ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్శలు, దాడి మరింత ఎక్కువ అవుతాయి. మనసులను మలినం చేసి, తెలంగాణను దారి మళ్లించే ప్రయత్నాలు అన్ని వైపుల నుంచీ మరింత ఎక్కువవుతాయి. కాబట్టి ఆ విమర్శల్లోని వివేకాన్ని, చేసేవారి విలక్షణతను, నిజాయితీని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
కేసీఆరే కాకుంటే..-2
టీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా నరేంద్ర మోదీ, అమిత్ షా పదే పదే చేస్తున్న విమర్శ – వారసత్వ పార్టీ, కుటుంబ పార్టీ అని. ఈ విమర్శ చేస్తున్న మోదీ గానీ మరెవరైనా గానీ కేటీఆర్, హరీశ్ రావు అసమర్థులని అనగలరా? కాంగ్రెస్ మాదిరి గానో, తెలుగుదేశం మాదిరి గానో లేక మరో పార్టీ మాదిరి గానో కేసీఆర్ అసమర్థులను బలవంతంగా ప్రజలపై రుద్దటం లేదు. వారసులు సమర్థులైనప్పుడు వారసత్వం అనర్హత అవుతుందా? ఇదెక్కడి అసహజ న్యాయం? వారసుడు అసమర్థుడైనా బలవంతంగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తుంటే తప్పకుండా అలాంటి ప్రయత్నాన్ని ప్రజలే అడ్డుకుంటారు. తెలుగు రాష్ర్టాల్లోనే అందుకు ఉదాహరణ కళ్ల ముం దు కనిపిస్తోంది. కొంతమంది నేతలు తామే నెంబర్ 1, 2, 3 అన్నట్లుగా ఇతరులను సమర్థ నాయకులుగా తయారు చెయ్యరు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ అలా కాకుండా సమర్థులకు దారి ఇచ్చారు. అందుకు తెలంగాణ గర్విస్తున్నదే తప్ప సిగ్గు పడటం లేదు. సమర్థతతో ప్రజల మన్నన పొందుతుండటం తెలంగాణ వారసత్వ నాయకుల ప్రత్యేకత. అది తెలంగాణకు బలమే తప్ప బలహీనత కాదు.
ఇక రెండో ప్రధాన విమర్శ కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని. మొదట్లోనేమో కాళేశ్వరాన్ని మెచ్చుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారులు కూడా శభాష్ అని వెళ్లారు. అప్పుడు కాళేశ్వరంలో నీళ్లు చూశారు. ఇప్పుడు రాజకీయ అద్దాలు పెట్టుకొని కాళేశ్వరంలో బురద చూస్తున్నారు. నిజంగా కాళేశ్వరంలో అవినీతే జరిగి ఉంటే, కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంగా మార్చుకొని ఉంటే మోదీ సర్కారు ఇన్నాళ్లు వదిలిపెట్టేదా? ఏమీ లేకుండానే ఇంజినీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సేన నిజంగా అంత పెద్ద అవినీతి జరిగి ఉంటే, నిజంగా కాళేశ్వరం ఏటీఎం అయ్యుంటే కేసీఆర్ను విడిచిపెట్టేదా? ఇప్పటిదాకా ఆగేదా? కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు అని మోదీ చెప్పగలరా? అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. అయినా ఒకప్పుడు ఐటీ, ఈడీ దాడి చేస్తే ఏదో తప్పు చేశారు కాబట్టి దాడి చేస్తున్నారనుకునేవారు. కానీ ఇప్పుడు ఐటీ, ఈడీల దాడులనగానే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడా? బీజేపీలో చేరనంటున్నాడా? అని అంటున్నారు. ఐటీ, ఈడీ దాడులకున్న విలువను మోదీ ప్రభుత్వం దిగజార్చింది. ప్రతిదానికీ స్కామ్ అని పేరు పెట్టేసి ప్రచారం చేసి, బద్నాం చేయటమే తప్ప నిరూపించేదేమీ లేదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు స్కామ్ అంటే స్కామ్ అనుకుంటూ రాసేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. నిజంగా స్కామ్ జరిగే ఉంటే బీజేపీ ఇప్పటికే విడమరచి, అరటి పండు ఒలిచినట్లు చెవులకు రంగరించేది కాదా? అంతా బట్ట కాల్చి మీద పడేసే మోదీ మాడల్. అందరి మీదా అవినీతి బురద చల్లే మాడల్.
డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి అన్నట్లు మాట్లాడుతోంది బీజేపీ. మోదీ ఎక్కడికి పోయినా ఇదే మాట అంటుంటారు. తెలంగాణలోనూ ఈ ఏడాది ఇదే డబుల్ ఇంజిన్ మాట వినిపించడం ఖాయం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో ఏమవుతున్నదో అంతా చూస్తునే ఉన్నాం. సింగిల్ ఇంజిన్తోనే తెలంగాణ ఈ 9 ఏండ్లలో అద్భుతాలు సృష్టించింది. పనిచేసే సత్తా లేనప్పుడు, విజన్ లేనప్పుడు డబుల్ ఇంజిన్ ఉన్నా ఏం లాభం? ఉన్న ఇంజిన్ పని చేస్తుందా లేదా, చేస్తే ఎలా చేస్తుందనేది కీలకం. డబుల్ ఇంజిన్ ఉన్నా అభివృద్ధి లేక ట్రబుల్ ఎదుర్కొంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ సర్కారుకు కితాబు ఇవ్వాల్సిందే.
టీఆర్ఎస్పై బీజేపీ చేస్తున్న నాలుగో విమర్శ… ఇ తర పార్టీలను కూల్చి రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ అ వినీతికి పాల్పడుతోందనటం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చటానికి, తెలంగాణను అస్థిరపర్చటానికి తాము చేసిన ప్రయత్నాలకు ఈ వాదనను బీజేపీ నేతలు సమర్థనగా వాడుకుంటున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకోగా లేనిది మేం ప్రయత్నిస్తే తప్పేమిటన్నది వారి వాదన. నిజమే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకున్నది వాస్తవం. కానీ ఎందుకు చేర్చుకున్నారు? తెలంగాణ ప్రభుత్వ సుస్థిరత కోసం, తెలంగాణ సర్కారును మరింత బలోపేతం చేయటం కోసం. అంతేగానీ నాడు చంద్రబాబు, నేడు బీజేపీ మాదిరిగా ప్రభుత్వాన్ని కూల్చటానికో, తెలంగాణను అస్థిరపర్చటానికో కాదు. బీజేపీ నేతలు, మోదీ, అమిత్ షా నిజంగా బుద్ధిపూసలే అయితే మరి గుజరాత్లో చేసిందేంటి? 2017 ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు గదా! అంటే గుజరాత్లో తాము చేసింది నీతి అవుతుందా? ఇక్కడ కేసీఆర్ చేస్తే అవినీతి అవుతుందా?
ఏ పార్టీ అయినా అధికారం కోసం ప్రయత్నించటం సహజం. అందులో తప్పు లేదు. కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అంతే గానీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఎలా? కేంద్ర ప్రభుత్వ పెద్దలే బహిరంగంగా కుట్రలు చేస్తే ఎలా? బిడ్డల్ని సమ దృష్టితో చూస్తూ ఆదుకోవాల్సిన తల్లే వివక్ష చూపించి గొంతు పిసుకుతానంటే అలాంటి తల్లిని ఏమనాలి?
