మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటుంబాన్ని పోషించుకునేటోడు. ఇది నెల కిందటి వరకు. ‘మార్పు రావాలి-కాంగ్రెస్ కావాలి’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాకతోనే మార్పు మొదలైంది. ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఊహించని మార్పు వచ్చింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి తలకిందులైంది. గిరాకీల్లేకపోవడంతో పొద్దంతా అడ్డా మీదనే కూర్చొని ఉత్తచేతులతోనే ఇంటికి వెళ్తున్నారు. కుటుంబంతో పాటు పస్తులుంటున్నారు.
మా సోదరుడు గతంలో పొద్దంతా ఆటో నడిపి, సమయానికి ఇంటికొచ్చి కుటుంబంతో హాయిగా ఉండేవాడు. కానీ, ఇప్పుడు ఉచిత బస్సు పుణ్యమాని గిరాకీల్లేక ఎప్పుడు పోతుండో, ఏ అద్దుమరాత్రి వస్తుండో అర్థం కాని పరిస్థితి. కనీసం బువ్వ కూడా తినడం లేదు. గత నెల రోజులుగా మా తమ్ముడు లెక్కనే రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాలు బాధపడుతున్నాయి. కుటుంబం గడుస్తలేదని మనోవేదనతో, ఫైనాన్షియర్లు పెట్టే వేధింపులు భరించలేక దాదాపు 14 మంది తనువు చాలించినట్టు వార్తల్లో చూశాం. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నది.
గత నెల రోజులుగా గిరాకీ లేకపోవడంతో తన భార్య తాళి తాకట్టు పెట్టి నా సోదరుడు ఆటో అద్దె కడుతుండు. ఇంతటి దుర్భర పరిస్థితి నా జీవితంలో వస్తుందనుకోలేదని మథనపడుతున్నాడు. బస్సుల్లో రద్దీ పెరగడంతో ఒకరిద్దరు దివ్యాంగులు మాత్రమే ప్రస్తుతం ఆటో ఎక్కుతున్నారు. విశాల హృదయంతో ఏ ఒక్కరైనా స్పందించకపోతారా అనే చిన్న ఆశతో ఈ కథనాన్ని రాస్తున్నా. నా సోదరుడి లెక్కనే ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్క ఆటో డ్రైవర్కు మేలు జరిగినా నా అక్షరాలకు అర్థం చేకూరినట్టే.
ఆటో నడుపుకొంటూ బతుకుతున్నోళ్ల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టింది. బువ్వ తిన్నా, తినకున్నా ఆటో అద్దె కట్టాల్సిందే. ఫైనాన్స్ వాళ్లు ఊరుకోరుగా. మరి ఆటో అద్దె కట్టేదెలా? ఫైనాన్స్లు, ఇతర ఈఎంఐలు, ఇంటి అద్దెలు చెల్లించేదెలా? ఇన్నేండ్లు గౌరవంగా బతికిన ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇన్ని రోజులు బస్తీల్లో గౌరవంగా బతికిన డ్రైవర్లు ఫైనాన్షియర్ల వేధింపులకు తాళలేక తనువులు చాలిస్తున్నారు. ఉచిత బస్సుకు ఆటోవాళ్లు వ్యతిరేకం కాదు, కానీ వారి బతుకులకు భరోసా లేకుండాపోయింది. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.12 వేలు ఏమూలకు సరిపోవు. దాన్ని రూ.25 వేలకు పెంచి వెంటనే అందించాలి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించి స్వయంగా సమస్యను తెలుసుకోవడంతో ఆటోడ్రైవర్లలో విశ్వాసం పెరిగింది. మా పక్షాన నిలబడే బలమైన నాయకుడు ఉన్నాడనే ధీమా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం చేస్తారనే నమ్మకం ఏర్పడింది.
కొందరు మేధావులు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి మద్దతుగా ఉచిత బస్సు పథకం వల్ల ఎలాంటి నష్టం జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల వల్ల ప్రైవేట్ బడులకు ఏమైనా నష్టం జరిగిందా? ప్రభుత్వ దవాఖానలతో ప్రైవేట్ ఆసుపత్రులకు నష్టం వస్తుం దా? అని చెప్తూ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఏం నష్టం వాటిల్లుతుందని గుడ్డిగా వాదిస్తున్నా రు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పాలి. నష్టం జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను అడగండి. వారి రోదన, దుఃఖాన్ని చూడండి. అనాథలైన చిన్నారుల దుస్థితిని చూసి మాట్లాడాలి.
ప్రజాపాలన అంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారేమో అనుకున్న. కానీ, కష్టం చేసుకొని బతికేటోళ్లను రోడ్డుపాలు చేస్తారనుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకతను కాంగ్రెస్ ఎదుర్కోకతప్పదు.
-గుండమల్ల సతీశ్ కుమార్
94931 55522