అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు అనుమతులను ఫాస్ట్ట్రాక్లో అందించే పేరుతో నిబంధనలను మార్చనున్న ఈ బిల్లు వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఈ వివాదాస్పద బిల్లుకు సంబంధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో అటవీయేతర కార్యకలాపాలు జరుపకుండా అటవీ సంరక్షణ చట్టం-1980 నిషేధిస్తుంది. ఈ చట్టం లో మార్పులను తాజా బిల్లు ప్రతిపాదిస్తున్నది. అటవీ ప్రాంతానికి చట్టం ఇస్తున్న నిర్వచనంలో మార్పు తేవటం ద్వారా, కొన్ని ప్రాజెక్టులకు చట్టం నుంచి మినహాయింపును ఇవ్వటం ద్వారా ఈ మార్పులను బిల్లు ప్రతిపాదిస్తున్నది. దీనిపై 19 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జేపీసీ అధ్యయనం చేయనుంది. అయితే, ఈ బిల్లు వల్ల అటవీ సంరక్షణ చట్టం బలహీనపడుతుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మొత్తమ్మీద అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చే కేంద్రం ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది.
అటవీ ప్రాంతాన్ని అటవీయేతర పనుల కోసం వాడుకోవటంపై ‘అటవీ సంరక్షణ చ ట్టం-1980’ ఆంక్షలను విధించింది. 1927 నాటి భారత అటవీ చట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవులకు 1996 వరకూ ఈ చట్టం వర్తించింది. కానీ, ఆ ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు టీఎన్ గోదవర్మన్ కేసులో తీర్పునిస్తూ.. నిఘంటు అర్థం ప్రకారం అడవుల ను పోలి ఉండే అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా, ఏ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటికైనా ఇది వర్తిస్తుందని తెలిపింది.
అటవీ ప్రాంతాలను ఉపయోగించుకునే ఏ ప్రాజెక్టుకైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, తాజాగా తీసుకొచ్చిన బిల్లు అటవీ చట్టం వర్తింపుపై ఉన్న ‘అస్పష్టతలను’ తొలగించి, 1996కు ముందున్న స్థితిని తీసుకొస్తుందని చెబుతున్నారు. 25 అక్టోబర్ 1980 తర్వాత రికార్డయిన డీమ్డ్ అడవులకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని అంటున్నారు. డీమ్డ్ అటవీ ప్రాంతాల్లో భూ వినియోగం, అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులను సుప్రీంకోర్టు తీర్పు నియంత్రిస్తున్నందున చట్టంలో మార్పులు అవసరం అవుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. కానీ, పర్యావరణ నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది.
ఈ బిల్లు తీసుకొచ్చే మార్పులు విఘాతంగా మారుతాయని, ముఖ్యంగా 1850ల నుంచి 1970ల వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన అడవుల విషయంలో ఈ ప్రమాదం ఉందని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ అనే మేధోసంస్థకు చెందిన దేబదిత్యో సిన్హా తెలిపారు. సరైన విధంగా సరిహద్దులను నిర్ణయించకపోవటం వల్ల, అవినీతి కారణంగా భారీ ఎత్తున అటవీ ప్రాంతాలు అటవీ చట్టం కింద నమోదు కాలేదని, ఈ నష్టాన్ని అక్కడితో నిలిపివేయటానికి, మరింత నష్టం జరుగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడిందని పేర్కొన్నారు.
తాజా బిల్లు ప్రకారం.. రైల్వే లైన్లు, రోడ్ల వెంబడి ఉండే అటవీ భూముల్లో 0.1 హెక్టార్ల వరకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభిస్తుంది. నియంత్రణ రేఖకు, వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల లోపు చేపట్టే ప్రాజెక్టులకు (ఉదాహరణకు రోడ్ల నిర్మాణం వంటి వాటికి) కూడా జాతీయ భద్రత కోణంలో మినహాయింపు ఉంటుంది. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు, క్యాంపులకు 10 హెక్టార్ల వరకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెక్టార్ల వరకు మినహాయింపు ఉంటుంది. అటవీయేతర భూముల్లో ఉన్న వృక్షాల తొలగింపునకు కూడా బిల్లు మార్గం సుగమం చేస్తుంది.
బిల్లును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ ఎంపీ, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులపై ఏర్పాటైన స్థాయీసంఘం’ చైర్మన్ జైరాం రమేశ్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్కు ఒక లేఖ రాశారు. ‘ఈ బిల్లు పూర్తిగా మా స్థాయీ సంఘం పరిధిలోకి వచ్చే అంశం. ఈ బిల్లును సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి సమగ్రంగా, అన్ని కోణాల్లో పరిశీలించే వాళ్లం. కానీ, కావాలనే మాకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం బిల్లును జేపీసీకి సిఫార్సు చేసింది. ప్రతిపక్ష సభ్యులే లేని జేపీసీ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు’ అంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తేనున్న బిల్లుతో అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి పార్లమెంటు సమావేశాల తొలివారంలోపు జేపీసీ తన నివేదికను సమర్పించాలని గడువు విధించారు. అప్పటికి ఈ అంశంపై మరింత రగడ నెలకొనే అవకాశమే కనిపిస్తున్నది.
(ది ప్రింట్ సౌజన్యంతో) సిమ్రిన్ సిరుర్