‘దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా 40 శాతం అవకాశాలున్నాయి. మిగిలిన 60 శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. ఈ 60 శాతం అవకాశాల్ని సరిగ్గా ఒడిసిపట్టుకొని ఓట్ల రూపంలోకి మల్చే పార్టీయే/ కూటమే మోదీ సారథ్యంలోని బీజేపీని ఓడించగలుగుతుంది’ అని విశ్లేషిస్తున్నారు ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. విపక్ష కూటమి ఒక సమర్థవంతమైన నేతతో, వాదనతో, వ్యూహంతో, యంత్రాంగంతో సిద్ధమైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించటం సాధ్యమేనని చెబుతున్నారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ రాజకీయాలపై పీకే తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో 40-45 శాతం మేర అవకాశం ఉంది. బీజేపీ 30-37 శాతం ఓట్లను సాధిస్తున్నందున ఆ పార్టీకి ఉండే అవకాశం కూడా 40 శాతం. మిగిలిన 20 శాతంలో చిన్నపార్టీలు, ప్రాంతీయపార్టీలు పని చేస్తున్నాయి. కాబట్టి, బీజేపీని దీటుగా ఎదుర్కొనే పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించాలంటే బీజేపీ ఆధీనంలో లేని మిగిలిన 60 శాతంలో కనీసం 40 శాతాన్ని కచ్చితంగా తన ప్రభావం కిందికి తీసుకోగలగాలి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ ఓట్ల వాటా 19 శాతానికి పడిపోయింది. పార్టీ పనితీరులో, వ్యూహంలో మార్పుల ద్వారా, మెరుగైన ప్రయత్నాల ద్వారా తన ఓట్లశాతాన్ని మరో 25-30 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యమే కూడా.
జనసంఘ్కన్నా ముందు నుంచి, కొన్ని తరాలుగా, 60-70 ఏండ్లపాటు నేతలు, కార్యకర్తలు చేసిన కృషి కారణంగా బీజేపీ నేడు దేశంలో 30-35 శాతం ఓట్లు సాధించే స్థితికి చేరుకున్నది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలువవచ్చు, ఓడిపోవచ్చు.. కానీ, ఇప్పటికిప్పుడు మాయమైపోదు. కనీసం 30-40 ఏండ్లపాటు దేశ రాజకీయాల్లో బీజేపీ ఉంటుంది. 1967 తర్వాత కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో ఓడిపోయింది. అయినప్పటికీ ఆ తర్వాత కూడా దేశ రాజకీయాలు ఆ పార్టీ చుట్టే తిరిగాయి. కారణం.. దేశవ్యాప్తంగా 30-35 శాతం ఓట్లను గెల్చుకునే స్థాయికి ఆ పార్టీ అప్పటికే చేరుకున్నది. ఇదే సూత్రం నేటి బీజేపీకి వర్తిస్తుంది. కాబట్టి, మీరు బీజేపీని వ్యతిరేకించదల్చుకుంటే, ప్రజలకు ఆ పార్టీ చెబుతున్నదానికన్నా మెరుగైనదానిని చెప్పి వారి హృదయాలను గెల్చుకునే దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడాల్సి ఉంటుంది.
అధికారంలో ఉన్న పక్షానికి (బీజేపీకి) అనుకూలంగా లేని 60 శాతం పరిస్థితులను ఉపయోగించుకొని ఒక రాజకీయ కూటమిని ఏర్పాటు చేయటం వీలవుతుందా? కాదా? అన్నదానిపైనే నేను ప్రస్తుతం ఆలోచిస్తున్నా.
బెంగాల్లో బీజేపీని తృణమూల్ ఓడించిన ఘటన నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. నీ ప్రత్యర్థిని ఓడించాలనిఅనుకుంటే ముందు నీ ప్రత్యర్థి బలాన్ని అంగీకరించాలి. అ ప్పుడే ఎలా ఓడించాలో తెలుస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికే బెంగాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగింది. అప్పుడు తృణమూల్ ఆ వాస్తవాన్ని గుర్తించటానికి నిరాకరించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొరపాటును సరిదిద్దుకుంది.
