గతాన్ని ఎప్పుడూ మననం చేసుకోవాలి. అది మధురమైనదా.. మనసులను కలచివేసేదా అనే తర్కంతో పనిలేకుండా తలుచుకుని తీరాలి. మనసులో ఎప్పుడో ఒకప్పుడు మననం చేసుకోవాలి. వర్తమాన గమనం ఏ వైపునకు సాగుతున్నదో తెలియాలన్నా.. భవిష్యత్ గమ్యం ఏమిటో బోధపడాలన్నా అది తప్పనిసరి. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడది అత్యావశ్యకం.
ఎందుకంటే ఓ సుదీర్ఘ పోరాటం అనంతరం స్వేచ్ఛను పొందిన ఒక ప్రాంతానికి, వెలసిన ప్రజా ప్రభుత్వానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది. అది ఎన్నింటికో ప్రేరణగా నిలుస్తుంది. ఇక ఉద్యమ నాయకుడే పాలకుడైన చోట ఎన్నో ఆశలుంటాయి. పాత విలువలకు పాతరేసి కొత్త విలువలతో కూడిన సమాజం నిర్మాణానికి బాటలు వేస్తాడనే.. రాతలు మారుస్తాడ నే నమ్మకం.. కన్నీళ్లను తుడిచి.. కష్టాలను తొలగిస్తాడనే విశ్వాసం ఆ ప్రజల నిండా బలంగా గూడుకట్టుకుని ఉంటుంది. సరిగ్గా అట్లాంటి ఎన్నో ఆశలు.. ఆశయాల నడు మ.. పొందిన స్వేచ్ఛ నిలుస్తుందా? కూలుతుందా? కన్న కలలు ఫలిస్తాయా? లేవా? లాంటి సందేహాలు.. మరెన్నో సందిగ్ధతల మధ్య తెలంగాణ పురుడుపోసుకుని ప్రయాణం మొదలుపెట్టింది.
మరి గడిచిన ఈ తొమ్మిదేండ్లలో ఏం చేసింది? గతానికి.. వర్తమానానికి నేడున్న పోలికేమిటి? సాధించిన గుణాత్మక, పరిణామాత్మక మార్పులేమిటి? ఆకాంక్షలు నెరవేరాయా? ఏ దిశగా సాగుతున్నది దాని ప్రస్థానం? అన్న అంశాలను తప్పక చర్చించుకోవాలి. తర్కించుకోవాలి. అది తెలంగాణ చారిత్రక అవసరం.
అస్తిత్వబావుటాను ఎగరేసిన రోజునే అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నది తెలంగాణ. ఆ ఉద్యమస్ఫూర్తినే ఈ తొమ్మిదేండ్ల ప్రస్థానంలో.. ప్రతి అంశంలోనూ చూపుతూ ముందుకు సాగుతున్నది. ఉద్యమకాలం నాటి సంకల్పాలను ప్రకల్పాలుగా మార్చుకునేందుకు అహరహం చేస్తున్న కృషి ఎనలేనిది. వలసాధిపత్యశక్తుల నిర్లక్ష్యంతో శిథిలమైన జీవనసౌధాన్ని మొక్కవోని చైతన్యస్ఫూర్తితో.. పేదలే కేంద్రబిందువుగా స్వాతంత్య్ర భారతావని ఎన్నడూ అమలుచేయని నమూనాతో పునర్నిర్మాణం ప్రారంభించి తెలంగాణ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నది. సంపదను పెంచుతూ.. సబ్బండ వర్గాలకు పంచుతూ సంక్షేమంలో, అభివృద్ధిలో, పాలనలో.. ఆలోచనలో.. ఆచరణలో.. ఒకటా రెం డా సమస్త రంగాల్లో.. వినూత్న పంథాలో.. విప్లవాత్మక నిర్ణయాలతో చరిత్రలో ఎవరూ చెరిపేయలేని ముద్రను వేస్తూ ముందుకుసాగుతున్నది.
