‘మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇదీ ‘పల్లె ప్రగతి’ సాధించిన ఘనత. 2019లో ఈ అపురూప కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా.. తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావటం కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చామని, తగిన నిధులు కేటాయించామని, తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శగ్రామాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ మహాక్రతువులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా పాల్గొనాలన్నారు. ఆయన ఆకాంక్షించినట్లుగా పల్లె ప్రగతి నిజంగానే మన గ్రామసీమలను ప్రగతి పట్టాలనెక్కించింది.
తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి 87 ట్రాక్టర్లు మాత్రమే ఉన్న దుస్థితి. రాష్ర్టావిర్భావంతో ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. పల్లె ప్రగతిలో భాగంగా మొత్తం 12,769 పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందించారు. వీటితో పారిశుద్ధ్య నిర్వహణ ఒక ఉద్యమంలా మొదలైంది. గ్రామసీమల్లో పచ్చదనం పెరిగింది. డంపింగ్యార్డుల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, రైతు వేదికల నిర్మాణం, కరెంటు స్తంభాలకు, వైర్లకు మరమ్మతులు వంటివి ముమ్మరంగా కొనసాగాయి. స్థానిక ప్రజాప్రతినిధుల, సఫాయీ కార్మికుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. కొత్త నియామకాలు జరిపింది. నాటే ప్రతి 100 మొక్కల్లో 85 జీవించి ఉండకపోతే సర్పంచి, గ్రామ కార్యదర్శిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పనుల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్కాడ్లను నియమించింది. ఈ విధమైన సమగ్ర కార్యాచరణతోనే పల్లె ప్రగతి ఎవరూ ఊహించని స్థాయిలో విజయవంతమైంది. అనేక జాతీయ వార్డులు తెలంగాణను వరించాయి. పల్లె ప్రగతిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పంచాయతీరాజ్ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రశంసించారు.
ఈ విజయంతో పట్టణ ప్రగతిని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ పట్టణాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించింది. ఓపెన్ జిమ్ల వంటి వినూత్న ఆలోచనలు పట్టణ ప్రజల్లో ఆరోగ్య స్పృహనూ పెంచాయి. సుదీర్ఘమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమాన్నైనా, ఒక విధానాన్నైనా కేసీఆర్ రూపొందిస్తారు అనేదానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఉదాహరణలు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ అభివృద్ధి పనులు అంటే.. ఓ రోడ్డు వేయటమో, ఓ నీళ్ల ట్యాంకు కట్టడమో అన్నట్లుగా ఉండేది. పైగా ఆ పనుల మధ్య సమన్వయం ఉండేది కాదు. వివక్ష, నిర్లక్ష్యం, నిధుల లేమి, సిబ్బంది కొరత వంటివి సరేసరి. దీనివల్లే తెలంగాణ పల్లెలు, పట్టణాలు కనీస సదుపాయాల లేమికి నిదర్శనంగా కునారిల్లుతూ ఉండేవి. దీనిని మార్చాలంటే అన్ని కోణాల్లో సమగ్ర ప్రయత్నాలు జరుగాలని, పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని కేసీఆర్ భావించారు. ఆ మేధోమథనం నుంచే కేసీఆర్ మానస పుత్రికలుగా ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ ఆవిర్భవించి గొప్ప విజయాల్ని సాధించాయి. మన పల్లెలు, పట్టణాలు ఇలాగే ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించాలి.