2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000,రూ.500 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించి జనవరి2న 382 పేజీల తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును నలుగురు న్యాయమూర్తులు సమర్థించగా, జస్టిస్ బి.వి.నాగరత్న ఒక్కరే తప్పుబట్టారు. 4:1 మెజారిటీతో ఇచ్చిన ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకునే చట్టబద్ధమైన హక్కు కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు. కానీ, ఆ నిర్ణయాన్ని సమర్థించలేదు.
1934 నాటి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను కేంద్రం నిర్ణయం ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పెద్ద నోట్ల రద్దు చేపట్టాలంటే, ఆర్బీఐ సిఫార్సు ప్రభుత్వానికి తప్పనిసరని ఆర్బీఐ చట్టంలోని ఈ సెక్షన్ పేర్కొంటున్నదని జస్టిస్ బి.వి. నాగరత్న భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన నలుగురు న్యాయమూర్తులు ఈ కేసులో ఆర్బీఐ అభిప్రాయాన్ని కోరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యం నెరవేరిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి చట్టబద్ధమైన హక్కు వుందని సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం వల్ల కలిగిన ప్రభావం గురించి అస్సలు మాట్లాడలేదు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కలిగించే దేశ అసంఘటిత రంగం తీవ్ర విధ్వంసానికి గురైంది. చిన్న తరహా పారిశ్రామిక రంగం స్తంభించింది. కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతిన్నది. నల్లధనాన్ని వెలికి తీయడం, విదేశీ బ్యాంకుల నుంచి ఆ మొత్తాలను వెనక్కి రప్పించడం, నకిలీ కరెన్సీ సమస్యను తుదముట్టించడం, తీవ్రవాదానికి నిధులు అందకుండా చేయడం, అవినీతిని నిర్మూలించడం, ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణిని తగ్గించడమన్నవి ఈ వినాశకర నిర్ణయాన్ని సమర్థిస్తూ పేర్కొన్న లక్ష్యాలు. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నేటికీ నెరవేరకపోగా దీనికి విరుద్ధంగా పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రజల్లో చెలామణిలో ఉన్న 17.7 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ఇప్పుడు 30.88 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆర్బీఐనే చెప్పింది. అంటే 71.84 శాతం పెంపు నమోదైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి గల హక్కును మాత్రమే సమర్థించింది.
అంతేకానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పర్యవసానాలను ఏ రకంగానూ సమర్థించలేదు. సామాన్యుడి జీవితాన్ని అల్లకల్లోలం చేసిన మోదీ సర్కార్ నిర్ణయాల్లో ఒకటైన పెద్ద నోట్ల రద్దును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించినట్లుగా భావించలేము. సాంకేతికంగా మాత్రమే తప్పు పట్టలేమని చెప్పిన న్యాయస్థానం కేంద్ర ప్రజావ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేసింది. దేశానికి ఎనలేని దుస్థితిని, ఆర్థిక పతనాన్ని తెచ్చిపెట్టిన మితిమీరిన అధికార చర్యను సరిదిద్దలేమనే సుప్రీంకోర్టు నిస్సహాయతను ఈ తీర్పు ప్రతిబింబిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా లేదా అనే దానితో న్యాయస్థానానికి సంబంధం లేదని మెజార్టీ తీర్పు పేర్కొనడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఇటువంటి అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు జరుపాలంటే ఆర్బీఐ సిఫార్సు తప్పనిసరని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ను ఉటంకించారు. అంతేగాక, పార్లమెంట్ ఆమోదముద్ర పొందడం లేదా ఆర్డినెన్స్ జారీ చేయటం అవసరమని స్పష్టంగా పేర్కొన్నారు.
నగదు చెలామణి ఎక్కువగా ఉండే భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దాదాపు ఆరేండ్లయినా దాని ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోక పోగా, దాని ప్రభావం ఇంకా వీడనే లేదు. ఆన్లైన్ సేవలతో ఇప్పుడు అనేక సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే వంటి సంస్థలకు అప్పనంగా ఆదాయాన్ని కట్టబెట్టినట్లయింది. ఇకపోతే లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బ్యాంకులు ప్రజల లావాదేవీలపై ఆంక్షలు పెట్టి, వాటిని అధిగమించిన సందర్భాల్లో సర్ఛార్జీలు వేస్తున్నారు. కరోనాతో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా బ్యాంకుల తీరులో మార్పు రాలేదు. సామాన్యులు బ్యాంకుల వైపు వెళితే వాతలు తప్ప మరొకటి కనిపించడం లేదు.
నోట్ల రద్దు లక్ష్యాలు ఏమైనప్పటికీ, దానిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమయింది. భిన్నాభిప్రాయంతో వెలువడిన కీలక తీర్పుల్లో ఇది ఒకటిగా సుప్రీంకోర్టు చరిత్రలోనే నిలిచిపోతుంది. నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని అరికడతామనే బీజేపీ ప్రభుత్వ ప్రయత్నం ఓ పెద్ద ప్రహసనంగానే మిగిలిపోయింది.
నగదు చెలామణి ఎక్కువగా ఉండే భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దాదాపు ఆరేండ్లయినా దాని ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోక పోగా, దాని ప్రభావం ఇంకా వీడనే లేదు.
– నాదెండ్ల శ్రీనివాస్
9676407140