అన్నిసార్లూ ఆసక్తి కలిగించే ఉపోద్ఘాతమేమీ అక్కర్లేదు.. చెప్పడానికి! విషయం విస్పష్టంగా ఉన్నప్పుడు మూడు ముక్కల్లోనూ ముచ్చటించవచ్చు. అందువల్ల కథలు, కాకరకాయల జోలికిపోకుండా ఈసారి సూటిగా, సుత్తి లేకుండా కొన్ని విషయాలు చెప్తా. మనుషుల మీద, అందునా నాయకుల మీద ముద్రలు ఎట్ల పడతయో, అవి అచిరకాలం ఎట్ల నిలుస్తయో ఒకేరకం పనికి వేర్వేరు భాష్యాలు ఎట్ల వెలువడుతయో… వీటన్నింటికీ అతీతంగా నిజం మౌనంగా ఎట్ల మసలుతుంటదో కొన్ని సాదృశాలు! ప్రశ్నలకు జవాబు చెప్పనక్కర్లేదు. సత్యాన్ని గుర్తించి, సంగతి తెలుసుకుంటే చాలు! ‘అవును; నిజమే కదా’ అనుకుంటే అదే పదివేలు! మరి ఆలోచిద్దామా?
రైతు సంఘాలు వద్దు వద్దంటున్నా 2020లో మోదీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు తెచ్చింది. రైతులు రోడ్డెక్కారు. ఏడాదికి పైగా చిక్కని చలిలో, ఎర్రని ఎండలో రోడ్డు మీదే బతికారు. 750 మంది వరకు చనిపోయారు. చివరికి యూపీ లో ఎన్నికలు వచ్చి, అక్కడ రైతుల మద్దతు తప్పనిసరి అని గుర్తించాక గానీ మోదీ, క్షమాపణ చెప్పి చట్టాలను ఉపసంహరించుకోలేదు. అప్పుడిచ్చిన హామీలను అమలుపర్చారా? అంటే ఇప్పటికీ లేదు.
కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలుచేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ముసాయిదా ప్రకటించింది. దీనిపై విలీన గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కేవలం 45 రోజుల పాటు ఆందోళనలు సాగాయి. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కొన్ని గంటల్లోనే ప్రభుత్వం దాన్ని ఆమోదించింది.
మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఎనిమిదేండ్ల తర్వాత ఫలితం ఏమిటి? దేశంలో తయారీ పరిశ్రమ దిగజారింది. అనేక ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విచిత్రమేమంటే ఏ చైనాను లక్ష్యంగా చేసుకొని మేకిన్ ఇండియా ప్రారంభించామో, ఆ చైనా నుంచి దిగుమతులు మరింతగా పెరిగాయి!
బీదసాదలకు మెరుగైన కంటి చూపు కోసం 2018 ఆగస్టు 15న కేసీఆర్ తెలంగాణలో కంటి వెలుగును ప్రారంభించారు. 38 లక్షల మందికి పరీక్షలు చేసి 23,43,643 మందికి కళ్లద్దాలు ఇచ్చారు. అయితే ఆ అద్దాలన్నీ చైనాలో తయారై వచ్చినవే. నాలుగేండ్ల తర్వాత రెండో దశ కంటి వెలుగు అవసరమవుతుందని కేసీఆర్ అప్పుడే ఊహించారు. కళ్లద్దాలు మనం తయారు చేసుకోలేమా? అనుకున్నారు. పటాన్చెర్వులో కళ్లద్దాల ఫ్యాక్టరీ పెట్టారు. ఇప్పుడు కంటివెలుగు కింద ఇస్తున్న అద్దాల్లో సగం మన పటాన్చెర్వులో తయారైనవే! చైనావి కావు!
