గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే. ప్రజలకు రాజకీయంపై నమ్మకం పోతున్నది’ అన్నడు కోపంగా, నిరాశగా!
‘మీకోటి తెలుసా? వార్డు మెంబర్, సర్పంచ్ మొదలుకొని చిన్నస్థాయిలలో కూడా ఎట్లుంటరో? పోటీ చేసేప్పుడు ‘నో డ్యూ సర్టిఫికెట్’ మ్యాండేటరీ కాబట్టి ఏండ్లుగా కట్టకుండా వదిలేసిన ఇంటిపన్ను లాంటివి తప్పనిసరై కడుతరు. అయిదారు వందలు సైతం తమ పార్టీ నాయకులే ఇయ్యాలంటరు. ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయనివారు జీవితంలో కట్టరు ఇంటిప న్ను! మీరు మీ సొంత ఊరిలో కనుక్కోండి తెలుస్తది. పోనీ ఊళ్ళల్లో మీకు సొంత ఇల్లు ఉంటే, పన్ను కట్టిన్రో లేదో చూసుకోండి. ఇదంతా పునాది అవినీతి అన్నమాట. ఇది పార్టీలకు, రాజకీయాలకు మాత్రమే కాదు… మనసమాజమే అంత మనలో చాలా మందిమి కూడా ‘అతి చిన్న స్థాయి’ అవినీతి చేస్తూ ఉంటము…
Telangana | ‘దేశాన్ని సుదీర్ఘకాలం పాలించి, పేదరికాన్ని కదలకుండా కాపాడిన 139 ఏండ్ల వయసు గల పార్టీయా, దేశాన్ని మత మౌఢ్యం వైపు తీసుకుపోతున్న ద్వేషభక్త పార్టీయా, గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయాలతో ముందుకువస్తున్న శక్తులా… వీరిలో ఎవరి ట్రాక్ రికార్డ్ ఏమిటి? అని కదా చూడాలి. మహా బలశాలులమని విర్రవీగేవారిని ఎదిరిస్తున్న ప్రత్యామ్నాయ శక్తులను జైళ్లలో కుక్కుతున్న అవినీతి రాజకీయం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకంటే తక్కువ అనైతికం?
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత ప్రభుత్వ పాలన సర్వమూ అవినీతిమయమని వంద రోజులుగా చెప్పిన మాట చెప్పకుండా చెప్తున్నరు. ‘తెలంగాణ బిడ్డలు, అమరులు, ఉద్యమం’ అంటూ తనకు సంబంధం లేని పదజాలం వాడుతున్నరు. ఓటుకు కోట్లిచ్చి టీవీలకు దొరికిపోయిన నాయకుడు సచ్ఛీలుడుగా ఫోజు కొడుతున్నరు. ఇది కదా అసలు అవినీతి!
పోనీ… అయాచితమో, అపాత్రదానమో… తనకు సంక్రమించిన పదవిని సదుపయోగం ఏమన్న చేస్తున్నరా? తెలంగాణను నిలువునా ముంచుతున్నరు కదా రేవంత్ రెడ్డి?
నీళ్లు లేవు, అడ్జెస్ట్ కండి అంటున్నడు. నిధులు కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం రూపంలో తరలిస్తున్నరు. అందుకే ఎల్ఆర్ఎస్ రూపంలో దోస్తున్న, రైతుబంధు ఆపుతున్న, పింఛన్లు ఇయ్య, రుణమాఫీ ఇయ్య అంటున్నడు. వచ్చి వందరోజులు కాలేదు, ముప్ఫై వేల కొలువులు ఇచ్చిన అంటున్నడు, పాత ప్రభుత్వపు పంటను ఏరుకుంటూ.
అట్లా ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ అనే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్య ప్రకటనకు నీళ్లు ఒదిలేసిండు రేవంత్ రెడ్డి.
