గత సంవత్సరంన్నర పైబడిన కాలంగా దేశంలో ధరలు నింగినంటుతున్నాయి. ఈ జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిలో 7.44 శాతంగా ఉన్నది. అందులోనూ, ఆహార ద్రవ్యోల్బణ శాతం 11.51 శాతంగా ఉన్నది. ఇది 2020 అక్టోబర్ నాటి తర్వాతి అత్యధిక స్థాయి. ఈ ద్రవ్యోల్బణ స్థితికి కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అని ఒకానొక దశలో చెప్పుకొన్నాం. ఆ యుద్ధక్రమంలో-రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే ఎరువులు, ముడిచమురు, గోధుమలు, వంటనూనెల వంటి వాటి అంతర్జాతీయ రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా పలురకాల ఆహార ఉత్పత్తుల ధరలతో పాటు చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి.
పాశ్చాత్య దేశాలు తమ చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలను అధిగమించే క్రమంలో రష్యా భారతదేశానికి భారీ డిస్కౌంట్లతో చమురును అందించింది. కానీ, తక్కువ ధరకే దిగుమతి అయిన ఈ చమురు తాలూకు లబ్ధి, భారత ప్రజలకు కాస్తంత చౌకైన పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో లభించలేదు. ఇక, బియ్యం, గోధుమల వంటి అనేక ఇతర నిత్యావసరాల విషయంలో మనకు కావలసిన దానికంటే అధిక స్థాయిలోనే, మన దేశంలో ఉత్పత్తి జరుగుతున్నది. కానీ, ఇక్కడే మన ప్రభుత్వం ఆలోచనారహితంగా వ్యవహరించింది. అంతర్జాతీయ మార్కెట్లో, రష్యా-ఉక్రెయిన్ల నుంచి ఆగిపోయిన గోధుమల ఎగుమతుల తాలూకు లోటును భర్తీచేసే ప్రయత్నాన్ని మన దేశం శృతిమించి చేసింది. ఫలితంగా దేశీయంగా గోధుమల కొరత ఏర్పడే స్థితి వచ్చింది. అయితే ఈ సంవత్సరంన్నర కాలంలో గోధుమల ధర భారీగా పెరిగిపోయింది.
మరోపక్కన ఒకానొక దశ వరకూ దేశంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నట్టుగానే కనిపించినా కేంద్రం తాలూకు అనాలోచిత నిర్ణయాలు పరిస్థితిని పూర్తిగా ప్రతికూలంగా మార్చేశాయి. గత మూడేండ్లుగా పెరిగిపోతూ వచ్చిన బాస్మతియేతర బియ్యం ఎగుమతుల వల్ల, వాటి ధరలు కూడా నేడు దేశంలో పెరిగిపోయాయి. ఫలితంగా బాస్మతియేతర ఎగుమతుల పైన నిషేధం, దానితోపాటు పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికీ భారత్ నుంచి ఎగుమతయ్యే ఈ బియ్యం రకం ధర చౌక కావడంతో దేశంలో గోధుమలతో పాటు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ విధాన లోపం వల్ల నేడు భారత ప్రజలకు తిండిగింజలు దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. దేశ ప్రజల మొత్తం వినియోగంలో సగ భాగం పైగా వెయిటేజీ ఆహారానిదే అనే విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. భారీ ఎక్సైజ్ పన్నులు, పెట్రో ధరలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అధిక డీజిల్ ధర వ్యవసాయం పెట్టుబడిని మరింత ఎక్కువ చేస్తున్నది. ఈ భారం అంతిమంగా వినియోగదారుడిపై పడుతుంది. అదీ విషయం!
ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకొనే ప్రయత్నంలో భాగంగా ఆహార పదార్థాలపైనా జీఎస్టీని విధించడం వల్ల వాటి ధరలు పెరిగాయి. గత 2, 3 దశాబ్దాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థను మెల్లమెల్లగా దెబ్బతీశారు. ఫలితంగా ప్రజలు బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిర్ణయించిన రేట్లకే సరకులను కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. దీనికితోడుగా, కనీస నిల్వల పరిమితిపై గతం నుంచి ఉంచిన నియంత్రణలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఫలితంగా, వ్యాపారస్థులు పలురకాల సరుకులను ఇష్టానుసారం నిల్వ చేసుకొనే అవకాశం లభించింది. దాంతో, మార్కెట్లో కృత్రిమ కొరతలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగానే నేడు ప్రభుత్వం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో, పలురకాల సరుకుల నిల్వలపై పరిమితులను విధిస్తూ ఆంక్షలు పెట్టాల్సి వస్తున్నది. పైగా, సుమారుగా గత 18 నెలల నుంచి పడిపోతున్న గ్రామీణ కూలీల నిజవేతనాల నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల తాలూకు భారం మూలిగే నక్కపై తాటికాయలా ఉండగలదన్నది నిజం. మరోపక్క, గ్రామీణ పేద ప్రజానీకానికి కాస్తో కూస్తో ఉపశమనాన్ని ఇచ్చిన-గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రకరకాల షరతులతో నిర్వీర్యం చేస్తున్నది.
ధరల పెరుగుదలకు కారణమవుతున్న పైన పేర్కొన్న విధానాలతో పాటుగా, భారత ఆహార సంస్థ పంటలు చేతికి వచ్చే సీజన్లలో, ధాన్యం సేకరణను తగ్గిస్తూ రావడం కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నది. ఉదాహరణకు 2023 ఆగస్టు 1 నాటికి భారత ఆహార సంస్థ గోడౌన్లలో నిల్వ ఉన్న గోధుమల స్థాయి 28.3 మిలియన్ల టన్నులుగా ఉన్నది. అంతకుముందరి పదేండ్ల సగటు నిల్వల స్థాయితో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. దీనికొక ప్రధాన కారణం సేకరణ తగ్గడం కూడా. 2022-23 మార్కెటింగ్ సీజన్లో భారత ఆహార సంస్థ సేకరించిన గోధుమల స్థాయి, అంతకుముందరి సీజన్లో కంటే 130 శాతం మేరకు తక్కువగా 18.79 మిలియన్ల టన్నులుగా ఉన్నది. నిన్నకాక మొన్న కర్ణాటక ఎన్నికలు ముగిసేనాటికి కేంద్ర ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ధాన్యం స్థాయి సుమారుగా 56 మిలియన్ల టన్నులు. ఈ మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పంపిణీ జరిగే ధాన్యం అవసరాల స్థాయి కంటే (72 మిలియన్ల టన్నులు) తక్కువ.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంవత్సరం ఎల్నినో ప్రభావితంగా ఉన్నదన్న వాస్తవాన్ని చూడాలి. అంటే, పసిఫిక్ సముద్రంలో వేడెక్కే జలాల వలన మన దేశంలో కూడా అతివృష్టి, అనావృష్టిల కలగలుపు పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటికే రుతుపవనాలు, జూన్లో మూడు వారాలు ఆలస్యంగా ప్రవేశించాయి. ఇక ఆగస్టులో 122 సంవత్సరాల కిందట (1901 ఆగస్టు అనంతరం) నాటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఈ వర్షాభావ నేపథ్యంలోనే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు 2 శాతం మాత్రమే పెరగగా, మరోపక్క పప్పుధాన్యాల నాట్లు 8 శాతం పడిపోయాయి. ముఖ్యంగా భారతదేశంలో, అత్యధిక వర్షపాతం (75 శాతం) జూన్-సెప్టెంబర్ మాసాల మధ్యనే, అంటే ఖరీఫ్ సీజన్లోనే ఉంటుంది. ఈ వర్షం అటు వరి పంటకు, ఇటు మక్కజొన్నలకు కూడా చాలా కీలకం. కాగా ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ తాలూకు వర్షపాతం గురించిన చివరి ఆశలు ప్రస్తుతం నడుస్తున్న సెప్టెంబర్ మాసంపైనే ఉన్నాయి. కాగా, ఈ మాసంలో కూడా వానలు తగ్గినా… లేకుంటే కుంభవృష్టి రూపంలో అతివృష్టి ఏర్పడినా అది పంటలకు ప్రమాదమే. దేశంలో 50 శాతం మేరకు వ్యవసాయం వర్షపాతం మీద ఆధారపడిన స్థితిలో, ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల దయాదాక్షిణ్యాలపై దేశంలోని వ్యవసాయరంగం ఆధారపడి ఉంది. వాతావరణ అంచనాల ప్రకారంగా నవంబర్ 2023, జనవరి 2024 వరకు ఎల్నినో ప్రభావం ఒక మోస్తరు తీవ్రత నుంచి బలంగా ఉండే అవకాశాలు 81 శాతంగా ఉన్నాయి.