యుగానికొక్కడుగా అవతరించే పెద్దాయన తెలుగు ప్రదేశంలో ఒకరున్నారు. తాను పుట్టడానికి 400 ఏండ్ల ముందునుంచే ఉన్న హైదరాబాద్ను, తానే పుట్టించి, గోడలు కట్టించి, మెరుగులు పెట్టించి అభివృద్ధి చేశానని చెప్పుకునే సమర్థుడాయన. హైదరాబాద్కు పశ్చిమం దిక్కున ఆయనొక పది అంతస్తుల బిల్డింగ్ కట్టారు. దానికి సైబర్ టవర్స్, హైటెక్సిటీ అని పేరు పెట్టారు. ఇంకేం, హైదరాబాద్కు దీటుగా, పోటీగా ఆయన సైబరాబాద్ను సృష్టించారని వందిమాగధులు దుమ్ము రేగ్గొట్టారు (బాహుబలి గ్రాఫిక్స్ తప్ప అమరావతిలో ఎందుకు ఏమీ చేయలేకపోయారన్నది భేతాళ ప్రశ్న). ఏండ్ల తరబడి ఏలిన ఆయన ఏడు ఫ్లై ఓవర్లు కడితే, హైదరాబాద్ ఫ్లై ఓవర్ సిటీ అయిపోయిందని తోడు పెండ్లి కొడుకులు కోడై కూశారు.
కేవలం ఎనిమిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్లో కట్టిన ఫ్లై ఓవర్లు 18. మరో అయిదు నిర్మాణంలో ఉన్నాయి. అంటే 23. ఇక లింకురోడ్లు, అండర్పాసులు, స్కై వేలకు లేక్కే లేదు. అప్పట్లాగా ఒక్క బిల్డింగ్ కాదు; కేవలం ఎనిమిదేండ్లలో పశ్చిమం వైపు హైదరాబాద్ దాదాపు 25 కిలోమీటర్లు పెరిగింది. పది అంతస్తులు కాదు; 40-50 అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఐదారేండ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన వారు ఇది హైదరాబాదేనా, లేక అమెరికానా? అని ఆశ్చర్యపోతున్నారు.
‘బాబు బాగా బిజీ’ ఇది ఎఫ్ఎం రేడియో వాయిస్ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ‘తెలుగు’ పత్రికల్లో కనిపించే బ్యానర్ హెడ్డింగ్. ఆయన ఫ్రంట్ కట్టినప్పుడు, వాళ్లను వీళ్లను కలిసినప్పుడు సహజంగా వచ్చే మరో హెడ్డింగ్.. ‘చక్రం తిప్పిన బాబు!’ వీటితో పాటు, ‘ప్రధాని పదవి రేసులో బాబు. అందరూ బతిమిలాడుతున్నారు. కానీ తెలుగు ప్రజల ప్రేమను వదులుకోలేక, ఇక్కడి అభివృద్ధిని త్యాగం చేయలేక వెళ్లడం లేదు’ అనేది మరో సహజ వార్త. వారెవరెవరిని ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసిందీ పిట్ట కథలు కోకొల్లలు!
గ్రహచారం వికటించి తెలుగు ప్రజలే ఆయనపై ప్రేమను త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల ప్రేమతో కేసీఆర్ సీఎం అయ్యారు. ఎనిమిదేండ్లలో తెలంగాణను కేసీఆర్ చాలా అభివృద్ధి చేశారని బాబు, ఆయన అంతేవాసులు అంగీకరిస్తున్న మాట. తెలంగాణ మాడల్ను దేశవ్యాప్తం చేస్తానని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు. ఆయన సభ పెడితే ముగ్గురు సీఎంలు వచ్చారు. ‘నన్ను పిలవలేదు కనుక పోలేదు, కానీ విపక్ష ఐక్యతకు కట్టుబడి ఉన్నా’ అని బీహార్ సీఎం నితీశ్కుమార్ అన్నారు. 40 ఏండ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్న నితీశ్, కేసీఆర్ పెద్ద మనుషులు. నితీశ్ను కేసీఆర్ స్వయంగా వెళ్లి కలిశారు. కలిసి పనిచేద్దామనుకున్నారు. ఎవరిని ఎప్పుడు పిలవాలన్నది రాజకీయ వ్యూహం. కానీ నితీశ్ రాకపోవడంతో విపక్ష ఐక్యత విచ్ఛిన్నమైనట్టు కనిపించింది కొందరికి!