‘కేసీఆర్ చానా చేసిండు. కొన్ని సరిగా చేయలేదు. ఇంకొన్ని పట్టించుకోలేదు. కానీ, తెలంగాణకు నష్టం చేయాలని ఆయన ఏనాడూ అనుకోలేదు. జీవితంలో కూడా అనుకోడు. తెలంగాణపై కేసీఆర్ ప్రేమను రేవంత్ రెడ్డి ఏం ఖర్మ, రేవంతు గురువు చంద్రబాబు కూడా శంకించలేడు…’
మొన్న హెయిర్ కటింగ్ చేస్తూ నాతో మా బార్బర్ శ్రీనివాస్ అన్న మాటలవి. హెయిర్ కటింగ్ సెలూన్లు మన పల్లెటూళ్లలోని రచ్చబండ లాంటివి. లోకాభిరామాయణాల లాగనే అనిపిస్తయి పైకి… కానీ చాలా లోతైన విషయాలు మాట్లాడుతరు. అలవోకగా పదాలు దొర్లుతుంటయి. డేటా, స్టాటిస్టిక్స్, మనవాళ్లా కాదా వగైరా ఉచ్చులలో పడి మేధావులు సంశయాత్మక జీవులుగా ఉంటరు కానీ… ‘పామరులు’ సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతరు.
ఆరు వేల కోట్ల రూపాయల నిధులు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సేకరించిన బీజేపీ అసలైన అవినీతి సామ్రాట్టు. లిక్కర్ స్కాం మిషతో కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకొని కవితను అరెస్టు చేయించింది బీజేపీ. కానీ, అదే లిక్కర్ స్కాంలో దోషిగా వారే పేర్కొన్న వ్యక్తి దగ్గర 50 కోట్లు బాండ్ల రూపంలో తీసుకొని ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించిన్రు. ఇది కాదా అవినీతి? ఈడీ, ఈసీ, ఐటీ, సీవీసీ అందరూ ‘మేం బీజేపీలో చేరం, బయటి నుంచి మద్దతు ఇస్తం’ అన్నట్టుగా లేదూ ఈ మిలాఖత్? లిక్కర్ స్కాం దూదిపింజె వంటిది కదా ఈ అవినీతి అనకొండల ముందు?
ఇది ఎట్లా ఉంటుందంటే, భారతదేశం అవినీతిమయం అని చెప్పే పశ్చిమ దేశాలు పరమ అనైతికంగా చిన్న దేశాలపై దాడులు చేసి, యుద్ధాలు చేసి, మారణహోమం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టి… తమ దేశ ప్రజల దృష్టిలో మాత్రం అవినీతి ఎరుగని పాలన అందించే సచ్ఛీలురు లాగా ఆమోద ముద్ర వేయించుకోవడం లాంటిది.
కేసీఆర్ ఇచ్చిన దళితబంధు విప్లవాత్మకమైన విధానం కాదా? విడతల వారీగా అందరికీ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కదా? నలుగురు పిల్లలున్న ఇంటిలోనే అందరి కోర్కెలూ (అవి ఎంత న్యాయమైనవి అయినా) ఒక్కసారే తీర్చలేరే తల్లిదండ్రులు? మరి రాష్ర్టాన్ని నడపాల్సిన తండ్రికి ఎన్ని బాధ్యతలు, ఎన్ని జాగ్రత్తలు, ఎంత ప్లానింగ్ ఉండి ఉండాలి? ఏడెనిమిదేండ్ల పాలనలోనే ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిన నాయకుడికి ఇంకింత సమయం ఇవ్వాలి కదా?
దళితబంధు ఉదాహరణలోనే చూద్దాం… మేలు జరిగిన కుటుంబాలు మిగిలినవారికి చెప్పి ఉండాలి కదా? అందరికీ అవకాశాలు ఒస్తయని ఒప్పించి ఉండాల్సింది కదా? రానివారు కూడా కొంచెం నిరీక్షిస్తే ఏమయ్యేది? ఇదే మాట బీసీ బంధు, గృహలక్ష్మి, మైనారిటీ బంధు అన్నిటికీ వర్తిస్తుంది. ఏడున్నర దశాబ్దాల ఏలుబడి పాపాలను ఏడున్నరేండ్లలో తుడిచిపెట్టగల మంత్రదండం ఏమీ లేకుండె కదా కేసీఆర్ దగ్గర? ఆయన సంకల్పానికి ఆయువు పోయాల్సిన ప్రజలు అలిగి కూచుంటే ఎట్లా? చెరువు మీద కోపం చూపడం కాదా ఇది?
