‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ మోదీ ఇటీవల చెప్పుకొచ్చారు.
ఈ మధ్యన ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్కు చెందిన వారితో మోదీ సమావేశమై.. ఈ విషయాలు చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిలో అనేక రాష్ర్టాలకు చెందిన పిల్లలు ఉన్నా కూడా యూపీ వారితోనే ఆయన ఎందుకు భేటీ అయ్యారంటే.. ఆ రాష్ట్రంలో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే ఇంత సంక్షోభంలోనూ రాజకీయం వదలని మోదీ వైఖరి ఇది. దీని సంగతి పక్కనపెట్టి.. మోదీ చెప్పిన విషయంలోని నిజానిజాలేమిటో పరిశీలిద్దాం.
మోదీ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి మనదేశంలో 205 ప్రైవేటు, 189 గవర్నమెంటు కలిపి మొత్తంగా 404 మెడికల్ కాలేజీలు ఉండేవి. గతేడాదికి ఈ సంఖ్య 605కి పెరిగింది (ప్రైవేటు 303, ప్రభుత్వ 302 కాలేజీలు). వీటిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 90,825.
ఇదే ఏడేండ్లలో తెలంగాణలో వైద్యరంగంలో సంభవించిన మార్పులను పరిశీలిద్దాం. 2014లో తెలంగా ణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించేనాటికి ఉన్న మెడికల్ కాలేజీలు 20 మాత్రమే (ఐదు ప్రభుత్వ, 15 ప్రైవేటు). ఇప్పుడు వాటి సంఖ్య 33 కి పెరిగింది (10 ప్రభుత్వ, 23 ప్రైవేటు). ఇటీవలి రాష్ట్ర బడ్జెట్ ప్రకారం.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిప్రకారం.. ఇప్పుడున్న వాటిని మినహాయించి చూసినా ఇంకా కొత్తగా 20కిపైగా వైద్య కళాశాలలు ఏర్పాటవుతాయి. అంటే, తెలంగాణలో మొత్తం మెడికల్ కాలేజీ ల సంఖ్య మరో ఏడాదిలోపు దాదాపు 55కి చేరుకుంటుంది. 2014లో ఉన్న 20 కాలేజీలతో పోల్చి చూస్తే ఇది 175 శాతం వృద్ధి. కానీ, ఇదే కాలంలో మెడికల్ కాలేజీల పరంగా మోదీ ప్రభుత్వం సాధించిన అభివృ ద్ధి.. 50 శాతం కూడా లేదు.
దీనివల్లే దేశంలో వైద్యరంగం పరిస్థితి దారుణంగా ఉంది. అనేక దేశాలకన్నా భారత్ వెనుకబడి ఉన్నది. దేశ జనాభాకు వైద్యుల సంఖ్యకు పొంతన లేకుండా ఉన్నది. గతేడాది డిసెంబర్ నాటికి మనదేశంలో రిజిష్టరు అయిన వైద్యుల సంఖ్య 13 లక్షల ఒక వెయ్యి మంది. వీరిలో ఇప్పటికే చనిపోయిన, ప్రాక్టీసు మానివేసిన, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన డాక్టర్ల వివరాలను తొలగించలేదు. ఉదాహరణకు, 1913లో రిజిష్టర్ చేసుకొని గతంలోనే మరణించిన మహారాష్ట్రకు చెందిన ఓ డాక్టర్ వివరాలు ఇప్పటికీ ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీలో కొనసాగుతున్నాయి. ఇటువంటి డాక్టర్లు కనీసం 20 శాతం మంది ఉంటారనుకొని వారిని తొలగిస్తే.. దేశంలో ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల సంఖ్య రమారమి 10.41 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కన దేశ జనాభాకు అందుబాటులో ఉన్న వైద్యుల నిష్పత్తిని గణించాల్సి ఉంటుంది. దేశంలో ప్రస్తుతం 140 కోట్ల జనా భా ఉంది. అంటే ప్రతి వెయ్యిమందికి 0.74 డాక్టర్లు ఉన్నారు. దీనర్థం పదివేలమందికి దాదాపు ఏడుగురు వైద్యులున్నట్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు ప్రకారం వెయ్యిమందికి కనీసం ఒక్క డాక్టరైనా ఉండాలి. కానీ, మన వద్ద ఆ పరిస్థితి లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వైద్యులు, జనాభా నిష్పత్తి వివిధ దేశాల్లో ఎలా ఉందని పరిశీలిస్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా ఖతార్లో 7.7:1000 నిష్పత్తి ఉంది. ఆ తర్వాత స్థానాల్లో క్యూబా 6.7:1000; స్పెయిన్ 4.9:1000; స్విట్జర్లాండ్ 4:1000; ఆస్ట్రేలియా 3.2:1000; చైనా 1.5:1000 ఉన్నాయి.
