మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిని రంగంలోకి దింపి, ఆయనకు అనుకూలంగా సర్వశక్తులూ ఒడ్డి టీఆర్ఎస్ను ఓడించగలిగితే, రాష్ట్రమంతటా తమ కు అనుకూల వాతావరణం ఏర్పడగలదన్నది బీజేపీ మహా ఎత్తుగడ. కాని అది చివరికి విఫలమైంది. టీఆర్ఎస్ తాను 2018లో ఓడిన స్థానాన్ని ఈసారి అదే ప్రత్యర్థి నుంచి కైవసం చేసుకోవటం ఆ పార్టీకి బోనస్ వంటిది.
మునుగోడు ఉప ఎన్నికను కేవలం టీఆర్ఎస్ మెజారిటీ అనే ఛార్టర్డ్ అకౌంటెన్సీ లెక్కలను బట్టి చూస్తే అందులోని రాజకీయపరమైన అర్థ తాత్పర్యాలు బోధపడవు. నిజానికి ఆ లెక్కల ప్రకారం చూసినా ఈ విజయం ఘనమైదే. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి 61 వేల ఓట్లు రాగా, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాజగోపాల్రెడ్డి తెచ్చుక్నువి 99 వేల ఓట్లు. అనగా 38 వేలు అధికం. అది కాస్తా మారిపోయి ఈ సారి ప్రభాకర్ రెడ్డికి 11 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. అనగా రాజగోపాల్రెడ్డికి మొత్తం కొరత 49 వేల ఓట్లు. ఇందులో ఆయనకు పోయినసారి సీపీఐ నుండి వచ్చిన 10 వేల ఓట్లను మినహాయించినా ఈసారి కొరత 39 వేలు అవుతున్నది. అంతేకాదు, మొత్తం 15 రౌండ్ల లెక్కింపులో రాజగోపాల్రెడ్డి పట్ల మొగ్గు చూపినవి రెండే రెండు కాగా, తక్కిన 13లో టీఆర్ఎస్ది పై చేయి అయింది.
ఇదేవిధంగా మరికొన్ని గమనార్హమైన లెక్క ల గురించి చెప్పుకొనే ముందు, పైన అన్నట్లు ఈ ఎన్నికల్లో తెరవెనుక దాగి ఉన్న రాజకీయమైన అర్థతాత్పర్యాలు ఏమిటో ముందుగా చూద్దాం. అవి నిజానికి ఇప్పటికే కొంత చర్చలోకి వచ్చినప్పటికీ, ఈ సందర్భంగా తిరిగి సమీక్షించి గుర్తుచేసుకోవటం అవసరం. రాజగోపాల్రెడ్డితో పోటీ చేయించటం బీజేపీకి కేవలం ఆ ఒక్క సీటు గెలవటంతో నిమిత్తం ఉన్న విషయం కాదు. పైగా అది టీఆర్ఎస్ది కాదు. అదేవిధంగా, తమకు ఒక సీటు పెరిగినా అందువల్ల ఒరిగేదేమీ లేదు. వారి అసలు దృష్టి అంతా వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే. ఒకవేళ మునుగోడులో టీఆర్ఎస్ ఓడినట్లయితే, అది ఆ పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ అయి పార్టీ బలహీనపడగలదని, ఆ పార్టీ నాయకులను, శ్రేణులను గణనీయంగా తమ వైపు ఆకర్షించుకోవచ్చని, కాంగ్రెస్ను పూర్తిగా వెనుకకు నెట్టి తాము ఖచ్చితమైన రీతిలో ద్వితీయశక్తిగా ఆవిర్భవించవచ్చునన్నది బీజేపీ ఆలోచన. అంతేకాదు, ఇంకా వీలైతే మొన్నటి ఫామ్హౌజ్ మంత్రాంగం వంటివి మరింత జోరుగా సాగించి వచ్చే ఎన్నికలలోపే కేసీఆర్ ప్రభు త్వాన్ని పడగొట్టవచ్చునన్నది అంతిమ చాణక్యం.