ఒకటో తారీఖు జీతం పడటం లేదని కినిసిన గురువులు కొంచెం ఆలోచించి ఉండవలసింది కదా? అభివృద్ధి- సంక్షేమ పథకాల ద్వారా; ఐటీ/ పారిశ్రామిక ప్రగతి ద్వారా; ఫలసాయాలతో కళకళలాడే గ్రామీణ కుటుంబాల రూపంలో అందరూ బాగుపడ్డరు కదా? అందులో మీ కుటుంబాలూ ఉన్నయి కదా? బోధకులకు హ్రస్వదృష్టి తగునా? నెలజీతం కాస్త అటూ ఇటూగా వస్తే మాత్రం ఏమైంది? మీ ఆగ్రహం ఇపుడు పై అన్ని వ్యవస్థలకూ తూట్లు పొడిచే పాలనగా రూపుదాల్చి… మీకేమైనా సంతోషం మిగిల్చే సర్వతోముఖాభివృద్ధి జరుగుతున్నదా? మీ స్వగ్రామమో, మీరు పనిచేసే ఊరో… వందరోజుల కిందట కంటే ఇపుడు వెలిగిపోతున్నదా లేక కునారిల్లుతున్నదా?
‘ప్రగతిభవన్’ ప్రజాభవన్గా; ‘టీఎస్’ ‘టీజీ’గా నామాంతరం చెందినయి తప్పిస్తే ఏం ఒరిగింది? కొత్త పాలకుడు చుక్కలు చూపిస్తున్నడు కదా? దళితబంధు మర్చిపోండి… రైతుబంధే ఇవ్వడం లేదు కదా? ఇస్తానని ఆయనే చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేరడం లేదు కదా? రేపు పార్లమెంట్ ఎన్నికలయ్యాక ఇంకా తీసికట్టు అవుతుంది కదా తెలంగాణ! పోనీ రేవంత్ రెడ్డి ఎపుడన్నా తెలంగాణవాదం మాటవరసకైనా తలకెత్తుకున్నడా? ఉద్యమకారులపై తుపాకీ చూపించిన నాయకుడు కదా? ఈ రోజు సీఎం హోదాలో ఏ సభలోనైనా ‘జై తెలంగాణ’ అంటున్నడా? తెలంగాణ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసివేయడం, తెలంగాణ తల్లి రూపం మార్చడం ద్వారా ఆయన మరపింపజూస్తున్నది కేసీఆర్ను కాదు, తెలంగాణ ఉనికినే లేకుండా చేసే అతిపెద్ద దుస్తంత్రం. మరి తెలంగాణ మేధావుల మౌనంలో ఏమి నైతికత ఉన్నది? ఇంకా శాప విముక్తి జరగాలి బీఆర్ఎస్కు. తాము విధించిన శిక్షను మనస్ఫూర్తిగా ఆహ్వానించి, అనుభవించి, పునీతులై వస్తే అక్కున చేర్చుకుంటరు ప్రజలు. మాటలోనూ, చేతలోనూ, భాషలోనూ, బాడీ లాంగ్వేజీలోనూ అది కనపడాలి. యే కోశానా తెలంగాణ ఆత్మలేని రేవంత్రెడ్డి ప్రేమ నాటకాలాడుతూ ఉంటే… అచ్చ తెలంగాణ స్వచ్ఛబిడ్డలూ, మీకేమి భేషజం? అన్నరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కవి మిత్రుడు నాతో. ఆయనలో బీఆర్ఎస్ను తప్పు పట్టడం కంటే, రేవంత్కు తెలంగాణను అపాత్రదానం చేయడం పట్ల ఆగ్రహం కనిపించింది నాకు.
