‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లున్నది కేంద్రం తీరు. ప్రజల వెతలు తీర్చే ప్రణాళికలు తన వద్ద ఉండవు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యతను పట్టించుకోదు. ఆ పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్రం అసంబద్ధ ఆరోపణలు చేస్తుంది. బడుగు బలహీన సహోదరులను ఆదుకునే సంక్షేమ పథకాలను ఉచితాలంటూ మోదీ గత జూలైలో ఎద్దేవా చేయటమేగాక, దేశంలో కొన్ని ప్రభుత్వాలు ఈ ఉచితాలను ఓట్లు సంపాదించుకునే మార్గంగా చేసుకున్నాయని ఆరోపించారు. ఈ విధంగా ప్రధాని ప్రారంభించిన చర్చ దేశంలో రోజురోజుకీ జోరందుకుంటున్నది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ నడుస్తున్నది. తాజాగా ఎన్నికల సంఘం కూడా ఉచిత పథకాల హామీలిచ్చే ముందు వాటికి అవసరమైన ఆర్థిక వనరుల వివరాలు చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు తాఖీదు జారీ చేసింది.
ఇంతకూ ఏది ఉచితం? ఏది అనుచితం? అనేది ప్రాథమిక ప్రశ్న. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు చేయటం, పన్ను రాయితీలు ఇవ్వటం ఉచితమా? అనుచితమా? అద్భుతమైన పనితీరుతో దశాబ్దాలుగా దేశ ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ సంస్థలను తమకు కావాల్సిన కుబేరులకు అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేయటం ఉచితమా? అనుచితమా? ప్రభుత్వ బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ అధిపతులను పట్టుకొచ్చి, న్యాయస్థానాల ముందు నిలబెట్టలేని కేంద్ర ప్రభుత్వ అసమర్థత ఉచితమా? అనుచితమా? దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థలను కుంగదీస్తున్న వీటి గురించి కేంద్ర పాలకులకు సోయి ఉందా? ఉన్నా.. వారి కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయా?
దేశంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడం ప్రభుత్వాల విధి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత విస్తృతంగా ఉనికిలోకి వచ్చిన సంక్షేమరాజ్య భావన ఆర్థిక అంతరాలను పూడ్చటానికి ఉద్దేశించినదే. అందుకే నిరుపేదలకు ఆహారం, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించటాన్ని ప్రభుత్వాలు తమ బాధ్యతగా స్వీకరించాయి. మన రాజ్యాంగం కూడా దీనిని నొక్కివక్కాణించింది. 2014లో మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని వాగ్దానాలు చేశారు. కానీ, అవి ఏవీ సాకారం కాలేదు. దీంతో చెప్పుకోవటానికేమీ లేక, మతపరమైన భావోద్వేగాలతో రాజకీయాలు చేయటమే ఏకైక మార్గమని బీజేపీ భావిస్తున్నట్లున్నది. అందుకే తనకు వివిధ రాష్ర్టాల్లో గట్టి పోటీనిస్తున్న విపక్షాలను ఆత్మరక్షణలో పడేయటానికి ఉచితాలు వద్దన్న ప్రచారానికి తెర లేపింది. ఇది మానవీయ విలువలకు, రాజ్యాంగ ప్రవచిత సంక్షేమ భావనకు వ్యతిరేకమైన ప్రచారం. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.