ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధిపతిగా ఎస్కే మిశ్రా తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఆయన పదవీకాలం పొడిగింపును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మూడోసారి ఇచ్చిన ఏడాది పొడిగింపులో మరో 4 నెలల గడువు ఉండగానే మిశ్రా అవమానకరమైన రీతిలో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మోదీ సర్కారు విపక్షాలను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలువడిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సర్కారు తీరును తప్పుబట్టింది. ఈడీతో పాటుగా సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపుపై కేంద్రం ఇటీవల కొన్ని సవరణలు తెచ్చింది. ఇంతకుముందు ఈ రెండు సంస్థల డైరెక్టర్ల పదవీకాలం రెండేండ్లకు పరిమితమై ఉండేది. దాన్ని ఒక్కొక్క ఏడాది చొప్పున మూడుసార్లు పొడిగించవచ్చని కేంద్రం సవరణలు తెచ్చింది. ఇది రాజకీయ జోక్యానికి తెరలేపడమేనని విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటే పొడిగింపు తాయిలం దక్కుతుందనే ప్రలోభం దీనివెనుక ఉందని అంటున్నారు.
మిశ్రాకు పొడిగింపు ఇవ్వవద్దని సుప్రీంకోర్టు 2021లోనే చెప్పింది. అయినప్పటికీ అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం కేంద్ర విజిలెన్స్ కమిషన్ చట్టానికి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణలు తెచ్చింది. వీటి ఆధారంగానే మిశ్రా పదవీకాలం పొడిగించింది. తన ఆదేశాలను పక్కనపెట్టేందుకు జరిపిన కసరత్తును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సర్కారు తెచ్చిన సవరణల్లో లోపాలు లేనప్పటికీ మిశ్రా పొడిగింపు కోసం వాటిని ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్రం ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని విమర్శించింది. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర దర్యాప్తుసంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకమైంది. ముఖ్యంగా ఈడీ పాత్ర! అయితే మోడీ కాకపోతే ఈడీ అని జనం చెప్పుకొనే పరిస్థితి వచ్చింది.
ద్రవ్య చట్టాలను కచ్చితంగా అమలుచేయడంలో ఈడీ పాత్ర కీలకం. కానీ ఈ సంస్థ బీజేపీకి గిట్టని విపక్షాలను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులే ఎక్కువ. వాటిలో కంచికి చేరేవి బహు తక్కువ. దీంతో సంస్థ విశ్వసనీయతే ప్రశ్నార్థకం అవుతున్నది. ‘ఈడీ డైరెక్టర్ ఎవరనేది నిమిత్తమాత్రమైన విషయం’గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం దేనికి సంకేతం? అంటే అదొక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, దాని అధిపతిగా ఎవరున్నా దాని పనితీరు మారదన్న అర్థంలో ఆయన ఆ మాటలు అని ఉండవచ్చు. కానీ ‘నడిపేది మేమే, అక్కడ కుర్చీలో ఎవరుంటే ఏమిటి?’ అనే ధ్వని కూడా అందులో లేకపోలేదు. ఎస్కే మిశ్రా అనే వ్యక్తి అంత ముఖ్యం కానప్పుడు సుప్రీంకోర్టును కాదని ఆయన పదవీకాలాన్ని ఎందుకు పొడిగించనట్టు? అని విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. అయితే ఈ తరహా దుర్వినియోగం కాంగ్రెస్ హయాంలోనే పురుడుపోసుకొని వెర్రితలలు వేసింది. తాము చెప్పినట్టల్లా ఆడే అధికారులను ముందు పెట్టుకొని తతంగం నడిపించడం ఆనవాయితీగా మారింది. మోదీ పాలనలో అది అడ్డూ అదుపు లేకుండా నిస్సిగ్గుగా జరుగుతున్నది.