అప్పట్లో ఓ సైనికాధికారి ఉండేవాడు. సైనికులు ఖాళీగా ఉండటం ఆ అధికారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఇద్దరు సైనికులు ముచ్చటించుకోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు. తెలుగువారైన ఆ ఇద్దరు సైనికులు తెలివిగా ‘వీ ఆర్ డూయింగ్ బాతాఖానీ’ అని గంభీరంగా బదులిచ్చారు. బాతాఖానీ కూడా ఓ పనేనని అనుకున్న ఆ అధికారి.. ‘వెరీ గుడ్. ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి’ అని వారిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును చూస్తుంటే ఎప్పుడో చదివిన ఈ విషయం గుర్తుకువచ్చింది. ఆ సైనికుల బాతాఖానీ పనికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనికి సరిగ్గా సరిపోయింది.
మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఏమైనా మార్పు తీసుకొచ్చారా? ప్రజల జీవితాలను మార్చారా? ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన అతిపెద్ద మౌలిక మార్పు ఏదైనా ఉందంటే.. టీఎస్కు బదులు టీజీ అని మార్చడమే. దీన్నే ఘన విజయంగా ఆ పార్టీ నాయకులు చెప్పుకొంటున్నారు. ఇలా ఒక అక్షరాన్ని మార్చడం వల్ల ఎంత మందికి ఉపాధి లభించింది? రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగింది?
ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ ఉద్దేశంతో పెద్దన్న అని సంబోధించారో తెలియదు గానీ ఇలా పేర్లు మార్చడం, చిహ్నాలను తొలగించడంలో మాత్రం రేవంత్రెడ్డి తన పెద్దన్నను అనుసరిస్తున్నారు. కాకతీయ తోరణం, చార్మినార్లో రేవంత్రెడ్డికి రాచరిక చిహ్నాలు కనిపిస్తున్నాయట. అందుకే రాష్ట్ర చిహ్నంలో ఇకపై రాచరిక గుర్తులేవీ ఉండవని ఆయన ప్రకటించారు. రాచరిక చిహ్నాలను తొలగిస్తున్నట్టు చెప్తూనే ఆ చిహ్నాల ప్రస్తావన ఉన్న అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విడ్డూరం. అయితే ఐదేండ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వాలూ మారుతుంటాయి. ఇలా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి చిహ్నాలు మారుస్తారా?
వందల ఏండ్ల పాటు ముస్లిం పాలకులు మన దేశాన్ని పాలించారు. దేశ రాజధానిలోని రోడ్లకు వారి పేర్లు ఉండటం సహజం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రాజుల పేర్లతో ఉన్న రోడ్లకు కొత్త పేర్లు పెట్టింది. దీని ద్వారా బీజేపీ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించింది. ఆ మేరకు బీజేపీ వ్యూహం ఫలించింది కూడా. ముస్లిం ఓట్లపై ఆ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. హిందుత్వ పేరుతో హిందూ ఓటర్లు ఏకం కావాలనేది బీజేపీ లక్ష్యం. పేర్ల మార్పు కూడా అందులో భాగమే. అయితే పేర్ల మార్పు ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? కేసీఆర్ పేరు ఉండవద్దని కాంగ్రెస్ కోరుకుంటున్నదా?
నిజానికి వీటిని కాంగ్రెస్ నిర్ణయాలని అనడం కన్నా రేవంత్రెడ్డి నిర్ణయాలని అనడం సబబు. అధిష్ఠానం వద్ద రేవంత్రెడ్డికి పలుకుబడి ఉండటం వల్ల మంత్రులు, ఆ పార్టీ నాయకులు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించలేరు, వ్యతిరేకించలేరు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ఎసరు పెడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాజ్యాంగాన్నే మార్చాలని అనుకున్నప్పుడు జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని మార్చకుండా ఉంటారా? జాతీయ పతాకం కాంగ్రెస్ జెండాను పోలి ఉంటుంది. దాన్ని మార్చాలనే డిమాండ్ గతంలో చాలాసార్లు వినిపించింది. బ్రిటిష్ రాజరికాన్ని పొగుడుతూ రవీంద్రనాథ్ రాసిన స్వాగత గీతమే జాతీయ గీతం అనే విమర్శ చాలాకాలం నుంచి ఉన్నదే. ఒకవేళ బీజేపీ గద్దెనెక్కి వీటిని మారిస్తే.. హస్తం పార్టీ నాయకత్వం వాటిని స్వాగతిస్తుందా? లేదా వ్యతిరేకిస్తుందా?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న నెహ్రూ-గాంధీ వారసులు తెలంగాణ చిహ్నాల మార్పును స్వాగతిస్తే.. భవిష్యత్తులో బీజేపీ చేయబోయే మార్పులపై మాట్లాడే నైతిక అర్హతను వారు కోల్పోతారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదు. వాటన్నింటిని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేవు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ పేర్ల మార్పు నాటకం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే దాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
‘ఒక్క సంవత్సరం మేం అవినీతి చేయకుండా, కడుపు కట్టుకుంటే 40 వేల కోట్ల రూపాయలతో రైతుల రుణమాఫీ చేయవచ్చు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో చెప్పారు. నిధుల సమీకరణ, రుణమాఫీ అమలుపై ముఖ్యమంత్రి ఆలోచనలు ఇవి. ఓ డజను యూట్యూబ్ చానల్లు పెట్టి ఏమైనా ప్రచారం చేయవచ్చు. నోరుంది కదా అని బూతులూ తిట్టవచ్చు. కానీ, పని చేయడం తిట్టినంత సులువు కాదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి ఇప్పుడు తప్పించుకోవచ్చు. కానీ, జూన్ 4న తర్వాత హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.
ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నా అందుకు అనుకూల పరిస్థితులు లేవు. భూముల విలువను పెంచినా ఆశించిన ఫలితం వస్తుందని చెప్పలేం. హైదరాబాద్ నగరం మినహా శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు ఇప్పటికే పడిపోయాయి. ఇప్పుడు భూముల విలువను పెంచితే లాభం జరగకపోగా.. నష్టం చేకూరుతుంది. అమ్మకాలు, కొనుగోళ్లు మందగిస్తాయి. తద్వారా రిజిస్ట్రేషన్లు పడిపోయి, ఆదాయం తగ్గిపోతుంది. మద్యం ఆదాయంపై దృష్టి సారించినా.. ఇచ్చిన హామీలకు, మద్యం ద్వారా అదనంగా వచ్చే ఆదాయానికి ఎక్కడా పొంతన లేదు.
ఈ హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి తెరపైకి తెచ్చిన పేర్ల మార్పిడి జిమ్మిక్కు రాజకీయాలు ఎంతోకాలం పని చేయవు. తిట్లు ఉపయోగపడవు. మతం పేరుతో బీజేపీ చేసినట్టుగా పేర్ల మార్పుతో ఆ స్థాయిలో రాజకీయం చేయడం కుదరదు.
మరో విషయం ఏమిటంటే.. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాష్ట్ర చిహ్నానికి తుది రూపు ఇచ్చారని వినికిడి. రాష్ట్ర చిహ్నంలో రాచరిక చిహ్నాలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్న జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఓ రాచరిక చరిత్ర ఉంది. 1935 మే 6న బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ 25 ఏండ్ల పాటు బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి చక్రవర్తిగా రికార్డు సృష్టించిన సందర్భంగా ఆ దేశంతో పాటు భారత్లోనూ పెద్దఎత్తున జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ ప్రాంతానికి జూబ్లీహిల్స్ అని పేరు పెట్టారు. అంతేకాదు, అసెంబ్లీ భవనం నిజాం కాలంలో నిర్మించినదే. కాకతీయ తోరణాన్ని చిహ్నం నుంచి తొలగిస్తానని చెప్తున్న రేవంత్రెడ్డి.. కాకతీయులు తవ్వించిన చెరువులను పూడ్చేస్తానని అననందుకు మనం సంతోషించాలి. కేంద్రంలో, రాష్ర్టాల్లో కొలువయ్యే ప్రభుత్వాలు రామరాజ్యాన్ని తీసుకువస్తామని అంటుంటాయి. శ్రీరాముడు రాజే కదా అని రామరాజ్యాన్ని రాచరిక చిహ్నమని అంటామా? కాకతీయులైనా, నిజాంలైనా మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి.
మానవ జాతి పుట్టగానే ప్రజాస్వామ్యం పురుడుపోసుకోలేదు. వేల ఏండ్ల తర్వాత రాజ్యం అనేది ఏర్పడింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే ప్రజాస్వామ్యమనే భావన వచ్చింది. ప్రజాస్వామ్యం వయసు 75 ఏండ్లయితే మానవ చరిత్ర వేల సంవత్సరాలది. రాచరికం పేరుతో వేల ఏండ్ల చరిత్రను తుడిచేయడం సబబేనా?
పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో కుల సమావేశాల్లో పాల్గొన్న రేవంత్రెడ్డి ‘పాలించే హక్కు మనదే’ అని బహిరంగంగా చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి సచివాలయానికి వెళ్లిన రేవంత్రెడ్డి.. ‘ఆ కుర్చీ మా కులానిది, కేసీఆర్ను కూర్చోనివ్వం’ అని మీడియా ముందే అన్నారు. కులం ఆధారంగా రాజ్యాధికారం ఉండాలనుకునే ఆయన స్వభావం రాచరికానికి చిహ్నం కాదా? అసలు తొలగించాల్సింది చెరువులు తవ్వించిన కాకతీయ రాజుల చిహ్నాలను కాదు, మెదడులో గూడుకట్టుకున్న ఫ్యూడల్ ఆలోచనలను.
– బుద్దా మురళి