రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడటంలో తప్పులేదు. కానీ, పరిణతి లేని విమర్శలు చేయడమనేది బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర బీజేపీ నాయకులే కాదు, జాతీయ నాయకులు సైతం అబద్ధాలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించడంలో ఆరితేరిపోయారు.బీజేపీ నేతలు చెప్పాలంటే దేశ ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రానున్నామని పగటి కలలు కంటూ రాష్ట్ర ప్రగతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కానీ, వారి ఆశలు అడియాసలు కానున్నాయనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలియకపోవడం హాస్యాస్పదం.
రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదు. ఇక్కడ అన్ని కులమతాలకు ఒకే ప్రాధాన్యం ఉంటుంది. అన్ని మతాల ముఖ్య పండుగలను రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్నది. నిరుపేదలకు బట్టలతో పాటు సహాయ సహకారాలందిస్తూ వస్తోంది. సర్వ మతాల పండుగల విశిష్టతను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది. బతుకమ్మ పండుగకు ప్రతి ఆడబిడ్డ కొత్త దుస్తులు ధరించాలని భావించి చేనేత చీరలను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం సర్వ మతాలకు చెందిన భవనాలు నిర్మించడానికి హైదరాబాద్ నడి ఒడ్డున ప్రతి మతానికి ఒక ఒకరం భూమి కేటాయించింది. ఆ భవనాలు నిర్మాణం పూర్తయే దశలో ఉన్నాయి. అవి ఆయా మతాలకు చెందిన అధికార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడనున్నాయి.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గిరిజన పండుగ ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిస్తున్నది. ఆ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నది. కానీ కేంద్రం పెడచెవిన పెడుతున్నది. ఇక్కడి బీజేపీ నాయకులకు తెలంగాణ పండుగల పట్ల విశ్వాసం లేకపోవడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలను ఒప్పించి నిధులు తీసుకురాలేకపోతున్నారు. ఏటా తెలంగాణలో జరిగే బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. బోనాలను కూడా ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్నది. ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తూ వస్తున్నది. కానీ, ఇది గమనించని బీజేపీ నాయకులు ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవాల్లో సైతం అగ్గిరాజేయాలని చూశారు. కానీ, ప్రభుత్వం పటిష్ఠమైన పోలీసు బందోబస్తుతో ఉత్సవాలను ఘనంగా ముగించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
హిందూ మతం, హిందువులు అంటే బీజేపీకే చెందినవారనే భావనలో బీజేపీ నేతలున్నారు. కానీ దేశంలో ఉన్న 85 శాతం మంది హిందువుల్లో సుమారు 50 శాతం మంది సర్వమతాలను ఆరాధించే వారున్నారని బీజేపీ నాయకులు గ్రహించకపోవడం సిగ్గుచేటు. అందరూ మతం ఆధారంగా రాజకీయాలు చేసేవారు కాదనే విషయాన్ని వారు గుర్తెరగాలి.
కులమతాలు వేరు, రాజకీయాలు వేరనే ఇంగిత జ్ఞానం వారికి లేకుండాపోయింది. ‘రామ లక్ష్మణ్ జిందాబాద్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని వల్లకాడుగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల కాడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు చెప్పులు మోస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు గులాంగిరిగా మారిన తెలంగాణ బీజేపీ గల్లీ నేతలు తెలంగాణ ప్రజల గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న కుటిల రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కులమతాల పేరిట కొట్లాటలు సృష్టిస్తే యావత్ తెలంగాణ సమాజం తిరగబడే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త.
(వ్యాసకర్త: పరిశోధక విద్యార్థి,
ఉస్మానియా యూనివర్సిటీ)
హిందూ మతం, హిందువులు అంటే బీజేపీకే చెందినవారనే భావనలో ఆ పార్టీ నేతలున్నారు. కానీ దేశంలో ఉన్న 85 శాతం మంది హిందువులే అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఆ 85 శాతం మందిలో సుమారుగా 50 శాతం మంది సర్వమతాలను ఆరాధించే వారున్నారని బీజేపీ నాయకులు గ్రహించకపోవడం సిగ్గుచేటు. అందరూ మతం ఆధారంగా రాజకీయాలు చేసేవారు కాదనే విషయాన్ని వారు గుర్తెరగాలి.
జి.రాజేష్ నాయక్:96035 79115