విజన్ 2020 ఉన్న ఏకైక నాయకుడు, అనితర సాధ్యుడు, అత్యంత సమర్థుడైన నాయకుడు, మానవజాతి చరిత్రలో తెలుగు నేలపై ఒకేఒకరు పుట్టారు. ఇన్ని విశేషణాలు చెప్పిన తర్వాత ఇక పేరు అక్కర్లేదు. వారు పుష్కరాలు నిర్వహిస్తే, వేలమంది హాజరై తొక్కిసలాట జరుగుతుంది. 35 మంది చనిపోతారు. వారు వందల మందితో కందుకూరులో రోడ్ షో నిర్వహిస్తే 8 మంది ప్రాణాలు కోల్పోతారు. తర్వాత రెండు రోజులకే కానుకల పంపిణీలో మరో ముగ్గురు పోతారు. అయినా తప్పు వారిదంటే మన తప్పవుతుంది. వారి నిర్వహణ దక్షతను తప్పుబట్టలేం. పోయిన వాడికి ఆయుష్షు లేదంతే!
తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా ఈ 21 ఏండ్లలో కేసీఆర్ వందల సభలు నిర్వహించారు. 2001 మేలో కరీంనగర్లో జరిపిన సింహగర్జన సభ మొదలుకొని, వరంగల్లో, హైదరాబాద్లో, కొంగరకలాన్లో.. అలా ఎన్నో! ఒక్కో సభకు లక్షల జనం. కరీంనగర్ సభకు 2.5 లక్షలమంది హాజరైతే, వరంగల్లో… 20 లక్షలపైనే. మొన్నటికి మొన్న ఖమ్మంలో దాదాపు 5 లక్షలు! కానీ ఎక్కడా పెద్ద ప్రమాదం లేదు. పకడ్బందీగా ఏర్పాట్లు. జాతీయపార్టీ నేతలు, ముఖ్యమంత్రులు ఎందరు హాజరైనా వచ్చినవాళ్లు వచ్చినట్టు క్షేమంగా ఇంటికి!
4 రోజులుగా ఢిల్లీలో మహిళా రెజ్లర్లు (కుస్తీ ఆటగాళ్లు) రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. ఎందుకు? రెజ్లర్ల జాతీయ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని! ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ. ఇలాంటి ఆరోపణ రాగానే ఆయనైనా రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వమైనా తొలగించాలి. మరి జరుగుతున్నదేమిటి? ‘నేను రాజీనామా చేసే సమ స్యే లేదు. ఏం హిక్కుంటారో హిక్కోండి!’ అని ఆయ న కుస్తీమే సవాల్ అంటున్నారు. ఇదే కాదు; రైతుల మీదికి కారెక్కించి చంపిన మంత్రి కుమారుడిపై ఏ చర్యా ఉండదు. విద్వేష వ్యాఖ్యల నేతల కట్టడి ఉండ దు. కర్ణాటకలో 40 పర్సెంట్ అవినీతిపరులపై యాక్ష న్ ఉండదు. కాల్డేటా సాక్షిగా అడ్డంగా దొరికిపోయి న వారిపైనా చర్యలుండవు. పైగా ఒక పెద్దమనిషైతే చాలా సంతోషంగా దర్యాప్తును తప్పించుకొని, ఉల్టా ఆరోపణలు చేసినవారే తనకు జవాబివ్వాలని ఎదురు దబాయిస్తాడు.
మరి ఇటువైపు! గిట్టని పార్టీల నేతలకు పుంఖాను పుంఖాలుగా ఈడీ, ఐటీ, సీబీఐ నోటీసులు వస్తున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతకు నోటీసులిస్తే సీబీఐ అధికారులను ఇంటికి పిలిచి, కాఫీ ఇచ్చి, అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చి సాగనంపారు. తెలంగా ణ మంత్రులు, ఎంపీలైతే ముందే జవాబులు సిద్ధం గా పెట్టుకున్నారు. ఢిల్లీకి కూడా వెళ్లి వివరణలు ఇస్తున్నారు. బీజేపీ ముఖ్యులు పోలీసుల ముందుకురావడానికి భయపడి కోర్టులు, పిటిషన్లు, విచారణలు, వాయిదాల ముసుగులో దాక్కుంటే, టీఆర్ఎస్ నేత లు బాజాప్తా హాజరవుతున్నారు.
