ఐదు రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే ప్రధానంగా మూడురకాల తీర్పులు వచ్చాయి. ఉత్తరాది, హిందీ రాష్ర్టాల్లో మూడు చోట్ల బీజేపీ విజయం సాధిస్తే నాలుగోదైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి చేరువైంది. ఆఖరున వెలువడ్డ మిజోరం ఎన్నికల ఫలితాల్లో పూర్తి భిన్నమైన ధోరణి కనిపించడం గమనార్హం. అయితే నువ్వు, కాకపోతే నేను అనే తరహాలో సాగిన కాంగ్రెస్-ఎంఎన్ఎఫ్ ఆధిపత్యానికి మిజో ప్రజలు గండికొట్టారు. ఢిల్లీ పెత్తనాలకు దూరంగా, పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పరిపాలన సాగిస్తామని, ఎన్డీయే, ఇండియా కూటముల్లో దేనిలోనూ చేరబోమని విస్పష్టంగా ప్రకటించిన కొత్తగా ఏర్పడిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పీఎం) స్థిరమైన మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పాలక ఎంఎన్ఎఫ్ పది స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి జోరాంతంగా ఓడిపోవడం ఆ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతకు అద్దం పడుతున్నది.
జాతీయ పార్టీలుగా చెలామణి అయ్యే కాంగ్రెస్, బీజేపీలను మిజో ఓటర్లు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం చేసి పక్కనబెట్టారు. హంగ్ ఏర్పడుతుందన్న అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 40 స్థానాలు గల మిజో శాసనసభలో జడ్పీఎంకు 27 స్థానాలు లభించడం విశేషం. జడ్పీఎం స్వచ్ఛమైన, స్వతంత్ర ప్రతిపత్తి పరిపాలన అందిస్తామనే హామీతో ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. మిజో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుతూ జడ్పీఎం సంస్థ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించింది. తర్వాత ఆ సంస్థ తన లక్ష్యాల సాధనకు రాజకీయాల్లోకి ప్రవేశించి గత ఎన్నికల్లో పోటీ చేసి పిడికెడు స్థానాలతో సరిపెట్టుకున్నది. ఈసారి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది సభ్యునిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి లాల్దుహోమా ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. ముఖ్యమంత్రిగా ఆయనే పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
మిజో ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ మతం కార్డు ఉపయోగించి, బీజేపీ వ్యతిరేక ప్రచారంతో ఊదరగొట్టడం ఆ పార్టీ అవకాశవాదానికి పరాకాష్ఠ. మణిపూర్ అల్లర్లను సైతం తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూసింది. జడ్పీఎం, ఎంఎన్ఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీల అండదండలతో క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఓటర్లను బెదరగొట్టింది. కానీ మిజో ఓటర్లు ఈ ప్రచారాన్ని తిరస్కరించి ఒక్క సీటుకే పరిమితం చేశారు. హంగ్ ఏర్పడితే చక్రం తిప్పాలని 23 స్థానాల్లోనే పోటీ చేసిన బీజేపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. మిజో జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని చూసిన ఎంఎన్ఎఫ్ను గద్దె దించారు. రైతులకు మద్దతు ధర, యువతకు ఉపాధి, అవినీతి అంతం వంటి నినాదాలతో ముందుకువచ్చిన సరికొత్త పార్టీ జడ్పీఎంకు పట్టం గట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే మతాలు, ఉప జాతీయత వంటి సంకుచిత వాదాలతో వచ్చి, ప్రజల్లో ఆవేశకావేశాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన పార్టీలను తిరస్కరించి అభివృద్ధిని గద్దెనెక్కించడం మిజో ఓటర్ల విజ్ఞతకు నిదర్శనం.