ఉద్యమకాలంలో పాడుకున్న పాటలు యాదికొచ్చి, వర్తమానంలో సాక్షాత్కారమైన వాస్తవాలను చూస్తున్నప్పుడు ఉద్వేగం ఊపేస్తుంది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా.. మన తెలంగాణలోనా’ వంటివి తెలంగాణ పోరాట సభలల్లో, జనాల నాలుకమీద ఆనాటి దుస్థితికి అద్దం పట్టే గాయాల గానాలుగా ఊరూరా భాస్వరమై మండేటివి.
పాలమూరు కరువు ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కీలక ఆయుధంగా ఉండేది. నాయకుల నిర్లక్ష్యం, అందనంత దూరంలో అధికారగణం, నిత్యం వెంటబడే కరువు పాలమూరు ప్రజానీకాన్ని గుంపు మేస్త్రీలకు గుత్తకు పట్టించేది. కానీ ఎనిమిదేండ్లలో ఎంత మార్పు. మారిన పాలమూరు ఉమ్మడి జిల్లా జన జీవితాలను దగ్గర నుంచి చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఆనందం కలగకుండా ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు. గత పాలకుల్లా విజన్-2020, విజన్-3030 డాక్యుమెంట్ల పేరిటనో డంబాచారాలకు స్వరాష్ట్ర పాలనా వ్యవస్థలో స్థానం అసలే లేదు. కానీ స్వల్ప కాలంలోనే పాలమూరు పాణం బట్టడమే కాదు, వేలాది మందికీ ఉపాధి కల్పించే కార్యక్షేత్రంగా మారిపోయింది.
వలసలు, రైతుల బలవన్మరణాలు, శిశు మరణాలు, నిరక్షరాస్యత, తదితర దారిద్య్ర సూచికలన్నింటిలో మొదటి స్థానంలో పాలమూరును కూలబడేశారు గత పాలకులు. ఆనాడు ఉమ్మడి జిల్లా నుంచి కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉండి, చక్రం తిప్పిన పేరుమోసిన రాజకీయ కుటుంబాలున్నా, ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ లాగా వారి నియోజకవర్గాలు ఉండేటివి. ఏరంచు ఊర్లు, ఊరంచు ఏర్లున్నా, తాగు నీటికి తండ్లాడే పాలమూరు పల్లెలపై కనికరం చూపే నాయకులే గతంలో కరువయ్యారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలలాగే, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వం సహితం పలుకుబడికి గబ్బిలాల్లాగా వేలాడారు గానీ, ప్రగతిని పల్లె మార్గం పట్టించడంపై మనస్సే పెట్టలేదు. జిల్లాలో రెండు జీవనదులు, చారిత్రక చెరువులు, వయ్యారాల వాగులు ఎన్నో ఉన్నా, వాటిని మలుపుకొని, పొలాలను తడుపుకునే తెలివైన నాయకత్వం కరువై ఆనాడు పాలమూరు కరువుకు నెలవై, కన్నీటికి నిలయమైంది. కానీ స్వరాష్ట్రంలో ఉమ్మడి పాలమూరుకు ప్రగతి తోరణం కట్టారు సీఎం కేసీఆర్. ఉద్యమకాలంలో ఈ జిల్లా జనాన్ని పోరుబాట పట్టించడంతో పాటు ఆనాడే ప్రగతి ప్రణాళికలు రచించి పెట్టుకున్నారు. అందువల్లనే స్వరాష్ట్రంలో, స్వల్పకాలంలో, ఉమ్మడి పాలమూరును వెలుగుపూల తొవ్వలో నడిపించగలిగారు.
చెప్పుకొని మురవడానికి తప్ప, చేతికిరాని భూములను చూసిన ఆనాటి తరం, నేడు ఎనిమిదేండ్లలో, ఆలంపూర్ నుంచి అమ్రాబాద్ దాక ఏమూలనైనా, వజ్రాల విలువకు తలదన్నే ఖరీదైనవిగా మారిపోయిన పొలాలను, స్థలాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడి గ్రామాలన్నీ గండాల నుంచి గట్టెక్కడం వెనక ఎనమిదేండ్లుగా కేసీఆర్ నడిపించిన ప్రగతిపోరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. త్వరలో ఎడారిగా మారబోతుందని భూ అధ్యయన శాస్త్రవేత్తల పరిశోధనల్లో అంచనా వేసిన ప్రాంతాలను పచ్చబడేటట్లు చేయడమే కాదు, రెండు పంటలను కడుపారాకనే పొలాలుగా మార్చివేసిన నాయకుడు కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఈ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందని దుస్థితి. కానీ నేడు దాదాపు 15 లక్షల ఎకరాలకు పైగా రెండు పంటలకూ పక్కాగా నీరందుతున్నది. ఎనిమిదేండ్ల కిందట పాడుబడ్డ బావులుగా మారిన ఈ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు వెతల, వెక్కిరింతల, శిథిల శిలాఫలకాలుగా దర్శనమిచ్చేవి. కానీ రైతు కేంద్రంగా నడుస్తున్న కేసీఆర్ ప్రభుత్వ దృఢసంకల్పం, పాలనా చర్యల వల్ల, స్వల్పకాలంలోనే చెరువులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల జలకేంద్రాలు నిండుకుండల్లా మారిపోయాయి. అవి ఇప్పుడు పొలాలకు నీరందించడమే కాదు, పర్యాటక ప్రదేశాలుగా మారిపోయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని లక్షలాది జనానికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు మునుపు కరువు జిల్లాలోని, జాతర్లలో జోరు కరువై, వెతికినా ఉత్సాహం కనపడకపోయేది. నేడు పంటల విప్లవం వల్ల స్వల్పకాలంలోనే జాతరలు సంబురాలై వర్ధిల్లుతున్నాయి. మన్యంకొండ, మల్దకల్, రాజాపురం, రంగాపురం, సింగోటం, జటప్రోలు జాతరలు రైతు సంబురాలుగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ నిరంతర శ్రమ వల్లనే శ్రమజీవుల జిల్లా నేడు సంపద సృష్టించే స్థాయికి చేరుకున్నది.