చంద్రబాబు 2017లో వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిపారు. 665 ఎంవోయూలు కుదిరాయ ని, రూ.10.5 ట్రిలియన్ పెట్టుబడులు రానున్నాయని ప్రకటించారు. పత్రికలు ఆహా..ఓహో.. సరేసరి! ఆ పెట్టుబడులన్నీ వచ్చి ఉంటే, వాటిని ఎక్కడ పెట్టాలో తెల్వక ఏపీ ఏమయ్యేదో! ఏమీ కాలేదంటే ఏమీ రానట్టేగా! అక్కడికి వచ్చింది పారిశ్రామికవేత్తలే కాదనీ, పలాసలో జీడిపప్పు అమ్ముకునే ఒకాయనకు, నర్సరావుపేటలో కమీషన్ తీసుకుని ఇంజినీరింగ్ సీట్లిప్పిచ్చే ఇంకొకాయనకు, చిన్న రియల్ఎస్టేట్ వ్యాపారులకు సూటూ బూటూ వేసి ఎంవోయూల నాటకమాడారని వైసీపీ వాళ్లు తర్వాత బయటపెట్టారు.. ఫొటోలతో సహా!
ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు 47 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని ప్రతి అతిపెద్ద ఐటీ కంపెనీ సెకండ్ క్యాంపస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. కేసీఆర్ అమలుచేస్తున్న టీఎస్ ఐపాస్ వంటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, ఇన్ఫ్రా చూసి కంపెనీలు వాటంతటవే తెలంగాణకు వస్తున్నాయి.. కిటెక్స్లాగా! కేటీఆర్ హైదరాబాద్కు తెస్తున్న కంపెనీలను చూసి ఇతర రాష్ర్టాలు నివ్వెరపోతున్నాయి. దావోస్లో మూడు రోజుల్లో వచ్చిన పెట్టుబడులు 36 వేల కోట్ల పైనే. ఇవి జీడిపప్పు వ్యాపారుల సంతకాలు కాదు; ఆయా కంపెనీల అధినేతలు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రకటించినవి. అమెరికాలో మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలోనూ ఆ కంపెనీ నుంచి కేటీఆర్ 16 వేల కోట్ల పెట్టుబడి తేగలిగారు. మన ఐటీ ఇప్పుడు హైదరాబాద్ను దాటి పట్టణాలకు చేరుతున్నది. రాష్ట్రమంతా 24 గంటల పాటు యంత్రాల మరలు తిరుగుతున్నయి. ఒప్పందాలు, శంకుస్థాపనలు పాత మాట. ఇప్పుడన్నీ ఓపెనింగులే! హైదరాబాదేం ఖాళీ కాలేదు. సరికదా.. ఐటీలో, ఎగుమతుల్లో, ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్లో, స్టార్టప్స్లో బెంగళూరుతో పోటీపడుతున్నది.
1956లో ఏపీ ఏర్పడేనాటికే నల్గొండలో ఫ్లోరోసిస్ తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఏ సమస్యనూ పట్టించుకోనట్టే, వలస పాలకులు దీన్నీ పట్టించుకోలేదు. 2003 మార్చి 12న జలసాధన సమితి వాళ్లు ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని ప్రధాని వాజపేయి ముందు టేబుల్పై పండుకోబెట్టారు. ‘అయ్యా ఇదీ మా గతి. మంచినీళ్లిచ్చి ఆదుకోండి’ అని వేడుకున్నారు. వాజపేయి సరే అన్నారు. తర్వాతేమీ జరగలే దు. మోదీ సర్కారు వచ్చి 2016లో ఫ్లోరైడ్ దవాఖానకు, రీసెర్చ్ సెంటర్కు హామీ ఇచ్చినా నెరవేర్చలేదు.
తెలంగాణ వస్తే ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తానని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించి సమస్యను పరిష్కరించారు. గత ఏడేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 2015కు పూర్వం తెలంగాణలో 967 ఫ్లోరైడ్ ఆవాస ప్రాంతాలుండగా 2020 ఆగస్టు 1 నాటికి వాటి సంఖ్య సున్నా అయినట్టు కేంద్రమే చెప్పింది.