ఎల్నినో తాలూకు వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నా, వాస్తవంలో ప్రభుత్వాలు కనుక సరైన సేకరణ విధానం, పంపిణీ విధానాలను కలిగి ఉంటే దేశంలో ప్రస్తుత పరిస్థితుల వంటివాటిలో కూడా, నిత్యావసరాల కొరతలు గానీ, లేదా ధరల పెరుగుదల గానీ ఉండేందుకు ఆస్కారం లేదు. అయితే, మన ప్రభుత్వం విదేశీ మారకద్రవ్యం కోసం ధాన్యాలను ఎగుమతి చేస్తూ పోవడం.. లేదా, తన సామాజిక పునాది అయిన వ్యాపారవర్గాలను సంతృప్తి పరిచేందుకు నిత్యావసరాల గరిష్ఠ నిల్వల స్థాయిని నిర్దేశించే చట్టాల వంటి వాటిని తొలగించడం, ధాన్యం సేకరణను ప్రైవేటు వ్యాపారులకు వదిలేయడం.. దేశంలో ఆహారభద్రత కోసం తాను చేయవలసిన స్థాయిలో ఆహార సేకరణను చేయకపోవడం వంటి నిర్ణయాలన్నీ నేడు దేశంలో ధరల పెరుగుదలకు కారణం. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రకారంగా- కరువు కాటకాలన్నీ మానవ చర్యల ఫలితమేనని చెప్పి ఉన్నారు. దీన్ని ఆయన సహేతుకంగా, ఉదాహరణలతో వివరించారు.
కాబట్టి విధాన లోపం వల్లనే నేడు జూలైలో దేశంలో ద్రవ్యోల్బణం ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే కూడా అత్యధిక స్థాయిలో ఉన్నది. ఉదాహరణకు బ్రెజిల్లో ద్రవ్యోల్బణం జూలైలో 3.99 శాతంగా ఉన్నది. ఇక, రష్యాలో అది 4.3 శాతంగా ఉన్నది. కాగా, నిన్నటివరకు రెండంకెల ద్రవ్యోల్బణ స్థాయితో సతమతమైన అనేక ధనిక దేశాల్లోనూ నేడు పరిస్థితి మనకంటే మెరుగ్గానే ఉన్నది. మచ్చుకు జర్మనీలో ద్రవ్యోల్బణం 6.5 శాతంగానూ, అమెరికాలో 3.2 శాతంగానూ, ఫ్రాన్స్లో 5 శాతంగానూ ఉన్నది. అదీ విషయం..!
ఇదంతా ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నది. పెరుగుతున్న నిరుద్యోగం వంటివాటితో పాటుగా ఈ ధరల పెరుగుదల తీవ్రత కూడా దేశంలోని మధ్య తరగతి వర్గ స్థితిగతులను వేగంగా దిగజారుస్తున్నది. కాగా, మరోపక్కన మోదీ మాత్రం నేటి పేదలే రేపటి మధ్య తరగతి అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజానికి జరుగుతున్నది నిన్నటి మధ్యతరగతి నేడు వేగంగా పేదల శ్రేణుల్లో చేరిపోతుండటం.
-డి.పాపారావు
98661 79615