ఏ ప్రజలైతే తిరస్కరించిన్రో, కండువా మార్చి కొత్తగా ఓటేయమని వారినే అడగడం, మూడు నెలలు కూడా గడవకుండానే అధికార యావతో చొంగ కార్చడం ఎంత సిగ్గులేని తనం? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పడు అధికారం చెలాయించి, ఆస్తులు పోగేసుకొని, ఇప్పుడు తప్పంతా అధినేత ఒక్కడిదే అన్నట్టు తాము అవతల పడుతరా? ఆ కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో ఇట్లా ద్రోహం చేయడం ఎంత అనైతికత!
సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వెలగబెట్టినవారు అంత బరితెగిస్తే, వారిని ఆలోచనాపరులు ఖండించకపోవడం పార్టీకి ద్రోహం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవారి పట్ల చేసే అసహ్యమైన వెటకారం!
పార్లమెంటు ఎన్నికలు ముంగిటిలో ఉండగా, పార్టీ ప్రభను పాతాళానికి తొక్కేసే నాయకుల పట్ల అప్రమత్తత అవసరం. శ్రేణులకు ధైర్యం ఇవ్వడం కాదు… వారు ధైర్యంతో పోరాడుతున్నరు, వారికి మ్యాచ్ అయ్యేలా ఉండాలి కదా నాయకుల నైతిక స్థాయి?!
పదేండ్ల పాలనలో కేసీఆర్ చేసిన మహా పాపాలు ఏమీ లేవు. ప్రతిపక్షాలు వేసే అవినీతి ఆరోపణల ట్రాప్కు నాయకులూ, ప్రజలూ, ఆలోచనాపరులు పడకూడదు. వ్యవస్థలను తీర్చిదిద్దడం, చెమటోడ్చి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పం తీసుకోవడం, అది దాదాపు సగానికి పైగా సుసాధ్యం చేయడం కేసీఆర్ నైతికత. ఆయన ప్రభపై అసూయ, ఆయన కుటుంబంపై కోపం, ఆయన కులంపై ద్వేషం ఉన్నవారు మినహాయిస్తే… చైతన్యానికి సుక్షేత్రమైన తెలంగాణ గడ్డపై పుట్టినవారు ఎవరైనా కాస్త ఆగి ఆలోచిస్తే అర్థమవుతున్నది మనం రత్నాన్ని విసిరి రాయి మెడకు చుట్టుకున్నమని.
‘ఒక పెద్దమనిషి బాయి తవ్విండు, చేతిల చాద బొక్కెన ఉన్నంతకాలం నీళ్లు చేదిపోసిండు. దూపతీర్చిండు. ఇయ్యాల బాయి అట్లనే ఉంది, బొక్కెన అట్లనే ఉంది. చేదిపోసే దిక్కే లేదు. ఎందుకంటే ఇయ్యాల బొక్కెన చేతుల పెట్టుకున్నోనికి జనం మీద ప్రేమ లేదు, దూపతీరుద్దమనే ఆలోచన లేదు. ఏందిరా అనడిగితే బొక్కెనకు బొక్కలున్నయి అంటున్నడు. బొక్కెన బొక్కలకు అతుకులేపిస్తడేమో అనుకుంటే మాంసం దుకాణంల యాట తలకాయ లెక్క భేజా జాగల బొక్కున్నది వాని తలకాయలనాయె…’ అన్నడు ఉదయభాస్కర్ కేశవదాసు అనే మిత్రుడు! నిజమే కద?!
వంద రోజుల తన పాలనతో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆశలను వమ్ము చేసింది. మనందరం సుషుప్తావస్థ నుంచి మెలుకువ తెచ్చుకునే, తెలంగాణను తట్టి లేపే సమయం ఆసన్నమైంది మిత్రులారా, పార్లమెంట్ ఎన్నికల రూపంలో! అందరినీ ఒకటే గాటన కట్టే నిరాశ నుంచి బయట పడుదామా? ప్రతీప శక్తులపై యుద్ధం చేయ కృతనిశ్చయులమవుదామా?
ఈ పిలుపు బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే తెలంగాణ మన అందరిదీ. దాన్ని కాపాడుకునే హక్కూ, బాధ్యతా మనదే. జై తెలంగాణ!