తండ్రి తంతెల మీదైతే కొడుకు కోనేట్ల అని ఒక సామెత ఉంది. రాష్ట్రంలో పేరుమోసిన బీజేపీ నాయకుడి కుమారుడు తాను చదువుకునే కాలేజీ లో దాదాగిరీ చేశారు. అది వీడియోలో రికార్డయిం ది. పోలీసులు కేసు పెట్టారు. తండ్రిగారేమన్నారు? ‘పిల్లలన్నాక కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. కలిసిపోతారు. ఆ మాత్రం దానికే కేసులా? కేసులు పెట్టి భవిష్యత్తు ఖరాబు చేస్తారా? ఎప్పుడో ఐదు నెలల క్రితం జరిగినదానికి ఇప్పుడు కేసులేమిటి? ఈ లొల్లేమిటి? ఏమైనా ఉంటే నాతో తేల్చుకోవాలి. నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?’ అని ఆయన కండ్లలో నీటి పొర కనిపిస్తుండగా నిజాలు చెప్పారు.
ప్రాంతం మీద ప్రేమతో కేసీఆర్ ఉద్యమం చేసి, తెలంగాణ తెచ్చి, ప్రజలిచ్చిన అధికారంతో అభివృద్ధి చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఆయనతో తేల్చుకోక ఆయన పిల్లలపై అసభ్య, దుర్మార్గ ప్రచారం ఏమి టి? సరే వాళ్లూ రాజకీయాల్లో ఉన్నారని సరిపెట్టుకుందాం! దేశమన్నాక అనేక మతాల వాళ్లుంటారు. ఆవేశంలో అప్పుడప్పుడు కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. మళ్లీ కలిసిపోతారు. మన అధికారం కోసం వాళ్లను రాజకీయాల్లోకి లాగడమేమిటి? మతాన్ని మధ్యలోకి గుంజి దేశం భవిష్యత్తును ఖరాబు చేస్తా రా? అయినా అప్పుడెప్పుడో దశాబ్దాలు, శతాబ్దాల కిందట జరిగిన దానిగురించి ఇప్పుడు పగ లు, ప్రతీకారాలు, కూల్చివేతలు, తవ్వడాలు ఏమిటి?
ఇట్లా ప్రశ్నలు రాసుకుంటూ పోతే పేజీలు చాలవు. నా వాదనంతా మన ఆలోచనావిధానం మారాలని మాత్రమే! బాబు జాతీయ రాజకీయాలు చేస్తే చక్రం తిప్పినట్టు… బహిరంగ సభకు ఒక సీఎం రాకపోతే కేసీఆర్ ఫెయిలయినట్టా? 200 రూపాయల పింఛన్ ఇచ్చిన వైఎస్ దేవుడైతే మరి 2000 పింఛన్ ఇచ్చే కేసీఆర్ ఏం కావాలి? ప్రాజెక్టులు కట్టకుండా కాల్వలు తవ్వడమే జలయజ్ఞమైతే, అనేక అతి భారీ రిజర్వాయర్లు కట్టడాన్ని ఏ యజ్ఞమనాలి? మూడుసార్లు గడువు పెంచి నా పోలవరం కట్టలేని కేంద్రం సమర్థురాలైతే, మూడేండ్లలో కాళేశ్వరం కట్టిన కేసీఆర్ని ఏమ ని ప్రశంసించాలి?
ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభు త్వం చేసిన అద్భుతమైతే, మరి జిల్లాకో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, జ్వర సర్వేలు, కంటి వెలుగులు ఇస్తున్న తెలంగాణ సర్కారును ఏమని పొగడాలి? ప్రహరీలు మాత్రమే కట్టిన జన్మభూమి గొప్ప పథకమైతే, సర్వతోముఖాభివృద్ధి సాధించే పల్లె/ పట్టణ ప్రగతిని ఏమని వర్ణించాలి? అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు గొప్ప పాలకుడైతే, మరి వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి జీతాలు పెంచిన కేసీఆర్ ఏమవ్వాలి? వ్యవసాయం దండుగని, రైతులపై కాల్పులు జరిపిన వారు విజనరీ అయితే, వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ను ఏమని పిలవాలి?
