నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్టింది. ప్రమాదాల పరంగా మనదేశం మూడోస్థానంలో నిలువగా, మరణాల్లో తొలిస్థానంలో ఉంది. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 69.8 శాతం మంది 18 ఏండ్ల నుంచి 45 ఏండ్లలోపు వాళ్లే. ఏటా దాదాపు లక్షన్నర మంది రోడ్లపై బలి అవుతున్నారు. యుద్ధాల్లో కూడా ఈ స్థాయి ప్రాణనష్టం ఉండదు. దీనివల్ల అనేక కుటుంబాలు వీధిన పడటమేగాక దేశ ఆర్థికవ్యవస్థకు కూడా తీవ్రనష్టం వాటిల్లుతున్నది. భారత్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా.. దేశ జీడీపీకి రూ.ఏడు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో మనదేశంలో ఉన్నవి ఒక్క శాతమే. కానీ, ప్రమాదాల్లో ఆరుశాతం మన వద్ద నమోదవుతున్నాయి. మరణాలు చూస్తేనైతే ఇంకా ఘోరమైన పరిస్థితి. దాదాపు 11 శాతం మరణాలు భారత్లోనే సంభవిస్తున్నాయి. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న మేరకు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ, ప్రమాదాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్లో మాత్రం ఏటా రహదారులపై అసువులు బాస్తున్న అభాగ్యుల సంఖ్య పెరుగుతున్నదేగానీ తగ్గటం లేదు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపటం, నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వెళ్లటం, హెల్మెట్, సీట్బెల్ట్ వంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వంటివి వ్యక్తుల స్థాయిలో జరుగుతున్న పొరపాట్లు. రోడ్లను సురక్షితంగా మలిచే ప్రణాళికలను అమలుపరచటంలో దశాబ్దాలుగా కేంద్ర పాలకులు చూపుతున్న నిర్లక్ష్యం వ్యవస్థాపరమైన లోపం.
యాంత్రిక వాహనాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై దాదాపు ఐదు కోట్ల మంది మరణించినట్లు అంచనా. ఇది మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన వారికన్నా ఎక్కువ. మానవజాతికి కలుగుతున్న ఈ అపార నష్టాన్ని నివారించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2021-30ని ‘రహదారి భద్రత కార్యాచరణ దశాబ్దం’గా గుర్తించింది. ఈ పదేండ్లలో ప్రమాద మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కనీసం సగానికి తగ్గించాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఏటా 13 లక్షల మంది మరణిస్తుండగా, ఐదు కోట్ల మంది గాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటలో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తే చాలా మంది బతుకుతారు. అందువల్ల రహదారుల సమీపంలో తగిన రీతిలో దవాఖానల నిర్మాణం జరగాలి. భారత్ ప్రబల ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో రవాణారంగం కీలకమైనదిగా మారుతుంది. ఇప్పటికైనా రహదారుల భద్రతపై కేంద్రం మరింత శ్రద్ధ కనబరచాలి.