‘పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇటు సామాజిక సంక్షేమం పట్ల, అటు ఆర్థికాభివృద్ధి పట్ల అనుసరిస్తున్న విధానాలు ఇకముందు కూడా కొనసాగుతాయని 2022-23 బడ్జెట్ ప్రజలకు చాటిచెప్పింది. 1980 దశకం నాటి నుంచి స్థూల ఆర్థిక వ్యవస్థ పేర సరికొత్త విధానాలు ముందుకు వచ్చాయి. ఆర్థికాభివృద్ధి వేగంలో సామాజిక అభివృద్ధి అనేది అట్టడుగున పడిపోయింది. ఈ పోకడలకు విరుద్ధంగా, ప్రజల సంక్షేమమే అంతిమలక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సామాజిక పరివర్తనం వైపుగా ప్రభుత్వ రథచక్రాలను తిప్పటంలో విజయం సాధించారు.
సామాజిక పరివర్తన పట్ల కేసీఆర్కు ఉన్న దృఢనిశ్చయాన్ని దళితబంధు పథకం మరోసారి వెల్లడించింది. అపూర్వమైన, అసాధారణమైన ఈ సామాజిక, ఆర్థిక ప్రయోగాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న తీరు ప్రశంసనీయం. బడ్జెట్లో రూ.17,700 కోట్లను కేటాయించటం ద్వారా దళితబంధు పథకానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నదో ప్రభుత్వం తెలియజేసింది. దేశవ్యాప్తంగా అట్టడుగువర్గాల అభ్యున్నతికి అనుసరించే కార్యక్రమాలు ఎలా ఉండాలనే విషయంలో ఈ వినూత్న పథకం ఒక నమూనాగా ఉంటుందనడంలో సందేహం లేదు. కులవృత్తుల నైపుణ్యాలను ప్రోత్సహించడం అనే కేసీఆర్ సిద్ధాంతం ఇప్పటికే సత్ఫలితాలనిస్తున్నది. గొర్రెల పంపిణీకి 11 వేల కోట్లు కేటాయించడమైనా, నేతన్నలకు బీమా ప్రకటించడమైనా, గీత కార్మికులకు 100 కోట్లు కేటాయించడమైనా ఈ వినూ త్న ప్రయోగంలో భాగమే. ఇక వ్యవసాయాభివృద్ధికి రూ.24, 254 కోట్లు కేటాయించి అదే ఒరవడిని కొనసాగిస్తున్నది రాష్ట్ర ప్రభు త్వం. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.750 కోట్లు కేటాయించడం కూడా సముచితంగానే ఉన్నది. అటవీప్రాంతం, నదీ సంగ మం, భగవత్ క్షేత్రంతోపాటు ప్రపంచస్థాయి జలాశయంతో కూడిన కాళేశ్వరం గొప్ప పర్యాటక, ఆధ్మాత్మికప్రాంతంగా వృద్ధి చెందడం ఖాయం. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ బడ్జెట్ ఒక సూచిక.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజాసంక్షేమమార్గం ఫలితాలను అందిస్తున్నదనడానికి సామాజిక, ఆర్థిక రంగాలలో వచ్చిన గుణాత్మక మార్పులే నిదర్శనం. గ్రామీణరంగంలో సంపద పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక అనిశ్చితి, సంక్షోభం మచ్చుకైనా కనిపించడం లేదు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు జాతీయ స్థాయిని మించిపోయాయి. తెలంగాణ సాధించిన అభివృద్ధిని గణాంకాలతోనైనా, క్షేత్రస్థాయి పరిశోధన ద్వారానైనా ఎవ్వరైనా తరచి చూడవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోగం జాతీయస్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే భావన అతిశయోక్తి కాదు.