వివక్ష విషం నింపుకొన్న సమైక్యాంధ్ర సీఎంలు పడావు పడేసిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పరుగులు పెట్టించి పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచి, కొత్త లిఫ్టులూ నిర్మించి, ఆయకట్టు లక్ష్యాన్ని రెండింతలు, మూడింతలు పెంచింది. దీనివల్లే రాష్ట్ర ఆవిర్భావం నాటికి 13 వేల ఎకరాలకు ఒక్క పంటకూ నీరందించలేని కల్వకుర్తి ఎత్తపోతల కింద నేడు 3.50 లక్షల ఎకరాలకు, రెండు పంటలకూ నీరు పారుతున్నది. 2,300 ఎకరాలకు మాత్రమే నీరందే నెట్టంపాడు లిఫ్ట్ క్రింద నేడు 2 లక్షల ఎకరాలకు పైగా నూతనంగా సాగవుతున్నది. గతంలో పంటకాలమంతా కొట్లాటలతో సాగే ఆర్డీఎస్ కింద నేడు 50 వేలకు పైగా ఎకరాలకు రెండు పంటలకు సరిపడ సాగునీరందుతున్నది. భీమా ఎత్తిపోతల పెండింగ్ పనుల పూర్తి వల్ల 2 లక్షల 2 వేల ఎకరాలు, కోయిల్సాగర్ను సరిదిద్దడం వల్ల మరో 50 వేల ఎకరాల పొలాలకు రెండు పంటలకూ సాగునీరు సమకూరింది. 64 వాగులపై దాదాపు 500 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించడం వల్ల, ఒక్క వనపర్తి జిల్లాలోనే నూతనంగా లక్షా 90 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. తుమ్మిళ్ళ లిఫ్ట్ పూర్తి కావడంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకం మరికొన్ని కొత్త సాగునీటి ప్రాజెక్టులు సర్వేలు పూర్తయి, పనులు నడుస్తున్నాయి. మిషన్ కాకతీయతో వందలాది గొలుసుకట్టు చెరువులు జలశోభను సంతరించుకున్నాయి. రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత కరెంట్ లాంటి గొప్ప, చారిత్రక రైతు సంక్షేమ పథకాలతో పాలమూరు రైతన్నల వెతలు తీర్చారు కేసీఆర్.
ఇవేకాదు సీఎం కేసీఆర్ చేసిన పాలన వికేంద్రీకరణ కూడా నిరక్షరాస్యత, పేదరికం అంటించిన అమాయకత్వంలో బతికే పాలమూరు జనానికి పెద్ద వరంలా మారింది. దరఖాస్తులు పట్టుకొని దళారుల చుట్టూ తిరుగుతూ, కనిపించినోళ్ళందరి కాళ్ళు మొక్కే దీనత్వాన్ని నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు దూరం చేసింది. యాడుంటాడో, ఎప్పు డు వస్తాడో, ఎట్లా కలవాల్నో ఎరుగని కలెక్టరే అడుగు దూరం లో, అందుబాటులోకి రావడంతో పాలమూరు ప్రజల పాదాల దగ్గరికి పాలనా వ్యవస్థ వచ్చి చేరింది. దళారుల దందాలు, దరఖాస్తుల లైన్లకు తావు లేకుండా చేశారు కేసీఆర్.
కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో పాలమూరు పచ్చబడటమే కాదు పర్యాటక కేంద్రంగా మారింది. దాదాపు 100 కోట్లతో నల్లమలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎకోటూరిజం అభివృద్ధి వల్ల సోమశిల అందాలు కనులారవిందమై, ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి. అంబలి కేంద్రాలు వర్ధిల్లినచోట, అన్నపురాశుల పంట, సగానికిపైగా జనం వలసపోయే జిల్లా రాతమారి, ఇతర రాష్ర్టాల వలస కూలీలకు ఉపాధి కల్పించే కేంద్రమవ్వటం పాలనా శాస్త్ర చరిత్రలో అధ్యయనాంశంగా నిలుస్తుంది. నిప్పుల దారిలో నడుచుకుంటూ ఎదిగొచ్చిన ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ కడుపులో అగ్గి ఉంది కాబట్టే, తరాల కరువును తరిమేయాలనే ఆర్తితో తండ్లాడబట్టే, కష్టసాధ్యమైన లక్ష్యాలనూ సాధిస్తూ, ప్రజలకు ప్రగతిని అనుభవంలోకి తేగలిగారు. పాలమూరు పల్లెలు ఈ మేలు ఎన్నటికీ మరువవు. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాలను టీఆర్ఎస్కు ఇచ్చిన ఉమ్మడి పాలమూరు ప్రజలు ఈసారి పద్నాలుగింటినీ కేసీఆర్ చేతికి అందించడం ఖాయం. ఆ చైతన్య స్ఫూర్తితోనే రేపు పాలమూరుకు రానున్న కేసీఆర్కు జనం నీరాజనం పట్టనున్నారు.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242