విపక్షాలు కలిసికట్టుగా పోటీ చేస్తే మోదీని ఓడించవచ్చనే ఆలోచన విజయవంతం కాబోదు. అసోంలో, యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటములు ఏర్పడినప్పటికీ బీజేపీ చేతి లో ఓడిపోయాయి. బీజేపీని ఓడించాలంటే కావల్సింది.. బీజేపీ యేతర వర్గాలను ఐక్యపరిచే నేత, సిద్ధాంతం, వ్యూహం. అటువంటి నాయకుడు సహజంగానే ఆవిర్భవిస్తాడు. వెదికి పట్టుకోవాల్సిన పని లేదు. విపక్షాలను జయప్రకాశ్ నారాయణ్ ఐక్యపరుస్తారని 1972లో ఎవరు ఊహించారు. వీపీ సింగ్ ఆవిర్భావం గురించి 1986లో ఎవరైనా తలచారా? నరేంద్రమోదీ 2014లో ప్రధాని అవుతారని 2010లో ఎవరైనా భావించారా?
హిందుత్వ రాజకీయాలకు వాటికంటూ ఓ పరిమితి ఉంటుంది. ఏ వర్గాన్నైనా 50-55 శాతానికి మించి మతం ప్రాతిపదికన సమీకృతం చేయటం సాధ్యం కాదు. అంటే హిందువుల్లో ఒక వ్యక్తి బీజేపీకి ఓటు వేస్తే మరొక వ్యక్తి ఆ పార్టీకి ఓటు వేయట్లేదని గణాంకాలు తెలుపుతున్నాయి.
చతికిలపడిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ భావజాలమేగాక దేశంలో ఆ పార్టీకి ఉన్న స్థానం విపక్షకూటమికి కీలకమైనది. అయితే, గత పదేండ్లలో 50కిపైగా లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైంది. 2012లో కర్ణాటక, 2017లో పంజాబ్, 2018లో చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలను మాత్రమే కైవసం చేసుకుంది. అంటే ఎన్నికలకు సిద్ధమయ్యేతీరులోగానీ, ప్రజలతో కలువటంలోగానీ కాంగ్రెస్ తనను తాను మల్చుకున్న తీరులోనే మౌలికలోపం ఉందని తేలుతున్నది. నిజానికి 1984 తర్వాత కేంద్రంలో మైనారిటీ, సంకీర్ణప్రభుత్వాలనే తప్ప సొంతంగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయలేకపోయింది. అంటే, కాంగ్రెస్లో ప్రస్తుతం చూస్తున్న క్షీణత అనేది తాత్కాలికంగా జరిగింది కాదు. 1984 నుంచి ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతూనే ఉన్నది. దీనికి ఒక వ్యక్తో, ఒక ఘటనో కారణం కాదు. అంతకన్నా లోతైన కారణాలున్నాయి. సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ఆ పార్టీలో మార్పులు తెస్తేగానీ ఫలితం రాదు. గత రెండేండ్లుగా కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపా. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇవి మరింత విస్తృతస్థాయిలో జరిగాయి. దాదాపుగా నేను కాంగ్రెస్పార్టీలో చేరిపోయినట్లయ్యింది. కానీ, మేం కలిసి ఉంటే ఇరువురికీ నష్టమేనని కొన్ని అంశాల ద్వారా గుర్తించాం. దాంతో మా దారులు వేరయ్యాయి.
మమతా బెనర్జీకి సలహాలు ఇస్తున్నానన్న వార్తలు నిజం కాదు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్త పని వదిలేస్తానని ప్రకటించినట్లుగానే వదిలిపెట్టా. ఇప్పటివరకూ నేను పని చేసిన ఐ-ప్యాక్ సంస్థ ఆఫీసులకు గత ఆరునెలల్లో రెండు మూడుసార్లకు మించి వెళ్లలేదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెడితే మళ్లీ ప్రజలు ఎన్నుకునే అవకాశాలు అధికం. ఒడిశాలో నవీన్బాబు, బెంగాల్లో మమత బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నది ఇదే.
బెంగాల్ అవతల తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ గురించి మీడియాలో అతిశయోక్తులు చెబుతున్నారు. ఆ పార్టీ విస్తరణ ప్రయత్నాలు చేస్తున్న గోవా, మేఘాలయ, త్రిపుర రాష్ర్టాలను కలిపినా నాలుగైదు లోక్సభ సీట్లకు మించి ఉండవు. తృణమూల్, వైసీపీ, ఎన్సీపీ వంటి కాంగ్రెస్ మూలాలున్న పార్టీలు చేతులు కలిపితే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఆవిర్భవించే అవకాశం ఉంది. కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటిది 3-4 సార్లు జరిగింది కూడా. 1969లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్(ఐ) ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్నే మించిపోయింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే యూపీ ఎన్నికల ఫలితం 2024లో జరిగే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కచ్చితంగా చెప్పలేం. 2012 నాటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 లేదా 4వ స్థానంలో నిలిచింది. ఎస్పీ ఘనవిజయం సాధించింది. ఆ ఫలితాల ప్రభావం 2014 నాటి లోక్సభ ఎన్నికలపై ఎంతమాత్రం పడలేదు కదా! కాబట్టి, యూపీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు.
