దేశాని 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన అదానీ అనే ఓ వ్యక్తి శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది గత ఎనిమిదేండ్లలో చాలాసార్లు రుజువైంది. 2021లో అదానీ సంపద రూ.5,05,900 కోట్లు. 2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో ఆయన అనూహ్యంగా ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అంటే కేవలం ఏడాదిలోనే అతని సంపద 117 శాతం పెరిగింది. మొత్తంగా గత ఐదేండ్లలో అతని సంపద 1500 శాతం పెరిగింది. భారతీయ వ్యాపార చరిత్రలో ఇంత వేగంగా ఏ కంపెనీ ఆదాయం పెరగలేదు. తన వ్యాపార సామ్రాజ్యం ఈ స్థాయిలో ఆర్థికవృద్ధి సాధించిన ఘనత మాత్రం అదానీకి ఇవ్వలేం. ఎందుకంటే దాని వెనకాల ఉన్నది, ఆ ఘనత అందుకోవాల్సింది దేశ ప్రధానిగా ఉండి అదానీకి వ్యక్తిగత మంత్రిగా పనిచేస్తూ, అతని సంపద పెంచేందుకు శాయశక్తులా పనిచేసిన నరేంద్ర మోదీనే.
అదానీ కోసం ప్రధాని చేసిన విదేశీ యాత్రలెన్నో.. మచ్చుకు కొన్ని పర్యటనలను ప్రస్తావించుకుందాం. దక్షిణకొరియా ప్రధానితో మోదీ భేటీ కారణంగా ఆ తర్వాత అదానీ కంపెనీకి రూ.37 వేల కోట్ల ప్రాజెక్టు దక్కింది. ఆస్ట్రేలియా వాణిజ్యశాఖ మంత్రితో ప్రధాని మోదీ సమావేశం తర్వాత ఆ దేశంలో అప్పటిదాకా అదానీ కోల్ ప్లాంట్కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తన మిత్రుడి కోసం మోదీ ఎంతవరకైనా వెళ్లారు. అందులో భాగంగానే జరిగిన మరోరకమైన అధికార దుర్వినియోగాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రతిష్ఠాత్మకమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, విచారణ సంస్థలు మోదీ పంజరంలోని చిలుకల్లా ఎలా మారిపోయాయో, ప్రభుత్వరంగ సంస్థలు మోదీ మిత్రలాభం కోసం ఎలా సమాధి అవుతున్నాయో తెలుసుకుందాం.
ఎల్ఐసీ: అదానీ గ్రూప్లో ఈక్విటీ మొత్తం రూ.35,917.31 కోట్లు అని ఎల్ఐసీ పేర్కొన్నది. అయితే.. ఇక్కడ మొదటి ప్రశ్న ఏమంటే.. ఏ ప్రాతిపదికన ఇంత పెద్ద మొత్తంలో ఎల్ఐసీ ప్రజల సొమ్మును అదానీ గ్రూపులో పెట్టుబడిగా పెట్టిందనేదానికి సమాధానం లేదు. ఇక రెండో ప్రశ్న.. అదానీ సంస్థల ఆర్థిక శిఖరమంతా ఒక బోగస్ అని హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అందులోంచి తమ సంపదను వెనక్కి తీసుకున్నారు. కానీ ఎల్ఐసీ మాత్రం ఆ పని ఎందుకు చేయలేదు? తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని సులభంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఎల్ఐసీ ఆ పని చేయలేదు. దీంతో అదానీ సంపదతో పాటు ఎల్ఐసీ పెట్టుబడులు కరిగిపోయాయి. డిసెంబర్లో ఎల్ఐసీ హోల్డింగ్ల విలువ రూ.62,550 కోట్లు ఉంటే జనవరిలో రూ.56,142 కోట్లు, మార్చి మొదటివారంలో రూ.29,721 కోట్లకు పడిపోయింది. ప్రారంభంలో అదానీ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల మొత్తం కంటే కూడా దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో ఎల్ఐసీ చైర్మన్కు వరుసగా మూడోసారి పదవిని పొడిగించారు. అదానీ గ్రూపు కంపెనీల్లో అవకతవకలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు ఓ కమిటీ వేయడానికి కొద్దిరోజుల ముందే ఇది జరిగింది. వెంటనే హడావుడిగా మీడియా ముందుకొచ్చిన ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అదానీ కంపెనీలకు అనుకూలంగా మాట్లాడారు. అదానీ వ్యాపారాలపై తాము నమ్మకంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఎల్ఐసీ సంపదనే కాదు ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నాయి. ఒకప్పుడు ఎల్ఐసీ అంటే ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం ఇప్పుడు లేకుండా పోయింది.
స్టాక్ మార్కెట్లో అక్రమాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ సెబీ. అయితే అదానీ పోర్ట్స్ సీఈవో కరన్ అదానీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న సిరిల్ షోర్ఫ్ స్వయంగా మామ అవుతారు. సెబీలో కీలక పదవిలో కుటుంబసభ్యుడే ఉన్నప్పుడు విచారణ సాఫీగా, సజావుగా జరుగుతుందని ఎలా అనుకోగలం?
సెబీ: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, అక్రమాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ సెబీ. అయితే అదానీ పోర్ట్స్ సీఈవో కరన్ అదానీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న సిరిల్ షోర్ఫ్ స్వయంగా మామ అవుతారు. సెబీలో కీలక పదవిలో కుటుంబసభ్యుడే ఉన్నప్పుడు విచారణ సాఫీగా, సజావుగా జరుగుతుందని ఎలా అనుకోగలం? కొన్ని వారాల్లోనే దేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్లు తగ్గిపోయింది. అలాగే అదానీ గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12 లక్షల కోట్లకు పైగానే పడిపోయింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం సెబీ ప్రాథమిక బాధ్యత. కానీ అది మాత్రం నిశ్శబ్దంగా ఉండటానికే ఇష్టపడింది. ఇన్వెస్టర్లకు బదులు అదానీ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్క ఎల్ఐసీనో, సెబీనో కాదు, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఒక వ్యక్తి అయిన అదానీకి మేలు చేయడానికి ఉపయోగపడితే, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అతిపెద్ద కీలు బొమ్మలుగా మారడం ప్రజాస్వామానికే సిగ్గుచేటు.
‘తాను ఓ ఫకీరును.. జోలె వేసుకొని వెళ్లిపోతానంటూ’ వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రధాని మోదీ తెర వెనుకాల చేసేది మాత్రం మరొకటి. గత ఎనిమిదేండ్లుగా అదానీ అనే ఓ వ్యక్తికే మోదీ అంకితమయ్యారు.
తమ సొంత లాభం కోసం రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడి చేస్తూపోతున్నారు. తత్ఫలితంగా పెట్టుబడి ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గిపోయి అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డుమీద పడ్డది. మోదీ విధ్వంసకర విధానాల వల్ల ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగులు మనోవేదనలో ఉన్నారు. అదానీ విజయం కోసం తమకు మోదీ చేసిన గాయాలతో ఇతర వ్యాపారవేత్తలు రక్తమోడుతున్నారు. అయినా ఏ ఒక్క విచారణ సంస్థ కూడా దీనిపై కేసు నమోదు చేయడం లేదు. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియ మిత్రుడు. ఏ విచారణ సంస్థలు అటువైపు చూడకున్నా.. దేశం మాత్రం అన్నీ గమనిస్తున్నది. సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నది.
వై.సతీష్ రెడ్డి: 96414 66666
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)