మానవుని శరీర భాగాలన్నింటిలో అతి ముఖ్యమైనవి కండ్లు. మనిషి ఏం చేయాలన్నా, చూడాలన్నా వాటిదే కీలక పాత్ర. ప్రస్తుతం మనరాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో 20- 25 శాతం మంది ప్రజలు కంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వ్యాధులన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ‘కంటి వెలుగు.’
ఈ పథకం ద్వారా ‘అంధత్వరహిత తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నాం. ‘నివారించదగు అంధత్వా న్ని’ కంటివెలుగు అనే పేరుతో రాష్ట్ర జనాభాకు వర్తింపజేసేలా కంటి స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపట్టింది. కంటివెలుగు తొలి విడత కార్యక్రమం 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు.
ఈ పథకం ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుల్లో చక్కని ఫలితాలు రావడం మనం కండ్లారా చూశాం. ఈ పథకం కింద రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహిస్తారు. వీలైనంత త్వరగా 45 రోజుల్లోపు ఉచితంగా కళ్లద్దాలు సమకూర్చుతారు. శస్త్ర చికిత్సలు, ఇతర నేత్ర చికిత్సలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. సాధారణ కంటివ్యాధులకు మందులను సమకూర్చుతుంది. ప్రమాదకరమైన కంటివ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇతర అనేక రకాలైన కంటి సమాచారాన్ని వైద్యులు ప్రజలకు వివరిస్తారు.
జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకా రం రాష్ట్రంలో కంటిశుక్లాలు వ్యాధిలో 43 శాతం, బాల్యంలో అంధత్వంతో 4 శాతం మంది బాధపడుతున్నారు. నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం, డయాబెటిక్ రెటీనోపతి 7 శాతం, చూపు మందగించడం 3 శాతం, నీటి కాసులు (గ్లకోమా)లతో 7 శాతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ నివేదికల్లో తేలింది. ఈ పథకంలో భాగంగా 2018లో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఒక లక్షా యాభైవేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం రికార్డుల్లోకెక్కింది. 2021 జూన్ వరకు కంటివెలుగు పథకం ద్వారా 38 లక్షల మంది లబ్ధి పొందారు.
ఈ పథకం ద్వారా ప్రతి 3 నుంచి 5 వేల మంది జనాభా ఉన్న గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డు పరిధిగా కంటి వెలుగు క్యాంపును నిర్వహిస్తారు. ఈ క్యాంప్లో మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యుడు, ఏఎన్ఎమ్, సూపర్వైజర్లు, ఆశాలతో 6-8 మందితో కూడిన బృందం సేవలందిస్తుంది. ఈ పథకంలో భాగంగా 800 బృందాల్లో 950 మంది మెడికల్ ఆఫీసర్లు, 15000 మంది కంటి వైద్య నిపుణులుంటారు. 35 వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. ఇటీవల ఈ పథకానికి 5000 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా ప్రత్యేకంగా నియమించారు. కంటివెలుగు తొలి విడతలో భాగంగా 107 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు 2వ విడతలో దానికి దాదాపు నాలుగింతలకు పైగా రూ.500 కోట్లను విడుదల చేసింది. ఈ 2వ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మక స్తంభాద్రిగా పిలువబడే ఖమ్మం మెట్టు (ఖమ్మం) జిల్లాలో నలుగురు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), పినరయి విజయన్ (కేరళ), భగవంత్ మాన్సింగ్ (పంజాబ్) కల్వకుంట్ల చంద్రశేఖరరావు (తెలంగాణ), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్లు 2023 జనవరి18న ప్రారంభించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకాన్ని నేత్ర వ్యాధులతో బాధపడుతున్న ప్రతి రోగిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటివెలుగు పథక ప్రేరణతో ఒడిషా ప్రభుత్వం ‘సునేత్ర’ అని, ఏపీలో ‘వైఎస్సార్ కంటివెలుగు’ వంటి పథకాలను అమలుచేయడం మన రాష్ర్టానికే గర్వకారణం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 150 మందికి ఒక ఇంచార్జీని నియమించుకొని, ఆధార్ నంబర్ ఆధారంగా జాబితాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వారిలో సమస్యలున్న వారిని గుర్తించి ఆపరేషన్ అవసరం ఉంటే ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని, వీలైనంత త్వరగా నేత్ర బాధితులకు కండ్లద్దాలు అందజేయాలని సూచించారు. ఈ పథకానికి రాబోయే కేంద్ర బడ్జెట్లోనిధులు కేటాయించాలి. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ద్వారా భారతదేశ ప్రజలందరికీ కేంద్రం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. ‘కంటివెలుగు’తో ఇంటింటా వెలుగులు నిండాలని కోరుకుందాం.
-పేరువాల నరేష్