డబ్ల్యూహెచ్ఓ సిఫారసు ప్రకారం వెయ్యిమందికి ఒక డాక్టర్ చొప్పున ఉండాలంటే, మనదేశంలో 140 కోట్ల జనాభాకు 14 లక్షల మంది వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 10.41 లక్షల మంది ఉన్నారు. ఇంకా దాదాపు మూడు లక్షల 60 వేల మంది అవసరం. దేశంలో పెరిగే జనాభా రేటును దృష్టిలో పెట్టుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దానిని పక్కనపెట్టినా.. ఇంకా 3.6 లక్షల మంది డాక్టర్లు వైద్యవిద్యను అభ్యసించి ప్రాక్టీస్ మొదలుపెట్టాలంటే.. ఎన్ని మెడికల్ కాలేజీలు కావాలి? ఒక కాలేజీ నుంచి ఏటా సగటున 150 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు వస్తారని అనుకుంటే.. 2400 కాలేజీలు అవసరం. కానీ, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తగా ఏర్పాటైన కాలేజీలు దాదాపు 200 మాత్రమే (400 నుంచి 605కు పెరిగాయి). ఎనిమిదేండ్లలో 200 కాలేజీల లెక్కన 2400 కాలేజీలు కొత్తవి ఏర్పాటు కావాలంటే.. మరో 96 ఏండ్లు పడుతుంది. ఇంతకాలం భారతదేశం వేచిఉండగలదా?
దశాబ్దాల పోరాటం తర్వాత కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఏ విధంగానూ సహకరించలేదు. అడుగడుగునా అడ్డంకులను సృష్టించింది. అయినా కూడా వైద్యరంగంలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించింది. జిల్లాకో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లక్ష్యంగా దూసుకుపోతున్నది. ఈ ఏడాది బడ్జెట్లో రికార్డుస్థాయిలో రూ.11,440 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.
దీనిద్వారా అర్థమవుతున్న విషయం ఏమిటి? జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దేశంలో వివిధ రాష్ర్టాల్లో ఉన్న అవసరాలేమిటో తెలియవు. తెలిసినా వాటిని తీర్చే విషయంలోగానీ, సమస్యలను పరిష్కరించే విషయంలోగానీ చిత్తశుద్ధితో వేగంగా నిర్ణయాలు తీసుకోవు. అదే ప్రాంతీయపార్టీలైతే స్థానిక అవసరాల పట్ల స్పష్టతను కలిగి ఉండి నిర్దిష్ట కార్యాచరణతో పని చేస్తాయి. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పాలన చూశాం. చూస్తున్నాం. వాటితో ఇక ముందు కూడా కొత్త అద్భుతాలు ఆవిష్కారం కాబోవు. దేశానికి కొత్త దశదిశ లభించాలంటే, భారతదేశం చైనాతో పోటీపడే ఆర్థికవ్యవస్థగా ఎదగాలంటే, ప్రపంచ వేదికపై సూపర్ పవర్గా తన ఉనికిని చాటుకోవాలంటే ప్రాంతీయపార్టీలతోనే సాధ్యమవుతుంది.
-కె.వి.రవికుమార్
ఒక కాలేజీ నుంచి ఏటా సగటున 150 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు వస్తారని అనుకుంటే.. వైద్యులు/జనాభా నిష్పత్తి ప్రకారం మనదేశంలో ఇంకా 2400 కాలేజీలు అవసరం. కానీ, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో కొత్తగా ఏర్పాటైన కాలేజీలు 200కు మించలేదు. ఎనిమిదేండ్లలో 200 కాలేజీల లెక్కన 2400 కాలేజీలు కొత్తవి ఏర్పాటు కావాలంటే.. మరో 96 ఏండ్లు పడుతుంది. ఇంతకాలం దేశం వేచిఉండగలదా?
ప్రచారార్భాటం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలుకాకముందు దాదాపు రెండు నెలలుగా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపించాయి. ఉక్రెయిన్లో వేలాదిమంది భారతీయ విద్యార్థులున్నారని కేంద్రానికి తెలుసు. కానీ, అప్పుడే వారిని తీసుకురాకుండా, యుద్ధం మొదలైన తర్వాత ‘ఆపరేషన్ గంగ’ అని పేరు పెట్టి తరలించటం ఎందుకు? అంటే.. ఇంతటి సంక్షోభంలో, 20 ఏండ్లు నిండని విద్యార్థులకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయ మైలేజీనే మోదీ సర్కార్ చూసిందనుకోవాలి. యుద్ధం మొదలు కాకముందు తీసుకొస్తే.. చడీచప్పుడూ లేకుండా జరిగిపోయేది. అదే, యుద్ధం మధ్యలో తెస్తే.. అది కూడా యూపీ తదితర రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే సమయంలో తీసుకొస్తే ఆ ప్రచారం, ఆ ఆర్భాటం వేరు.