Russia-Ukraine War | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుల్లో ఒకరైన అలెక్సీ నావల్నీ తాను నమ్మిన సిద్ధాంతాలకు అంతిమ మూల్యం చెల్లించుకున్న వ్యక్తిగా నిలిచారు. నావల్నీ మరణానికి ఆర్కిటిక్ జైలులో ‘ఆకస్మిక మరణ సిండ్రోమ్” కారణమని రష్యా అధికారులు చెబుతున్నారు. కానీ, వ్లాదిమిర్ పుతిన్ అతన్ని జైలులో చంపి, ఆపై ఆనవాళ్లను కప్పిపుచ్చడానికి మృతదేహాన్ని దాచారని అతని భార్య ఆరోపించారు. పుతిన్ పాలనాకాలంలో రష్యాలో అలాంటి గొంతులు భారీ మూల్యం చెల్లించుకోవడం పరిపాటిగా మారింది.
నావల్నీ మృతిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక పాశ్చాత్య దేశాలు దీన్ని ‘హత్య’ అని పిలుస్తున్నాయి. నావల్నీ మృతిపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) డిమాండ్ చేసింది. నావల్నీ మరణానికి అంతిమ బాధ్యత అధ్యక్షుడు పుతిన్, రష్యా అధికారులదేనని ఈయూ పేర్కొంది. రష్యా ప్రతిపక్ష నేత మరణానికి పుతిన్ కారణమని ఆరోపించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాస్కోపై అదనపు ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ యుద్ధ భూమిలో పెద్ద సంఖ్యలో రష్యన్లు ప్రాణాలు కోల్పోయినా యుద్ధాన్ని పుతిన్ కొనసాగిస్తున్నారు. పాశ్చాత్య రాజధానుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ, ఉక్రెయిన్పై యుద్ధాన్ని మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టిస్తున్నారు. రష్యాలో అసమ్మతిని, వ్యతిరేకతను అణచివేయడంలో ఆయన సఫలీకృతులయ్యారని, ఈ యుద్ధంలో ఆటుపోట్లు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయని తెలుస్తోంది. గత వారం తూర్పు ఫ్రంట్లో ఉక్రేనియన్ దళాలు వెనక్కు తగ్గడం వల్ల పెద్ద మార్పేమీ కాకపోవచ్చు కానీ, ఇది కచ్చితంగా తూర్పు ఫ్రంట్లో రష్యన్ దళాలకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ సెక్టార్లోని సరిహద్దు వెంబడి ఉక్రెయిన్ సైన్యం ఒత్తిడికి లోనవుతుంది. ఎన్ని ఆంక్షలు, సవాళ్లు ఎదురైనా తన సైనిక సాహసాన్ని కొనసాగించడానికి రష్యా ఆర్థిక వ్యవస్థ పటిష్టత తోడ్పడుతుంది. రికార్డు స్థాయిలో ముడిచమురు విక్రయాలు కొనసాగుతుండటంతో పుతిన్ ఖజానా నగదుతో నిండిపోయింది. రష్యాలో ఆర్థిక వృద్ధికి ఈ యుద్ధం ఆజ్యం పోస్తోంది. గత ఏడాదిలో మొత్తం జీ7 కంటే వేగంగా రష్యా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. 2024లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పాశ్చాత్య దేశాలను ఇరుకున పెట్టడానికి పుతిన్కు ఈ
పరిస్థితి వీలు కల్పించింది.
ఉక్రెయిన్కు ఇది ఒక సున్నితమైన పరిస్థితి. ఎందుకంటే ఆ దేశానికి మానవ వనరులు, మందుగుండు సామగ్రి సరిపడా లేదు. పాశ్చాత్య సహాయం కూడా తగ్గిపోతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరిన్ని ఆయుధాల కోసం విజ్ఞప్తి చేస్తూ, ‘కృత్రిమ ఆయుధాల కొరత’ రష్యాకు మాత్రమే సహాయపడుతుందని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్కు సహాయంపై ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో అంతర్గతంగా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో రాజకీయ విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తూర్పు ఫ్రంట్ నుంచి ఉక్రెయిన్ వెనక్కు తగ్గడానికి తమ సాయాన్ని అందించలేకపోవడమే కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అయితే కాంగ్రెస్ ఆమోదించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. కానీ, రిపబ్లికన్ల వ్యతిరేకత నేపథ్యంలో ఆయన చేయగలిగిందేమీ లేదు. సమయం తనకు అనుకూలంగా ఉందని పుతిన్ గతంలో కంటే ఎక్కువగా విశ్వసిస్తున్నారు.
ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతూనే ఉంది. ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమించకముందే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. యుద్ధంతోనే సమస్యలు పరిష్కారం కావని, దానికి బదులుగా చర్చలు, దౌత్యం దిశగా ఒక మార్గాన్ని రూపొందించాలని భారత్ మొదటి నుంచి వాదిస్తోంది. ప్రస్తుతం రష్యా లాభాలు, ఉక్రెయిన్ విజయాలు తాత్కాలికమని గత రెండేండ్ల యుద్ధం, విధ్వంసం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. ఈ యుద్ధంలో ప్రధాన పాత్రధారులు తమ చర్యలకు జరిగిన నష్టాన్ని గ్రహించి, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉక్రేనియన్ అభద్రతలను, రష్యన్ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ యుద్ధాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఆ దిశగా అందరూ కృషి చేస్తారని ఆశిద్దాం.
అనువాదం: స్వామి ఆర్వీవీయస్ (ఎన్డీ టీవీ సౌజన్యంతో)
– ప్రొ.హర్ష్ వి పంత్