చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అవుతున్న దృశ్యంపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ఒక మనిషిని రక్షించాలన్నా, శిక్షించాలన్నా చట్టమే కావాలి. చట్టం స్థానంలో ఇంకొకరు చర్యలు తీసుకుంటే అది వైపరీత్యమే. ప్రభుత్వమైనా, పౌరులైనా ఇదే వర్తిస్తుంది. కానీ బీజేపీ నేతృత్వంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తామే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులని ముద్రవేసిన వ్యక్తులకు చెందిన ఇండ్లు, దుకాణాలపైకి బుల్డోజర్లు నడిపిస్తున్నారు. ఆస్తులను నేలమట్టం చేసి ఆయా కుటుంబాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. దీనికి వారు సత్వర న్యాయం అని పేరుపెట్టుకున్నారు. ఏతావాతా దీనికే బుల్డోజర్ న్యాయం అనే పేరు స్థిరపడింది.
అసలు ఇలాంటి న్యాయం ఒకటి ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. నేరస్థులను శిక్షించడాన్ని ఎవరూ కాదనరు. అది చట్టబద్ధమైన రీతిలో జరిగితేనే న్యాయం చేసినట్టుగా భావిస్తారు. చట్టం ముందు దోషిగా తేలితేనే శిక్షలు పడతాయనేది తెలిసిన విషయమే. కానీ బీజేపీ ప్రభుత్వాలు ఉరుకులు పరుగుల మీద బుల్డోజర్లను పంపిస్తూ ఇదే న్యాయమని దబాయిస్తున్నాయి. ఇండ్లల్లో ఉండే సామాను బయటికి తీసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదంటున్నారు. నోరు మూసుకోకపోతే ఈడీ మీ ఇంటికి వస్తుందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ విపక్షాలను పార్లమెంటులోనే బెదిరించడం తెలిసిందే. అదే తరహాలో కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందని హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొదలైన ఈ ధోరణి మధ్యప్రదేశ్, అసోంలకు వ్యాపించింది. కోర్టులు వారించినప్పుడు కొంత తగ్గుతున్నారు. తర్వాత షరామామూలే అన్నట్టుగా పోతున్నారు. తాజాగా ఈ ధోరణి హర్యానాలో మొదలైంది. నూహ్ మతఘర్షణల్లో పాల్గొన్నారనే నెపంతో అక్కడి అధికారులు ‘సత్వర న్యాయం’ రుచి చూపించారు. 500కు పైగా రేకుల ఇండ్లు, పక్కా ఇండ్లు కూల్చివేశారు. పంజాబ్-హర్యానా హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత బుల్డోజర్లకు బ్రేక్ పడింది. బుల్డోజర్ న్యాయం నూటికి నూరుపాళ్లూ చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం.
అందరినీ శిక్షిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఒకవర్గం వారిని లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్లు బయల్దేరుతున్నాయని విమర్శలున్నాయి. ఈ కూల్చివేతలపై అధికారుల వాదనల మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ఒకరంటే.. మనుషులు లోపల నుంచి రాళ్లు రువ్విన ఇండ్లను ధ్వంసం చేస్తున్నామని మరొకరు అంటున్నారు. ఇందులో ఏది నిజం? నోటీసులు, ఉత్తర్వులు చూపేవారేరి? కూల్చిన ఇండ్లల్లో ఉండే చిన్నపిల్లలు, వయోవృద్ధుల గతి ఏమిటి? ఎవరికి తోచిన న్యాయం వారు చేయడమనేది మధ్యయుగాల్లో జరిగిన అరాచకం.