ఈ ఒక్క ఉప ఎన్నిక వెనుక ఇన్నిన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి గనుకనే ఈ పథకాన్ని ఢిల్లీ నాయకత్వం జాగ్రత్తగా రచించి, ఇంత పట్టుదలగా అమలుపరిచి, అందుకు అవసరమైన ఆర్థిక వనరులను తమ అభ్యర్థికి సమకూర్చింది. ఇటువంటి వ్యూహాల అమలులో అనుభవజ్ఞులైన ఆర్ఎస్ఎస్ బృందాలను పెద్ద సం ఖ్యలోనే ముందుగా మునుగోడుకు తరలించిం ది. మునుగోడును గెలవటం, వీలైతే ప్రభుత్వాన్ని పడగొట్టడం, వచ్చేసారి అసెంబ్లీని చేజిక్కించుకోవటం చేసినట్లయితే, దానితో ఇక దక్షిణాదిన కర్ణాటక తర్వాత మరొక రాష్ట్రంలో పాగా వేయాలనే బీజేపీ లక్ష్యం నెరవేరినట్లు కూడా అవుతుంది.
వచ్చే ఎన్నికలకు కేవలం కొన్ని నెలలు మిగిలి ఉండగా ఇటువంటి రాజకీయ జూదానికి పూనుకోవటం వెనుక ఇన్నిన్ని దూరాలోచనలు, దురాలోచనలు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వానికి దాగి ఉన్నాయి. వారి దురదృష్టవశాత్తు ఈ పథకమంతా చిత్తుగా ఓడిపోయింది. అంతేకాదు, వారు తము పన్నిన వలలో తామే పడినట్లయింది. రాజగోపాల్రెడ్డి వంటి మహా ధనికుడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ల యంత్రాంగమంతా వెన్నుదన్నుగా నిలిచినా, కేంద్ర నాయకత్వం గణనీయమైన ఆర్థిక వనరులను తన వనరులకు అదనంగా సమకూర్చినా, 2018 నాటి ఆధిక్యాన్ని కోల్పోవటమే గాక 11 వేల ఓట్లకు కొరత పడి ఓడటమన్నది బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా ఎదురుదెబ్బ కానున్నది. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వెళ్లదలచినవారు గాని, ఇప్పటికే వెళ్లినవారు గాని ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి ఉంటుంది. ఫామ్హౌజ్ టేపుల కుంభకోణం ఇప్పటికే దేశవ్యాప్త సంచలనం సృష్టించి బీజేపీయేతర, ప్రజాస్వామిక శక్తులకు నైతిక బలాన్ని పెంచగా, ఆ పార్టీ మునుగోడు పన్నాగం ఈ రీతిన భంగపడటం ఆ బలాన్ని మరింత పెంచుతుంది.
ఇతరత్రా పరిశీలించినప్పుడు కూడా టీఆర్ఎస్ గెలుపులో గమనించదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. పైన చెప్పుకొన్నట్లు తనది కాని స్థానాన్ని గెలుచుకోవటం, మొత్తం 15 రౌండ్ల లెక్కింపులో కేవలం రెండింట స్వల్పంగా వెనుకబడటం మినహా 13 రౌండ్లలో తనది పైచేయి కావటం ఉండనే ఉన్నాయి. అదిగాక, గ్రామీణ మండలాలతో పాటు బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్న పట్టణ ప్రాంత మండలాలను కూడా గెలవటం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. అట్లాగే నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాలలోనూ టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ పట్టణాలలో విజయం సాధించగలదా అన్న సందేహాలు ఆ పార్టీ అభిమానులకు సైతం కొం తవరకు ఉండగా ఇప్పుడవి కొట్టుకుపోయా యి. తెలంగాణకు ముంచుకురావచ్చుననే బీజేపీ మతతత్వానికి ఇప్పుడు పగ్గాలు పడి రెం డు తెలుగు రాష్ర్టాల్లోని ప్రజాస్వామిక శక్తులకు మేధావి వర్గాలకు ఊపిరి సలిపినట్లవుతుంది. చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 30వ తేదీన బంగారి గడ్డ బహిరంగసభ ప్రసంగంలో ప్రకటించిన విధంగా, అందుకు ప్రజలు హర్షాతిరేకం వ్యక్తపరిచిన ప్రకారం, బీఆర్ఎస్కు ఈ ఎన్నిక గెలుపు పునాది రాయి అవుతున్నది.
టీఆర్ఎస్ గెలుపులో గమనించదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. పైన చెప్పుకొన్నట్లు తనది కాని స్థానాన్ని గెలుచుకోవటం, మొత్తం 15 రౌండ్ల లెక్కింపులో కేవలం రెండింట స్వల్పంగా వెనుకబడటం మినహా 13 రౌండ్లలో తనది పైచేయి కావటం ఉండనే ఉన్నాయి. అదిగాక, గ్రామీణ మండలాలతో పాటు బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్న పట్టణ ప్రాంత మండలాలను కూడా గెలవటం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం.
– టంకశాల అశోక్