూచనలు చేసి స్మారక నిర్మాణాన్ని పూర్తిచేశారు.
హుస్సేన్సాగర్ సమీపంలో తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా రూపుదిద్దుకొన్నది. ఏడంతస్థుల్లో 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో స్టెయిన్లెస్ స్టీల్తో స్మారకం నిర్మించారు. 85 వేల చదరపు అడుగుల కట్టడంలో 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని మ్యూజియానికి కేటాయించారు. దాదాపు 4 వేల చదరపు అడుగుల టెర్రస్ గార్డెన్, మిగతా ప్రదేశాన్ని కన్వెన్షన్, ఆఫీస్ రూమ్స్, స్టోర్రూం, రిసెర్చ్ హాల్, టాయిలెట్లకు కేటాయించారు. రెండు సెల్లార్లలో 400 కార్లు, 500 బైకులు పార్క్ చేసుకోవచ్చు. ప్రధాన కట్టడం మధ్య భాగంలో పొడవాటి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. దానిపై 30 అడుగుల కాంస్య, స్టీల్తో తయారు చేసిన స్థూపం నిర్మించారు. దారి పొడవునా వివిధ ఆకృతుల్లో శిల్పాలున్నాయి.
ప్రధాన కట్టడమైన దీపాకృతిలోకి ప్రవేశించిన వెంటనే మ్యూజియం ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా ఏర్పాటుచేశారు. ఒకవైపు చిత్ర, ఛాయాచిత్ర ప్రదర్శనకు.. ఇంకోవైపు శ్రవణ, దృశ్య చిత్ర ప్రదర్శనకు కేటాయించారు. ఇక్కడ తెలంగాణ చరిత్ర ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి పైఅంతస్థుకు వెళ్లడానికి ఎస్కలేటర్లు ఉన్నాయి. ఈ అంతస్థు పూర్తిగా కన్వెన్షన్ హాల్ కో సం కేటాయించారు. ఈ అంతస్థులో 700 మందికి పైగా కూర్చోగలిగే హాల్ ఉంటుంది.
అమరుల సంస్మరణార్థం ఈ అంతస్థు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పైభాగంలో టెర్రస్ గార్డెన్ ఉంది. ఇక్కడినుంచి దీపాకృతి ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్టేజీ నిర్మించారు. ఈ స్టేజీ పైనుంచి చుట్టూ చూడగలిగే ఏర్పాటుచేశారు. సందర్శకులు సేద తీర్చుకోవడంతో పాటు పిల్లలు, వృద్ధుల అవసరాలకు గాను చిన్న రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్పై ఉన్న అంతస్థులో వ్యూ పాయింట్ ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం వందలాది మంది అమరుల త్యాగఫలం. దశల వారీగా జరిగిన ఉద్యమాల్లో ఎంతో మంది తమ ప్రాణాల ను తృణప్రాయంగా అర్పించా రు. తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడైన శంకర్ నుం చి మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి మొదలు చివరివరకు పోరాడిన అనేకమంది ఉద్యమ అమరులను ఈ స్మారక స్మృతి మందిరం గుర్తు చేస్తున్నది.