పెంచిన వేతనాన్ని ఆదాయపన్ను రూపంలో తీసుకునే కేంద్రం పాలన గొప్పదైతే, దేశంలోనే ఎక్కడా లేనంతగా జీతా లు పెంచిన గొప్ప మనసును ఎలా కొనియాడాలి? తెలంగాణలో జీతాలు లేటవడమే పరిపాలనా వైఫల్యమైతే, యూపీలో నెలల తరబడి జీతాలు ఇవ్వలేకపోవడాన్ని ఏమనాలి? కరెంటు మోటార్లకు మీటర్ల నిబంధన అబద్ధమన్నప్పుడు, ఉత్తరప్రదేశ్ రైతులు మీటర్లనెందుకు బద్దలు కొడుతున్నారో చెప్పాలి కదా! ‘2022 వరకు’ అని గడువుపెట్టి మరీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వారు ఘన పాలకులా? లేక ఇవ్వని హామీలను సైతం అమలుచేసిన వారా? పార్లమెంటుకు రాకుండా, ఎంపీలను కలవకుండా, ఎనిమిదేండ్లలో ఒక్కసారీ మీడి యా సమావేశం పెట్టకుండా ఉన్నవారు ప్రజాస్వామిక వాదులా?
ఇప్పటికే పదుల సంఖ్య లో విలేకరుల సమావేశాలు జరిపి, రోజులో 16 గంటలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో గడుపుతూ, శుభాశుభాలకూ కలిసి భరోసానిచ్చే కేసీఆర్ ప్రజాస్వామ్యవాదా? జాతి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటైజేషన్ ఆర్థిక సంస్కరణ అయితే, మరి జాతి సంపదను పెంచి జాతికి పంచే నేషనలైజేషన్ను ఏమని అభివర్ణించాలి? వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదంటూ లక్షల కోట్ల ప్రజల ఆస్తిని వ్యాపారులకు అప్పజెప్పడం బీజేపీ సుపరిపాలన అయితే, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రజల కోసమే కాపాడుతానని కేసీఆర్ చెప్పడం దుష్పరిపాలన అవుతుందా? పేదలకిచ్చే సంక్షేమ పథకాలు అనుచితమైతే, కార్పొరేట్ల రుణాల రద్దు ఉచితమవుతుందా? మతం వ్యక్తిగతం అనుకోవడం మంచిదా? ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం మంచిదా? చుట్టూ పది కెమెరాలు పెట్టుకొని గుడికి, దేవుడికి మొక్కడం దైవభక్తి అయితే, చరిత్రాత్మక శిలాలయం నిర్మించి, సభక్తికంగా యజ్ఞయాగాదులు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం నేరమవుతుందా? మోదీ కొత్త పార్లమెంటు కట్టడం దేశభక్తి అయితే కేసీఆర్ కొత్త సచివాలయం కట్టడం మాత్రం మూఢ నమ్మకమవుతుందా?
అందువల్ల ఏం చెప్తున్నారన్నది కాదు ముఖ్యం. ఏం చేస్తున్నారన్నది! పరిపాలన వ్యాపారం కాదంటున్నవాళ్లే, ప్రైవేటు వ్యాపారులను పరిపాలనతో జోడిస్తున్నారు. తామూహించిన వైఫల్యం జరగలేదని బాధపడేవాళ్లు, జరుగుతున్న దాన్ని చూసి ఓర్వలేని వాళ్లు ఉండటం సహజం. కానీ 2014 కంటే ముందు బాగుందా? తర్వాతనా తేల్చుకోవాల్సింది మనమే! ‘సామాన్యుడా పన్ను కట్టు, సంపన్నులకు పంచిపెడ్తా’ అనేవాడు కావాలా? పేద కడుపునకు పెద్ద భరోసాగా నిలిచేవాడు కావాలా? నిర్ణయించుకోవాల్సింది మనమే!
వాజపేయి చెప్పినట్టు.. ‘ఎవరో ఏదో అనుకుంటారని నిజాన్ని దాచలేం. విద్వేషం కాదు; సోదరభావమే సమస్యలను పరిష్కరిస్తుంది. సర్వధర్మ సమభావన లేకుంటే ఇండియా ఇండియానే కాదు.’
రేపటి రోజున మనముందు రెండే ప్రశ్నలుంటాయి. మతమా? మన అభిమతమా? రాజకీయాన్ని గెలిపించడమా? మనల్ని మనం గెలిపించుకోవడమా?
– తిగుళ్ల కృష్ణమూర్తి