కోల్ ఇండియా, సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు ‘కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్’ ద్వారా పింఛను లభిస్తున్నది. ఈ పథకం సమీక్ష, పెన్షన్ సవరణ కోసం పింఛనుదారులు 9 డిసెంబర్ 2019న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు దీక్ష, 25-28 జూలై 2022 మధ్య రిలే నిరాహార దీక్ష చేసారు. కొన్ని సంస్కరణలు ప్రారంభమైనప్పటికీ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది. దీనివల్ల పెన్షన్ రివిజన్ ఫలితాలు అందుకోకుండానే అనేక మంది బొగ్గు పింఛనుదారులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి జంతర్మంతర్ వద్ద ధర్నా విజయవంతంగా జరిగింది.
దేశంలో వెలుగులు నింపేందుకు ఎంతో శ్రమ కోర్చి బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికులు, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆధీనంలోని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనిని నిర్వహిస్తున్నది. 31 మార్చి 1994 తరువాత పదవీ విరమణ చేసిన సుమారు ఆరు లక్షల మంది బొగ్గు ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వీరిలో సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పొందిన దాదాపు 80,000 మంది ఫించనుదారులు/వితంతువులు ఉన్నారు. వారికి నెలవారీ పెన్షన్గా రూ.500 నుంచి రూ.1000లోపు లభిస్తున్నది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంతగా ఆసరా పెన్షన్ రూ.2,016 ఇస్తున్నారు. దీనితో పోల్చితే బొగ్గు గని కార్మికులకు లభిస్తున్న పింఛను నాలుగు రెట్లు తక్కువ. నేటి ధరల పెరుగుదలలో, ఈ నామమాత్రపు పింఛను దేనికీ సరిపోదు. పింఛనును పెంచాలని పింఛనుదారులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా.. మోదీ ప్రభుత్వంలోని బొగ్గుశాఖ పట్టించుకోవటం లేదు. పైగా ఏకపక్షంగా వ్యవరిస్తున్నది. అవినీతి లేని పాలన అని చెప్పుకొనే కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న కోల్మైన్స్ పెన్షన్ ఫండ్ దుర్వినియోగం జరిగింది. గతంలో దినేష్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో పెట్టిన రూ.1200 కోట్ల దుర్వినియోగం వలన ఫండ్ క్షీణించింది. కోల్మైన్స్ పెన్షన్ పథకం-1998 పునర్నిర్మాణం, పింఛను పెంపుదలకు కేంద్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నది. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.24,000 కోట్లు సమీకరించింది. కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో వాటాను కూడా విక్రయించటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. దీనిద్వారా రూ.16,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు సమీకరించవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలి.
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ -హైదరాబాద్)
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752