‘కాంచి కాంచి కనులు/ కనుమేర దాటంగ, కనుపాపలను రెప్ప/ కబళించి వేసింది, కలలుగానివి గాథలూ చెలియలో/ కాలమ్ములో గల్సెనే… అడవి బ్రతుకై పోయెనే..’ అని తెలంగాణ తొలితరం కవి అడ్లూరి అయోధ్య రామయ్య వాపోయారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి దుస్థితే దాపురించింది. కంటిరెప్ప కనుపాపలను కబళించే కాలం వచ్చింది. కంచే చేనుమేసినట్లుగా దేశ సంపదను సంరక్షించాల్సిన వారే తెగనమ్మేస్తున్నారు. దేశప్రజలంతా తమ స్వేదంతో నిర్మించుకున్న, సృష్టించుకున్న జాతి సంపదను మోదీ సర్కారు అంగట్లో సరుకుగా అమ్మకానికి పెడుతున్నది! ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గత వారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను అమ్మటమే కాదు, ఆయా సంస్థల వద్ద ఉన్న స్థిరాస్తి భూముల నగదీకరణ (అమ్మకం) కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) అనే ప్రత్యేక సంస్థను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాట మాటకూ జాతీయత, దేశభక్తి గురించి మాట్లాడేవారే ఈ పనికి పూనుకోవటం విడ్డూరం, గర్హనీయం.
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన, జీవన నాణ్యత పెంపు కోసమని కేంద్రం ‘జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక’ (ఎన్ఐపీ)కి రూపకల్పన చేసింది. దీనికోసం 2020 నుంచి 2025 నాటికి రూ.111 లక్షల కోట్లు అవసరమని చెప్పుకొచ్చింది. ఏటా వేల కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2021-22లో రూ.78 వేల కోట్లు, 2022-23లో 65 వేల కోట్లు పోగు చేసే పేరుతో జాతి సంపదను అంగట్లో పెడుతున్నది. ప్రైవేటీకరిస్తున్న, మూతపడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, విక్రయానికి ఎస్పీవీ పనిచేస్తుందని కేంద్రపెద్దలు పేర్కొన్నారు. కానీ లాభాల్లో ఉంటూ కోట్లాది మంది భారతీయుల జీవన భద్రతకు భరోసాగా నిలుస్తున్న ఎల్ఐసీని కూడా ప్రైవేటుపరం చేయటం మాటకు, చేతకు పొంతనలేనితనాన్ని తెలియజెప్తున్నది.
ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణ కోసం ఏకంగా ప్రధాని మోదీయే అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో వెబినార్ నిర్వహించారు. ఆస్తుల అమ్మకాన్ని ఆదాయంగా కాకుండా, ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేదిగా భావించాలన్నారు. కానీ ఆస్తుల విక్రయం ఆర్థికవ్యవస్థకు ఏ విధంగా మేలు చేస్తుందో, ఆస్తులను అమ్ముతూ వస్తున్న కేంద్రప్రభుత్వాలు ఇప్పటికి ఎన్ని ఆస్తులను సృష్టించాయో దేశ ముఖచిత్రాన్ని చూస్తూనే తెలుస్తుంది. కాంగ్రెస్ పాలన అవినీతికీ, అసమర్థతకూ నెలవై పోయిందని విమర్శిస్తూ, పంచభూతాలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కుంచుకున్న వెంటనే ‘అతనికంటే ఘనుడు…’ అన్నట్లుగా పంచభూతాలనే కాదు, అష్టదిక్కులను సైతం అంగట్లో సరుకుగా అమ్మేస్తున్నారు. దేశమంటే మనుషులే కాదు, మట్టి కూడా. మట్టిని కూడా మార్కెట్లో పెడుతున్న మోదీ పాలనను పారదోలితేనే దేశానికి రక్ష.