నాయకుడికి ధైర్యమే కీలకం
విజయవంతమైన నాయకుడిలో ఉండే లక్షణాలు.. వివేకం, వ్యక్తిత్వం, ధైర్యం. ఈ మూడింటిలో మొదటి రెండు కొద్దిగా తక్కువ ఉన్నా రాజకీయాల్లో నడిచిపోతుంది. కానీ, మూడోది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిన అంశం. ధైర్యమే ఒక నాయకుడిని తయారుచేస్తుంది.
ప్రజల్లో బాగా ఆదరణ పొందిన ఒక నాయకుడుగానీ, ఒక అంశంగానీ, ఒక భావోద్వేగ సంఘటనగానీ లేనప్పుడు ఎన్నికల్లో కులం తనదైన పాత్ర పోషిస్తుంది.
బీజేపీపై నాలుగంచెల వ్యూహం
బీజేపీకి గట్టి సవాల్ విసిరే విధంగా ప్రతిపక్షాలు తయారుకావాలంటే చేయాల్సిన పనులు నాలుగు.
ఈ నాలుగింటిని నిరంతరం బలోపేతం చేసుకుంటూ బీజేపీపై పోరాటానికి సిద్ధం కావాలి. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉంది. అది తక్కువేమీ కాదు. ప్రస్తుత నాయకత్వంలో ఉన్న బీజేపీని ఆ ఎన్నికల్లో ఓడించవచ్చేమోగానీ.. ఆ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలంటే మాత్రం 7-10 ఏండ్ల దీర్ఘకాల వ్యూహానికి సిద్ధపడాలి.
బీజేపీ బలాలు-బలహీనతలు
హిందుత్వనే బీజేపీ ప్రధాన బలంగా నేటికీ కొనసాగుతున్నది. దీనికి ‘అతి జాతీయవాదం’ అనే కొత్త అస్ర్తాన్ని జోడించారు. అందువల్లే వారిని ఎవరైనా విమర్శిస్తే చాలు.. ఆ వ్యక్తిని జాతివ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తుంటారు. బీజేపీ మూడో బలం.. సంక్షేమ పథకాలు. ఉజ్వల గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికీ నల్లా నీళ్లు వంటివి. ఈ మూడు బలాల్లో కనీసం రెండింటి విషయంలోనైనా మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు చూపితేగానీ బీజేపిని ఓడించటం
విపక్షాలకు సాధ్యం కాదు.
కాంగ్రెస్తో ముఖాముఖి పోరులో బీజేపీ సక్సెస్ రేటు 95 శాతం. కానీ, ఇతర పార్టీలను ఎదుర్కొనే విషయంలో ఆ స్థాయి విజయాలు బీజేపీకి లేవు. తూర్పు, దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీ పరిస్థితి బలహీనం. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ర్టాలు కలిపి దాదాపు 200 ఎంపీ సీట్లుంటాయి. బీజేపీకి ఉన్నవి 47 మాత్రమే. అంటే, లోక్సభలో ఉన్న 40 శాతం సీట్లలో ఆ పార్టీ పరిస్థితి బాగా లేదు. గత పదేండ్లుగా బీజేపీ దూకుడును ప్రాంతీయపార్టీలు, నేతలు గట్టిగా ఎదుర్కోగలుగుతున్నారు.బీజేపీ బలమంతా పశ్చిమ, ఉత్తరాది రాష్ర్టాల్లోనే. కర్ణాటక నుంచి కశ్మీర్ వరకు పశ్చిమంగా గుజరాత్ మీదుగా ఒక లైను గీస్తే.. ఆ లైను మీదనే బీజేపీ బలమంతా కేంద్రీకృతమై ఉంది. ఆ ప్రాంతంలో ఓ 100 సీట్లు కోల్పోతే చాలు.. ఆ పార్టీ పరిస్థితి బలహీనపడిపోతుంది.
(అనువాదం: కె.వి.రవికుమార్)