మండుటెండల్లో తడలుగొడుతున్న చెరువులు.. ఒకనాడు ఎడారిగా మారిన వాగుల్లో ఏడాది పొడవునా జాలువారుతున్న ఊటలు.. నెర్రెలిడ్సిన నేలల్లో తలలూపుతున్న పచ్చని పొలాలు.. మూలమూలకూ విస్తరించిన రహదారులు.. పల్లెపల్లెకూ చేరిన పాలన.. మనిషి మనిషికీ దరిచేరుతున్న సంక్షేమ ఫలాలు.. ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలతో తండ్లాడిన నేలపై.. తెర్లయిన జీవితాలు తెల్లబడుతున్న జీవనరీతులే అందుకు సాక్ష్యాలు. ఎన్నో అపూర్వ విజయాలు.. వరిస్తున్న అవార్డులు.. విమర్శకులు సైతం కురిపించే ప్రశంసలు తెలంగాణ విజయాలకు నిదర్శనాలు. ప్రభుత్వముందో లేదో తెలియని పరిస్థితుల నుంచి ప్రభుత్వమంటే తమదే అనే స్థాయికి ప్రజలను చేర్చడమే తెలంగాణ సాధించిన మరో అపూర్వ విజయం. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడంలోనూ ఉద్యమస్ఫూర్తిని చాటుతున్నది. గతానికి, వర్తమానానికి ఒక స్పష్టమైన విభజనరేఖను తెలంగాణ కళ్లముందు నిలిపిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంశయాలు లేవు. తెలంగాణ గెలిచి నిలబడడమే కాదు ఇప్పుడు దేశానికే టార్చ్బేరర్గా నిలుస్తున్నది. యావత్ భారత పాలకులకు అభివృద్ధి విషయంలో కొత్త సవాలును విసురుతున్నది. ఉన్నతాశయాలతో, ఉదాత్త లక్ష్యాలతో మహనీయులు, స్వాతంత్య్రయోధులు మనకందించిన రాజ్యాంగ సంవిధానం విశిష్టత మసకబారిపోతున్న వేళ.. రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకు ఇప్పటికీ ఆమడదూరంలో నిలిచిపోయిన తరుణంలో భారతావనికి తెలంగాణ కొత్త ప్రేరణగా మారుతున్నది. దశాబ్దాలుగా ప్రజల జీవన విధానాన్ని మనోభావాలను, ఆకాంక్షలను గౌరవించకుండా కేవలం వారిని ఓటర్లుగా మార్చేసి ప్రతీ ఐదేళ్లకొకసారి అధికార మార్పిడి కోసం కుట్రలు, కుతంత్రాలతో దశ దిశ లేని రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రత్యామ్నాయమై తెలంగాణ ఎదుగుతున్నది. సమర్థవంతమైన రాజకీయాలకు.. అసమర్థపాలనకు బేధమేమిటో పట్టిచూపే అద్దమై మెరుస్తున్నది.
దేశంలో ఎంతోమందికి ఇప్పటికీ తాగునీరు కూడా తీరని కోరికగా మిగిలిపోవడానికి, ఇప్పటికీ నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సదుపాయం అందడమే అసాధ్యమవడానికి.. ఉన్న వనరులను అవసరాలకు సంధానించే ధ్యాసకాని, సమన్వయం చేసే చేతగాని దశాబ్దాల ప్రభుత్వాల వైఫల్యమే కారణం. కాలంచెల్లిన భావాలను, అభివృద్ధి విధానాలను పట్టుకుని వేలాడుతున్న భారత పాలకులకు భారతావని గాలివాటు గమనాన్ని నేడు తెలంగాణ నిలదీస్తున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రగతి పరివ్యాప్తమవుతున్నది. దేశం యావత్ తెలంగాణ మాడల్ను గీటురాయిగా నిలుపుకొంటున్నది. తెలంగాణ తరహా సంక్షేమాన్ని కలగంటున్నది. ఆవాహన చేసుకుంటున్నది. స్ఫూర్తి పొందుతున్నది. ఆ పథకాలనే డిమాండ్లుగా ముందుకుతోస్తున్నది. ప్రగతితో మమేకమవుతున్నది. మెరమెచ్చు మాటలు.. సానుభూతి వచనాలు.. ఆచరణకు రాని వాగ్దానాలే తప్ప సంప్రదాయ పార్టీలతో వీసమెత్తు మేలు ఒరిగేదేమీలేదనే సత్యాన్ని గ్రహించిన దేశం ఇప్పుడు ఢిల్లీ వైపు చూడటం మానుకొని తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది.
తెలంగాణ సాధించిన ఈ అపూర్వ విజయాలన్నింటికీ.. ఆర్జిస్తున్న ప్రగతి ఖ్యాతి అంతటికీ ఆద్యులు, కారణభూతులు, ఉద్యమసారథి ముఖ్యమంత్రి కేసీఆరే. సమర్థవంతమైన, ప్రణాళికాబద్ధమైన.. లక్ష్యానికి అనుగుణమైన అకుంఠిత దీక్ష.. పాలనాదక్షతే కారణం. వ్యవస్థలోని లోపాలను గుర్తించి, అధ్యయనం చేసి, అవసరాలకు అనుగుణంగా మార్పులను ప్రతిపాదిస్తూ, సంస్కరణలను ప్రవేశపెడుతూ మొత్తం సమాజంలో పరిణామాన్ని తెచ్చేవాడే నాయకుడు, నిజమైన సారథుడు. అలాంటి ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్ కేసీఆర్. ఊహ తెలిసిన నాటినుంచి గడిచిన ఏండ్లుగా నేను చూసిన, చూస్తున్న రాజకీయాలకు, రాజకీయ నేతలకు పూర్తి విరుద్ధం. ప్రజా సమస్యలను ఆయన చూసే దృక్కోణం, వాటికి పరిష్కార మార్గాలను చూపడం, అనుసరించే విధానాలు, అమలు చేసే వ్యూహాలు పూర్తి విభిన్నం. పదేండ్ల పసిప్రాయంలోనే తెలంగాణను తీర్చిదిద్దిన తీరు అమోఘం. అద్వితీయం. అనితరసాధ్యం. తెలంగాణకు దక్కిన గొప్పవరం కేసీఆర్ నాయకత్వం. ఇప్పుడు నవభారత నిర్మాణానికి కేసీఆరే నడుం కట్టడం శుభపరిణామం.
-మ్యాకం రవికుమార్
94929 10065