తెలంగాణలో బీజేపీ పుంజుకున్న మాట వాస్తవం. ఎంతగా అంటే కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని రోజూ ఆడిపోసుకునేంతగా. అంతేగానీ రాష్ర్టాన్ని ముందుకు నడిపించే విజన్ గానీ, బుర్ర గానీ కనిపించడం లేదు. బీజేపీ నేతల నోర్లు కేసీఆర్పై అరవటానికి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే ఉపయోగపడుతున్నాయి. తమ అధిష్ఠానం ముందు తోకలూపుతూ, తలాడిస్తూ, చెప్పులు మోస్తున్నారు. ఇలాంటి వారికి రాష్ర్టాన్ని అప్పగిస్తే ఏమవుతుంది? పక్క రాష్ర్టాలు ప్రధానమైన బీజేపీ అధిష్ఠానం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే ఈ నోరులేని నేతలకు అడ్డుకునే ధైర్యముందా? ఉంటుందా? మోదీ, అమిత్ షాను తప్పని నిలదీసే ధైర్యం వీరికి ఉందా? ఉంటుందా? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే రాజకీయ కుట్రలను ఆపే సత్తా, తెలివి, అప్రమత్తత వీరికుందా? ఉంటుందా? తెలంగాణ రాగానే కనీసం చెప్పనైనా చెప్పకుండా చంద్రబాబు కోసం ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపేసిన వారు మున్ముందు రాష్ట్ర ఉనికి, అస్తిత్వానికే ఎసరు పెట్టరని గ్యారంటీ ఏంటి? అప్పుడేంటి పరిస్థితి? ఈ చెప్పులు మోసే నేతలు రక్షిస్తారా? మంత్రిగానే అసైన్డ్ భూములు దండుకున్న వ్యక్తి, కేసులు, విచారణలను తప్పించుకోవడానికి బీజేపీలో చేరిన కామ్రేడ్ ఈటెల లాంటివారు బీజేపీ అధిష్ఠానాన్ని కాదని తెలంగాణను రక్షిస్తారా?
సింగిల్ ఇంజిన్తోనే తెలంగాణ ఈ 9 ఏండ్లలో అద్భుతాలు సృష్టించింది. పనిచేసే సత్తా లేనప్పుడు, విజన్ లేనప్పుడు డబుల్ ఇంజిన్ ఉన్నా ఏం లాభం? ఉన్న ఇంజిన్ పని చేస్తుందా లేదా, చేస్తే ఎలా చేస్తుందనేది కీలకం. డబుల్ ఇంజిన్ ఉన్నా అభివృద్ధి లేక ట్రబుల్ ఎదుర్కొంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ సర్కారుకు కితాబు ఇవ్వాల్సిందే.
ఒక్క సీటు కూడా గెలవని తమిళనాడు బీజేపీ నేతలకు ఇస్తున్న కనీస గౌరవం, మర్యాద కూడా నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ నేతలకు బీజేపీ అధిష్ఠానం ఇవ్వడం లేదంటే కారణమేంటో ప్రజలు ఆలోచించాలి. అడక్కుండానే చెప్పులు మోస్తున్న వారంటే ఎవ్వరికైనా అలుసే! ఇలాంటి బాంచెన్ దొర నేతలు ఇతరులను దొరలు, గడీలంటూ విమర్శిస్తుంటే ఏమనాలి? కేసీఆర్ అది చెయ్యలేదు… ఇది చెయ్యలేదని రోజూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టే తెలంగాణ బీజేపీ నేతలు రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏం తెస్తున్నారు?
అంబి, మీర్ జాఫర్ లాంటి ఇంటి దొంగల వల్లే దేశానికైనా, రాష్ర్టానికైనా కీడు, చేటు అనేది చరిత్ర చెబుతున్న సత్యం! కాబట్టి తెలంగాణమా… ఆధునిక అంబి, మీర్ జాఫర్లు నోరు పెట్టుకొని బురద జల్లేందుకు వస్తున్నారు. మన బుర్రల్ని మలినం చేసేందుకు వస్తున్నారు. తెలంగాణను కూల్చేందుకు వస్తున్నారు. కేసీఆర్లాగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. తెలంగాణమా పారాహుషార్!
!!సమాప్తం!!
కమల